Ethiopia Volcanic ash Cloud: ఆఫ్రికాలో అగ్నిపర్వతం బద్దలు.. ఢిల్లీని తాకిన బూడిద మేఘాలు
ABN , Publish Date - Nov 25 , 2025 | 10:06 AM
ఇథియోపియా అగ్నిపర్వతం బద్దలవడంతో ఎగసిపడ్డ బూడిద మేఘాలు ఢిల్లీ గగనతలంలోకి ప్రవేశించాయి. ఇవి వేల అడుగుల ఎత్తులో ఉండటంతో నగరంలో గాలి నాణ్యతపై ఎలాంటి ప్రభావం ఉండదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆఫ్రికా దేశం ఇథియోపియాలోని అగ్ని పర్వతం హేలి గుబ్బి ఆదివారం బద్దలైన విషయం తెలిసిందే. దాదాపు 12 వేల ఏళ్ల తరువాత అగ్నిపర్వతం బద్దలు కావడంతో అక్కడ స్వల్ప భూకంపం కూడా సంభవించింది. అగ్ని పర్వత విస్ఫోటనం కారణంగా దట్టమైన పొగ, బూడిద 15 కిలోమీటర్ల ఎత్తుకు ఎగసి పడింది. భారత ఉపఖండం వైపు ప్రయాణించిన ఈ బూడిద మేఘాలు ఢిల్లీ గగనతలంలోకి ప్రవేశించాయి. వేల అడుగుల ఎత్తున ప్రయాణిస్తున్న ఈ మేఘాలు తొలుత గుజరాత్లో ప్రవేశించి, అనంతరం రాజస్థాన్, ఢిల్లీ వైపు మళ్లాయి. (Volcanic Ash Clouds Reach Delhi).
ఈ విషయంలో డీజీసీఏ ఇప్పటికే విమానయాన సంస్థలను హెచ్చరించింది. బూడిద మేఘాలతో సమస్య లేకుండా ఫ్లైట్ల మార్గాన్ని మార్చుకోవాలని సూచించింది. మార్గమధ్యంలో ఈ దుమ్మూధూళి మేఘాలు ఎదురైతే వెంటనే తమకు సమాచారం అందించాలని కూడా తెలిపింది. ఇంజన్ పనితీరులో మార్పులు, కేబిన్లో పొగలు, దుర్వాసన వంటివి తలెత్తిన వెంటనే తమను అప్రమత్తం చేయాలని తెలిపింది. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్జెట్ సంస్థల సర్వీసులకు ఆటంకాలు ఏర్పడ్డాయి.
ఈ మేఘాల్లో అధిక శాతం సల్ఫర్డయాక్సైడ్, బూడిద ఉన్నాయని వాతావరణ శాస్త్ర నిపుణులు ఒకరు తెలిపారు. మేఘాలు చాలా ఎత్తులో ఉండటంతో ఢిల్లీలో వాయు నాణ్యతపై ప్రభావం తక్కువగా ఉంటుందని వివరించారు. అయితే, నేపాల్, ఉత్తరాఖండ్ వంటి ప్రాంతాల్లో మేఘాలు అక్కడి కొండలను తగిలి నేలకు సమీపంలోకి చేరే అవకాశం ఉందని అంటున్నారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో వాయునాణ్యత స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
బెంగాల్లో కొత్త బాబ్రీ మసీద్కు పునాది వేస్తాము.. తృణమూల్ ఎమ్మెల్యే సంచలన ప్రకటన
ఆహార ఉత్పత్తులపై ఓఆర్ఎస్ లేబుల్స్ను వెంటనే తొలగించాలి.. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి