Jagdeep Dhankhar: పార్లమెంటే సుప్రీం
ABN , Publish Date - Apr 23 , 2025 | 03:36 AM
పార్లమెంటే సుప్రీం, ప్రజాప్రతినిధులే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తారని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి వ్యాఖ్యలు జాతీయ ప్రయోజనాల కోసమే ఉండాలన్నారు.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్, పార్లమెంటే సుప్రీం.. అని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థ పార్లమెంట్ పరిధిలోకి ప్రవేశించకూడదని, ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తారని తేల్చి చెప్పారు. రాజ్యాంగ పదవులు అలంకారప్రాయమైనవని ఇటీవల కొందరు అభిప్రాయ పడుతున్నారన్నారు. ‘రాజ్యాంగపరమైన అంశాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజాప్రతినిధులే అంతిమ నిర్ణేతలు. రాజ్యాంగంలో పార్లమెంట్ కంటే అత్యుత్తమమైనది ఉందని ఎక్కడా చెప్పలేదు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు చెప్పే ప్రతి మాట జాతీయ ప్రయోజనాలను ఉద్దేశించినదే అయి ఉంటుంది.’ అని ఆయన స్పష్టం చేశారు. ధన్ఖడ్ వ్యాఖ్యలపై ఎంపీ కపిల్ సిబాల్ కౌంటరిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిర్దేశించిన పనులను ఆయా శాఖలు సరిగా చేయకపోతే జోక్యం చేసుకునే హక్కు న్యాయవ్యవస్థకు ఉందని స్పష్టం చేశారు.