Justice Yashwant Varma: జస్టిస్ వర్మ అభిశంసనపై సంతకాలు షురూ.!
ABN , Publish Date - Jul 09 , 2025 | 03:31 PM
లోక్సభలో జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానానికి కనీసం 100 మంది ఎంపీల సంతకాలు అవసరం. తీర్మానంపై ఎంపీలు సంతకం చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే..

న్యూఢిల్లీ, జులై 9: నగదు కట్టల కుంభకోణం కేసులో న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మని తొలగించాలని కేంద్రం, పార్లమెంటులో తీర్మానం తీసుకురానుంది. ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టవచ్చని, దీనికి ప్రతిపక్ష పార్టీల మద్దతు సైతం ప్రభుత్వానికి ఉందని సమాచారం. లోక్సభలో ఈ తీర్మానానికి కనీసం 100 మంది ఎంపీల సంతకాలు అవసరం. తీర్మానంపై ఎంపీలు సంతకం చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపాదన అందిన తర్వాత దీనిపై దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేయబడుతుంది.
న్యూఢిల్లీలోని జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో పెద్ద మొత్తంలో లెక్కల్లో లేని డబ్బు కట్టలు దొరికిన సంగతి తెలిసిందే. దీంతో జస్టిస్ వర్మపై అభిశంసన చర్యలను ప్రారంభించడంపై ఏకాభిప్రాయం కోసం కేంద్రం, ఆయా రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతోంది. న్యాయమూర్తిని తొలగించాలని కోరుతూ అధికారిక తీర్మానాన్ని ప్రతిపాదించడానికి అవసరమైన మద్దతును పొందేందుకు ప్రభుత్వం లోక్సభ, రాజ్యసభలోని అన్ని ప్రధాన పార్టీలను సంప్రదించింది.
ఇప్పటికీ జస్టిస్ వర్మపై చర్యలు లేకపోవడంపై పలువురు ఎంపీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు అంతర్గతంగా ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ, జస్టిస్ వర్మ తొలగింపును సిఫార్సు చేసినట్లు తెలిసింది. నోట్ల కట్టలు మంటల్లో కాలిపోయిన ఘటన జరిగిన సమయంలో ఢిల్లీ హైకోర్టుకు డిప్యుటేషన్పై ఉన్న జస్టిస్ వర్మను తరువాత అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. అయితే, జస్టిస్ వర్మ తనపై వచ్చిన అన్ని ఆరోపణలను ఖండించారు. అంతేకాకుండా మంటల్లో కాలిపోయిన, ఇంకా స్వాధీనం చేసుకున్న డబ్బు కట్టలు తనవి కాదని వాదించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
AV Ranganath: ఒవైసీ ఫాతిమా కాలేజీపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ
Virat Kohli On His Retirement: గడ్డం వల్లే కోహ్లీ రిటైర్మెంట్.. ఈ లాజిక్ మామూలుగా లేదుగా!