Delhi Building Collapse: అకస్మాత్తుగా కూలిన నాలుగు అంతస్తుల భవనం.. సీటీటీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు
ABN , Publish Date - Apr 19 , 2025 | 03:49 PM
ఢిల్లీలో శనివారం తెల్లవారుజామున నాలుగు అంతస్తుల భవనం ఒకటి అకస్మాత్తుగా కూలడంతో నలుగురు దుర్మరణం చెందారు. క్షతగాత్రుల్లో 14 మందిని అత్యవసర సిబ్బంది రక్షించగా మరో 10 మంది వరకూ శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అధికారులు పేర్కొన్నారు.

ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శక్తి విహారం ప్రాంతంలోని ఓ నాలుగు అంతస్తుల భవనం తెల్లవారుజామున 3.02 గంటల సమయంలో ఒక్క సారిగా కూలిపోయింది. ఈ ఘటనలో నలుగు ప్రాణాలు పోగొట్టుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు అత్యవసర సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇందుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ నెట్టింట వైరల్ అవుతోంది.
తొలుత భవనంలోని ఒక భాగం సడెన్గా కూలిపోయింది. ఆ మరుక్షణమే మొత్తం భవనం కుప్పకూలింది. క్షణాల వ్యవధిలో భవనం మొత్తం నేలమట్టమైంది. భవనం కూలడంతో భారీ ఎత్తున రేగిన దుమ్ము, ధూళి ఆ ప్రాంతాన్నంతా మేఘంలా ఆవరించింది. చుట్టుపక్కల ఏమున్నదీ కనిపించనంత స్థాయిలో దుమ్ము ఎగసి పడింది. సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన ఈ భయానక దృశ్యాలు ప్రస్తుతం నెట్టంట కలకలం రేపుతున్నాయి.
ఒక్కసారిగా భవనం కూలడంతో శిథిలాల కింద 22 మంది చిక్కుకుపోయారని పోలీసుల తెలిపారు. 14 మందిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగామని, మరో పది మంది వరకూ శిథిలాల కింద ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.
యూపీలోని మీరట్లో వెలుగు చూసిన మరో ఘటనలో ఇంటిపై కప్పు కూలి ఓ మహిళ ఆమె తొమ్మిది నెలల కూతురు దుర్మరణం చెందారు. శుక్రవారం భారీ వర్షం కురిసిన నేపథ్యంలో ఇంటిపై కప్పు కూలింది. లీసాగడీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. బాధితులందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు.
ఇవి కూడా చదవండి:
వచ్చే నెలలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను భారతీయ గగనయాత్రికుడు శుభాంశూ శుక్లా..
బెంగాల్ ఘటనలపై బంగ్లా అనుచిత వ్యాఖ్యలు.. ఖండించిన భారత్
ఎలాన్ మస్క్తో టెక్ సహకారంపై మాట్లాడిన ప్రధాని మోదీ