Share News

Boycott Turkey: తుర్కియేకు సీఏఐటీ షాక్.. వర్తక, వాణిజ్య సంబంధాలు నిలిపివేత..

ABN , Publish Date - May 16 , 2025 | 03:34 PM

తుర్కియే, అజర్‌బైజాన్‌తో ట్రావెల్, టూరిజం సహా అన్ని సంబంధాలను పూర్తిగా బాయ్‌కాట్ చేస్తున్నట్టు సీఏఐటీ నిర్వహించిన నేషనల్ ట్రేడ్ కాన్ఫరెన్స్‌లో 125కు పైగా టాప్ ట్రేడ్ లీడర్లు నిర్ణయించారు.

Boycott Turkey: తుర్కియేకు సీఏఐటీ షాక్.. వర్తక, వాణిజ్య సంబంధాలు నిలిపివేత..

న్యూఢిల్లీ: భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' వేళ పాక్‌కు మద్దతిచ్చిన తుర్కియే (Turkey), అజర్‌బైజాన్‌ (Azarbaijan)కు ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ (CAIT) షాక్ ఇచ్చింది. తుర్కియేతో అన్నిరకాల వాణిజ్య, వర్తక సంబంధాలను బాయ్‌కాట్ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ట్రావెల్, టూరిజం సహా ఆ దేశంతో అన్ని సంబంధాలను పూర్తిగా బాయ్‌కాట్ చేస్తున్నట్టు సీఏఐటీ నిర్వహించిన నేషనల్ ట్రేడ్ కాన్ఫరెన్స్‌లో 125కు పైగా టాప్ ట్రేడ్ లీడర్లు నిర్ణయించారు. టర్కీ, అజర్‌బైజాన్‌లో సినిమాలు షూటింగ్ చేయవద్దని కూడా భారత చలనచిత్ర పరిశ్రమకు ట్రేడ్ కమ్యూనిటీ విజ్ఞప్తి చేసింది. అక్కడ సినిమాలు షూట్ చేస్తే ట్రేడ్ కమ్యూనిటీతోపాటు, ప్రజలంతా ఆ చిత్రాలను బాయ్‌కాట్ చేస్తారని హెచ్చరించింది. ఆ దేశాల్లో ఉత్పత్తి ప్రమేషన్‌లను ఏ కార్పొరేట్ సంస్థ షూట్ చేయరాదని సైతం సదస్సులో నిర్ణయించారు.

Rajnath Singh: పాక్‌కు రుణం ఇవ్వడంపై ఐఎంఎఫ్ పున:పరిశీలించాలి: కేంద్రమంత్రి..


సీఏఐటీ ట్రేడ్ కాన్ఫరెన్స్‌లో 24 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంఘీభావం తెలిపారు. భారత్‌కు వ్యతిరేకంగా నిలిచే శక్తులను వ్యతిరేకించాలని ప్రతినబూనారు. భారతదేశం ఇటీవల తీవ్రమైన జాతీయ భద్రతా సవాళ్లను ఎదుర్కొన్న సమయంలో పాక్‌కు తుర్కియే, అజర్‌బైజాన్ దేశాలు మద్దతు ప్రకటించాయి. ఈ దేశాలు సంక్షోభంలో పడినప్పుడు ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం మానవతాసాయంతోపాటు దౌత్యపరంగా ఆదుకుందని, అయితే ఈ రెండు దేశాలు భారత్‌ పట్ల వంచనకు పాల్పడ్డాయని వాణిజ్య వర్గాలు విమర్శలు గుప్పించాయి.


భారతదేశ గుడ్‌విల్, అసిస్టెన్స్, వ్యూహాత్మక మద్దతు వల్ల తుర్కియే, అజర్‌బాజాన్ ప్రయోజనం పొంది ఇప్పుడు అంతర్జాతీయ ఉగ్రవాదానికి పెట్టింది పేరైనా పాకిస్థాన్‌కు మద్దతు పలకడం దురదృష్టకరమని సీఏఐటీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు. తుర్కియే, అజర్‌బైజాన్ చర్యలను భారతదేశ సార్వభౌమాధికారం, జాతీయ ప్రయోజనాలపై దాడిగా పేర్కొన్నారు. 140 కోట్ల భారతీయుల భావోద్వేగాలపై దాడి జరిపారని తప్పుపట్టారు.


అంతర్జాతీయ వేదికలపై తుర్కియే భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, తుర్కియేతో అజర్‌బైజాన్ అంటకాగుతూ పాక్ ప్రజలకు మద్దతివ్వడం భారత మైత్రీసహకారాలను అగౌరవపరచడమేనని సదస్సులో ట్రేడ్ నేతలు అన్నారు. ఈ చర్యలను భారత వ్యతిరేక చర్యలుగా భావిస్తున్నట్టు సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భారితియా పేర్కొన్నారు. ఇలాంటి దేశాలకు భారత్ ఎలాంటి ఆర్థికసాయం కానీ, ట్రేడ్ ప్రయోజనాలు కానీ కల్పంచరాదని సదస్సు ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు చెప్పారు. తుర్కియే కంపెనీ సెలెబి గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన సెక్యూరిటీ క్లియరెన్స్‌ను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ట్రేడర్లు స్వాగతించారు. తొమ్మిది ఇండియన్ ఎయిర్‌పోర్ట్‌లను ఈ సంస్థ ఆపరేట్ చేస్తోంది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది.


ఇవి కూడా చదవండి..

Defence Budget: ఆపరేషన్ సిందూర్ సక్సెస్.. ఆర్మీకి మరో 50 వేల కోట్ల నిధులు

Indian Army Encounter: పల్వామాలో ఎన్‌కౌంటర్.. 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదుల హతం..

Updated Date - May 16 , 2025 | 04:05 PM