Free Electricity: ప్రజలకు ముఖ్యమంత్రి బంపర్ ఆఫర్.. ఆగస్టు నుంచి ఉచిత కరెంట్
ABN , Publish Date - Jul 17 , 2025 | 10:50 AM
Free Electricity: ప్రజలకు ముఖ్యమంత్రి గుడ్న్యూస్ చెప్పారు. ఆగస్టు నుంచి ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పారు. ఇక, 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 1.67 కోట్ల మంది ప్రజలు లబ్ది పొందనున్నారు.

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. త్వరలో రాష్ట్రంలో ఉచిత కరెంట్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. గురువారం ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘మొదటి నుంచి రాష్ట్రంలోని ప్రజలందరికీ సరసమైన ధరలకే విద్యుత్ అందిస్తున్నాము. ఆగస్టు 1వ తేదీ నుంచి ఉచిత విద్యుత్ అమలవుతుంది. జులై నెల బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు.
125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 1.67 కోట్ల మంది ప్రజలు లబ్ది పొందనున్నారు. రానున్న మూడేళ్లలో.. ప్రజల అంగీకారంతో వారి ఇళ్లపై లేదా ప్రభుత్వ స్థలాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నాము. కుటిర్ జ్యోతి స్కీమ్ కింద పేదవారి ఇళ్లపై ఫ్రీగా సోలార్ ప్లాంట్లు అమరుస్తాము. మిగిలిన వారికి ప్రభుత్వం ఆర్థిక మద్దతు ఇస్తుంది. రానున్న మూడేళ్లలో రాష్ట్రంలో పది వేల మెగావాట్ల సోలార్ ఎనర్జీ అందుబాటులో ఉంటుంది’ అని అన్నారు.
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల వివరాలు..
క్రితం ఎన్నికలు అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య కాలంలో మూడు దశల్లో జరిగాయి. 2020, అక్టోబర్ 28వ తేదీన 71 స్థానాలకు.. నవంబర్ 3వ తేదీన 94 స్థానాలకు.. నవంబర్ 7వ తేదీన 78 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో మహాగట్బంధన్ కూటమి 110 స్థానాలు గెలుచుకుంది. మరోసారి నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ సారి ఎన్నికలు 2025 అక్టోబర్ నుంచి నవంబర్ వరకు జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో నితీశ్ ప్రభుత్వం ప్రజలను ఆకర్షించే పనిలో పడింది.