Ayyappa Devotees Can Now Carry Irumudi: విమానంలోకి ఇరుముడిని తీసుకెళ్లొచ్చు
ABN , Publish Date - Nov 29 , 2025 | 03:26 AM
విమానంలో శబరిమల వెళ్లాలనుకుంటున్న అయ్యప్ప స్వామి భక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు శుభవార్త చెప్పారు....
అయ్యప్ప భక్తులకు పౌర విమానాయన శాఖ శుభవార్త
క్యాబిన్ బ్యాగేజీ కింద అనుమతిచ్చేందుకు ఓకే
జనవరి 20 వరకు మాత్రమే వెసులుబాటు
కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు
ఇప్పటిదాకా చెక్-ఇన్ లగేజీలోనే అనుమతి
న్యూఢిల్లీ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : విమానంలో శబరిమల వెళ్లాలనుకుంటున్న అయ్యప్ప స్వామి భక్తులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు శుభవార్త చెప్పారు. అయ్యప్ప స్వాములు అత్యంత పవిత్రంగా భావించే ఇరుముడిని (కొబ్బరికాయతో సహా) తమతోపాటే నేరుగా విమానంలో తీసుకెళ్లేందుకు (క్యాబిన్ బ్యాగేజీ కింద) అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రత్యేక సడలింపు జనవరి 20 వరకు దేశవ్యాప్తంగా వర్తిస్తుందని తెలిపారు.
ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బందికి అయ్యప్ప భక్తులు సహకరించాలని, ఇరుముడి స్ర్కీనింగ్, తనిఖీల సందర్భంలో అధికారుల సూచనలను అనుసరించాలని సూచించారు. ఇప్పటి వరకూ అమలులో ఉన్న భద్రతా నియమావళి ప్రకారం ఇరుముడిని చెక్-ఇన్ లగేజీగా మాత్రమే విమానాల్లో అనుమతిస్తున్నారు. దీనిపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో భక్తుల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్న పౌర విమానయాన శాఖ.. ఇరుముడిని చేతబట్టుకునే విమానంలో ప్రయాణించే వెసులుబాటు కల్పించింది.
ఈ మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఓ వీడియోను విడుదల చేశారు. ‘శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తుల భావోద్వేగాలను గౌరవిస్తూ.. ఇరుముడిని తమతోపాటు నేరుగా విమానంలో తీసుకెళ్లేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నా. అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తూనే భక్తుల సంప్రదాయలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Prime Minister Narendra Modi visited Udupi Math: ఇది నవ భారతం
Putin to Visit India: 4న భారత్కు పుతిన్