Air India: ఎయిర్ ఇండియా, బోయింగ్లపై న్యాయపోరాటం.. విమాన ప్రమాద బాధితుల నిర్ణయం
ABN , Publish Date - Jul 01 , 2025 | 02:57 PM
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన పరిహారం పెంపు కోసం యూకేలోని బాధిత కుటుంబాలు కోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది. ఎయిర్ ఇండియాతో పాటు బోయింగ్పై కూడా కేసు వేసేందుకు నిర్ణయించుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తాలూకు పరిహారాన్ని పెంచాలంటూ బాధిత కుటుంబాలు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. బ్రిటన్కు చెందిన బాధిత కుటుంబాలు చట్టపరమైన చర్యలకు సిద్ధమైనట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. పరిహారం పెంపు కోసం అక్కడి కోర్టుల్లోనే కేసు వేయనున్నారని సమాచారం.(UK families sue Air India, Boeing).
ఎయిర్ ఇండియాతో పాటు విమానాల తయారీ సంస్థ బోయింగ్పై కూడా కేసు వేసేందుకు బాధితులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ న్యాయసేవల సంస్థ ‘కీస్టోన్ లా’ను కూడా సంప్రదించినట్టు తెలిసింది. పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ కేసు దాఖలు చేయనున్నారు. ఈ వార్తలపై కీస్టోన్ లా సంస్థ కూడా స్పందించింది. బాధితులు కొందరు తమను సంప్రదించారని, ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది.
ఇటీవల అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు మరణించారు. ఒకే ఒక ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డారు.
ప్రస్తుతం ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బాధితులకు తొలుత ఎయిర్ ఇండియా రూ.కోటి పరిహారాన్ని ప్రకటించింది. ఆ తరువాత మరో రూ.25 లక్షల పరిహారం ఇస్తున్నట్టు పేర్కొంది. బాధిత కుటుంబాల తక్షణ ఆర్థిక అవసరాలు తీర్చేందుకు అదనపు పరిహారం ప్రకటించినట్టు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
ఐఏఎస్ అని చెప్పుకుంటూ దర్జాగా కారులో షికార్లు.. పోలీసులకు చిక్కిన నిందితుడు
అగ్ని-5 బంకర్ బస్టర్ మిసైల్ అభివృద్ధికి నడుం కట్టిన డీఆర్డీఓ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి