Air India: విమాన ప్రమాదం.. డీఎన్ఏ శాంపిల్స్ ఇచ్చేందుకు బీజే ఆసుపత్రికి మృతుల కుటుంబీకులు
ABN , Publish Date - Jun 13 , 2025 | 09:23 PM
విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబీకులు తమ డీఎన్ఏ శాంపిల్స్ ఇచ్చేందుకు ఆహ్మదాబాద్లోని బీజే ఆసుపత్రికి వస్తున్నారు. వారి రోదనలు మిన్నంటడంతో ఆసుపత్రిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలో 241 మంది దుర్మరణం చెందారు. అగ్నికీలల్లో చిక్కుకుని మృతదేహాలు గుర్తు పట్టలేనంగా కాలిపోయాయి. దీంతో, అధికారులు ప్రయాణికులను డీఎన్ఏ టెస్టుల ద్వారా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రయాణికుల బంధువుల నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఈ క్రమంలో అహ్మదాబాద్లోని బీజే మెడికల్ కాలేజీలో విషాద వాతావరణం నెలకొంది. తమ డీఎన్ఏ శాంపిల్స్ ఇచ్చేందుకు మృతుల కుటుంబీకులు విషణ్ణ వదనాలతో ఆసుపత్రికి వస్తున్నారు. శాంపిల్స్ ఇచ్చేందుకు కొందరు, తమ వారి మృతదేహాలను స్వాధీనం చేసుకునేందుకు మరికొందరు ఎదురు చూస్తున్నారు.
సోనల్ జోషి తన సోదరుడితో సహా శాంపిల్స్ ఇచ్చేందుకు అక్కడకు వచ్చారు. ఆమె సోదరుడి భార్య విమాన ప్రమాదంలో మృతి చెందారు. శాంపిల్ ఇచ్చేందుకు వచ్చి కన్నీటిపర్యంతం అవుతున్న సోదరుడిని ఊరడించలేకపోయారు. మృతురాలి మెడలో రుద్రాక్ష కూడా ఉంటుందని చెప్పారు.
ఈ ప్రమాదంలో హీర్, ధీర్ బక్షీలు కూడా కన్నుమూశారు. వారితో పాటు ఆమె తల్లి కూడా ప్రయాణించాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆమె జర్నీని వాయిదా వేసుకోక తప్పలేదు. కూతుళ్ల మృతి వార్త విని కన్నీటి పర్యంతమైన ఆమెను ఊరడించడం ఎవ్వరి తరం కాలేదు. తానూ వారితో పాటు వెళ్లి ఉంటే ఇంతటి బాధ ఉండేది కాదంటూ విలపించడం అక్కడి వారిని కలచి వేసింది.
ఈ ప్రమాదంలో 53 మంది బ్రిటన్ వాసులు కూడా మృతి చెందారు. శాంపిల్స్ ఇచ్చేందుకు వారి బంధువులు ఇంకా ఆసుపత్రికి రావాల్సి ఉంది. ఇక విమానం కూలడంతో మెడికల్ కాలేజీలోని కొందరు సిబ్బంది కూడా మృతి చెందారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఇవీ చదవండి:
భర్త హత్యకు తొలుత రూ.4లక్షల సుపారీ.. ఆపై రూ.20లక్షలకు పెంపు
హైపర్ సోనిక్ మిసైల్స్తో ప్రమాదం.. ఇస్రో మాజీ చీఫ్ కీలక కామెంట్స్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి