Punjab: కల్తీ మద్యం తాగి 17 మంది మృతి
ABN , Publish Date - May 14 , 2025 | 04:40 AM
పంజాబ్లో కల్తీ మద్యం తాగి 17 మంది చనిపోయారు, మరణాలపై సీఎం భగవంత్ మాన్ హత్యలుగా పేర్కొనగా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మృతుల్లో ఎక్కువ మంది కూలీలు ఉన్నారు.

పంజాబ్లో ఘటన.. మృతుల్లో అత్యధికులు కూలీలు
ఇవి మరణాలు కావు... హత్యలు, బాధ్యులను వదిలిపెట్టం
కఠినంగా శిక్షిస్తాం: పంజాబ్ సీఎం భగవంత్ మాన్
చండీగఢ్, మే 14: పంజాబ్లోని అమృత్సర్ జిల్లాలో కల్తీ మద్యం తాగి మంగళవారం 17మంది చనిపోయారు. ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చనిపోయినవారిలో ఎక్కువ మంది రోజువారీ కూలీలు ఉన్నారు. జిల్లాలోని భంగాళీ, పాతల్పురి, మరారీకలాన్, థేరేవాల్ గ్రామాల్లో సోమవారం రాత్రి పలువురు కల్తీ మద్యం తాగినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. మరణాలపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ‘‘ఇవి మరణాలు కావు. హత్యలు. బాధ్యులను వదిలిపెట్టబోం. కఠినంగా శిక్షిస్తాం’’ అని ఎక్స్లో పోస్టు చేశారు.