TGRTC Tour Packages: ఖర్చు తక్కువ..ఎంజాయ్ బోలెడు.. ఆర్టీసీ టూర్ ప్యాకేజ్
ABN , Publish Date - Jun 13 , 2025 | 11:03 AM
TGRTC Tour Packages: తక్కువ ఖర్చుతో పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకే వారికి ఆర్టీసీ బంపరాఫర్ ఇచ్చింది. ప్రత్యేక టూర్ ప్యాకేజీతో భక్తి, విహార యాత్రలకు వెళ్లే అవకాశం కల్పిస్తోంది ఆర్టీసీ.

వరంగల్, జూన్ 13: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC) సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది. సాధారణంగా ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే వారు ప్రైవేటు బస్సులు, ట్రావెల్స్తో మాట్లాడి వాహనాలను బుక్ చేసుకుంటారు. వీరి ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. ఇలాంటి వారి కోసం ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే వారి కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని కల్పించింది. వరంగల్ రీజియన్ పరిధిలోని తొమ్మిది డిపోల నుంచి పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలకు వెళ్లేలా ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
వరంగల్ రీజియన్ పరిధిలోని తొమ్మిది డిపోల నుంచి పంచారామాలు, అరుణాచలం వంటి పుణ్యక్షేత్రాలతో పాటు బోథ్ వంటి పర్యాటక ప్రదేశాలకు కూడా ప్రత్యేకంగా టూర్ బస్సులను నడిపిస్తున్నట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ విజయభాను వెల్లడించారు. విహారయాత్రకు వెళ్లాలనుకునే ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు పుణ్యక్షేత్రాలకు, పర్యాటక ప్రదేశాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలియజేశారు.
పంచారామాలు రెండు రోజులు, అరుణాచలం పుణ్యక్షేత్రాలకు మూడు రోజుల పాటు యాత్ర సాగనుంది. ఇక ములుగు జిల్లాలోని బోథ్ జలపాతానికి కూడా ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కల్పించింది ఆర్టీసీ. భక్తి, విహారయాత్రకు వెళ్లాలనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ట్రిప్ను ఎంజాయ్ చేయండి అంటూ ప్రయాణికులకు ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు.
అరుణాచలం: డీలక్స్ బస్సులో అరుణాచలం పుణ్యక్షేత్రంతో పాటు మరికొన్ని క్షేత్రాలను కూడా చుట్టేయొచ్చు. మూడు రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. ముందుగా డీలక్స్ బస్సు హనుమకొండ బస్టాండ్ నుంచి బయలుదేరి జోగులాంబ మీదుగా కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, బీచుపల్లి ఆలయాలకు వెళ్తుంది. అక్కడ దర్శనాలు ముగిసిన తర్వాత తిరిగి వరంగల్కు బయలుదేరనుంది. ఈ పర్యటన కోసం ఒక్కొక్కరి నుంచి రూ.2800 చార్జ్ చేయనున్నారు.
పంచారామాలు: సూపర్ లగ్జరీ బస్సులో పంచారామ క్షేత్రాలను దర్శించుకోవచ్చు. ముందుగా హనుమకొండ బస్టాండ్ నుంచి బస్సు బయలుదేరుతుంది. మొదటగా బస్సు ద్రాక్షారామం వెళ్తుంది. అక్కడి నుంచి సామర్ల కోట, అమరావతి, పాలకొల్లు, భీమవరం ప్రాంతాల్లో ఉన్న శైవ క్షేత్రాలను దర్శించుకున్న అనంతరం తిరిగి బస్సు వరంగల్కు చేరుకుంటుంది. ఇందుకు గాను ఒక్కొక్కరికీ రూ.2500 ఛార్జీ చేయనున్నారు. ఈ యాత్ర రెండు రోజుల పాటు సాగనుంది.
బోథ్: ఇక ములుగు జిల్లాలోని బోథ్ జలపాతానికి కూడా ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించారు. ఇందుకోసం ఒక్కొక్కరికీ రూ.530గా ఛార్జీ చేయనున్నారు. ముందుగా బోథ జలపాతం, మల్లూరు లక్ష్మీనరసింహ స్వామి, రామప్ప ప్రాంతాలకు తీసుకెళ్తారు. అయితే ఈ టూర్ ప్యాకేజీలో భోజనం, వసతి అన్నీ కూడా ప్రయాణికులదే. వీటితో పాటు మరికొన్ని ప్రాంతాలకు కూడా టూర్ సౌకర్యం కల్పించనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఎక్కడికైనా వెళ్లాలని అనుకేవారు కనీసం 30 మంది ఉంటే ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తోంది ఆర్టీసీ.
తెలంగాణ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ ప్రత్యేక ప్యాకేజీ సౌకర్యాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు వరంగల్ రీజియన్లో తొమ్మిది డిపోలకు సంబంధించిన ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచారు. వరంగల్ 1-9959226047, వరంగల్ 2-9959226048, హనుమకొండ-8977781103, పరకాల-9959226051, నర్సంపేట-9959226052, భూపాలపల్లి-9959226707, తొర్రూర్-9959226053, మహబూబాబాద్-9959226054, జనగామ-9959226050 నెంబర్లను సంప్రదించి అవసరమైన సమాచారం సేకరించవచ్చని వరంగల్ ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే వెంటనే వరంగల్ ఆర్టీసీ అధికారులను సంప్రదించండి.
ఇవి కూడా చదవండి
విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మోదీ..
Read Latest lifestyle News