Share News

Sunita Williams India Visit: త్వరలో భారత్‌కు సునీతా విలియమ్స్.. పర్యటన ఖరారు

ABN , Publish Date - Mar 19 , 2025 | 08:25 AM

భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలో భారత్‌లో పర్యటిస్తారని ఆమె కుటుంబసభ్యులు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యలో తెలిపారు. పర్యటన తేదీలు ఇంకా ఖరారు ఈఏడాదిలోనే ఆమె భారత్‌లో పర్యటిస్తారని తెలిపారు.

Sunita Williams India Visit: త్వరలో భారత్‌కు సునీతా విలియమ్స్.. పర్యటన ఖరారు
Sunita Williams India Visit

ఇంటర్నెట్ డెస్క్: భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరుకోవడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నాళ్ల పాటు నాసా వైద్యుల పర్యవేక్షణలో గడపనున్న ఆమె ఆ తరువాత కుటుంబసభ్యులను కలుసుకుంటారు. ఇక ఆమె పూర్తిస్థాయిలో కోలుకున్నాక భారత్‌లో కూడా పర్యటించనున్నారు. ఈ విషయాన్ని సునీతా బంధువు ఫల్‌గునీ పాండ్యా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజాగా పేర్కొన్నారు (Sunita Williams India Visit).

సునీత సురక్షితంగా భూమికి చేరుకోవడంపై ఆమె మిక్కిలి హర్షం వ్యక్తం చేశారు. డ్రాగన్ క్రూ క్యాప్సూల్‌లో ఆమె సముద్రజలాల్లో పారాషూట్ల సాయంతో దిగడం చూసి ఆశ్చర్యమేసిందని కామెంట్ చేశారు. ఇక సునీతకు పూర్తి స్వస్థత చేకూరాక భారత్‌కు వస్తారన్ని అన్నారు. ‘‘తేదీలు ఇంకా ఖరారు కాలేదు కానీ ఆమె కచ్చితంగా భారత్‌లో పర్యటిస్తారు. ఈ ఏడాదే ఆమె రానున్నారు. మేమందరం కలిసి సెలవులపై ఎక్కడకైనా వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాము. కుటుంబసభ్యులందూ కలిసి గడిపే సమయం ఇది’ అని పాండ్య పేర్కొన్నారు.


Also Read: భూమ్మీదకు సురక్షితంగా చేరిన సునీతా విలియమ్స్.. నెక్స్ట్ జరిగేది ఇదే..

ఏ పరిస్థితుల్లో ఉన్నా అత్యద్భుతమైన పనితీరు కనబరచడం సునీత నైజమని పాండ్య తెలిపారు. తామందికీ ఆమె రోల్ మోడల్ అని కూడా చెప్పారు. ఇక సునీత పుట్టిన రోజున తాము ఆమెకు ఇష్టమైన కాజూ కట్లీని కూడా పంపించామని తెలిపారు. సెప్టెంబర్ 19 అంతరిక్షంలోనే సునీతా తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఇక తాను మహాకుంభమేళాలో పాల్గేనేందుకు వెళుతున్నట్టు సునీతకు తెలియగానే ఆ ఫొటోలను పంపించమని కూడా కోరారని చెప్పారు. ‘‘ఆమె చాలా ఆసక్తి ప్రదర్శించారు. అక్కడి విషయాలన్నీ తనకు చెప్పాలని అన్నారు’’ అని పాండ్యా వెల్లడించారు.


Also Read: ఎట్టకేలకు భూమికి చేరిన సునీత.. ఆమె ఇప్పుడు ఎలా ఉన్నారంటే..

ఇదిలా ఉంటే, అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ కూడా సునీతను భారత్‌ పర్యటనకు ఆహ్వానిస్తూ లేఖ రాశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సునీత భారత్‌కు వచ్చేందుకు తాను ఎంతో ఉత్సుకతతో ఉన్నట్టు చెప్పుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమైన సందర్భంగా ప్రధాని మోదీ ఆయనను సునీత ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. సునీతా విలియమ్స్ ఒహాయో రాష్ట్రంలో పుట్టిన పెరిగిన సంగతి తెలిసిందే. ఆమె తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్‌కు చెందిన వారు. వారి స్వస్థలం మెహసానా జిల్లా.

Read Latest and International News

Updated Date - Mar 19 , 2025 | 09:48 AM