Axiom-4: అనుకూలించని వాతావరణం.. యాక్సియమ్-4 మిషన్ వాయిదా
ABN , Publish Date - Jun 09 , 2025 | 11:04 PM
యాక్సియమ్ - 4 అంతరిక్ష మిషన్ మరోసారి వాయిదా పడింది. కెన్నెడీ స్పేస్ సెంటర్ వద్ద వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రయోగాన్ని జూన్ 11కు వాయిదా వేశారు.

భారతీయ ఆస్ట్రొనాట్ శుభాన్షూ శుక్లా అంతరిక్ష యాత్ర వాయిదా పడింది. వాతావరణం అనుకూలించకపోవడంతో యాక్సియమ్-4 మిషన్ వాయిదా పడింది. ఈ మిషన్ వాయిదా పడటం ఇది మూడోసారి. ప్రయోగ ప్రాంతం పరిసరాల్లో వాతావరణం సరిగా లేక యాక్సియమ్-4 వాయిదా పడిందని ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది. ఈ మిషన్లో భాగంగా శుభాన్షూ శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్న విషయం తెలిసిందే. తదుపరి ప్రయోగాన్ని భారత కాలమానం ప్రకారం జూన్ 11 సాయంత్రం 5.30 గంటలకు నిర్వహించనున్నారు. యాక్సియమ్-4లో భాగంగా శుభాన్షూ శుక్లాతో పాటు అమెరికా, పొలాండ్, హంగరీకి చెందిన వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు.
1984లో భారత వ్యోమగామి రాకేశ్ శర్మ అంతరిక్ష యాత్ర తరువాత మరో భారతీయుడు చేపడుతున్న తొలి యాత్ర ఇది. భారత అంతరిక్ష పరిశోధన లక్ష్యాల్లో కీలక మైలురాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అయిన శుభాన్షూ శుక్లా ఈ మిషన్కు పైలట్గా వ్యవహరించనున్నారు. ఈ మిషన్ కమాండర్గా మాజీ నాసా ఆస్ట్రొనాట్ పెగ్గీ విట్సన్ వ్యవహరించనున్నారు. ఇక స్పెస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు.
తొలుత మే 29న ప్రయోగం చేపట్టాలని నిర్ణయించారు. ఆ తరువాత జూన్ 8కి ప్రయోగం వాడిద పడింది. సాంకేతిక కారణాల వల్ల జూన్ 10కి మళ్లీ ప్రయోగాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక ఈ మిషన్లో భాగంగా వ్యోమగాములు 14 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వివిధ ప్రయోగాలు నిర్వహించనున్నారు.
ఇవీ చదవండి:
శ్వేతసౌధంలో ట్రెజరీ సెక్రెటరీతో మస్క్ బాహాబాహీ.. విషయం తెలిసి ట్రంప్ షాక్
మస్క్ తప్పు చేస్తున్నారు.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి