Indus Water Treaty: సింధు నదీ జలాల ఒప్పందం.. పాక్ ఆరోపణలను భారత్ గట్టిగా కౌంటర్
ABN , Publish Date - Jun 01 , 2025 | 11:11 AM
సింధు నదీ జలాల ఒప్పందం నిలుపుదలపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ గట్టిగా తిప్పికొట్టారు. ఈ విషయంలో పూర్తి బాధ్యత పాక్దేనని స్పష్టం చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: తజికిస్థాన్లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో హిమానీనదాల అంశంపై జరుగుతున్న అంతర్జాతీయ సమావేశంలో పాక్ సింధు నదీ జలాల ఒప్పందం ప్రస్తావ తేవడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓవైపు ఉగ్రవాదానికి పాల్పడుతూ మరోవైపు తప్పు ఇతరులపై నెట్టేందుకు ప్రయత్నించొద్దని గట్టిగా బుద్ధి చెప్పింది. సింధు నదీ జలాల ఒప్పందం నిలుపుదలకు పాక్ ప్రోత్సహిస్తున్న సీమాంతర ఉగ్రవాదమే కారణమని స్పష్టం చేసింది.
శుక్రవారం యూఎన్ సమావేశాల సందర్భంగా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరోసారి భారత్పై విమర్శలు ఎక్కుపెట్టారు. సింధు జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేసిన భారత్ నీటిని ఆయుధంగా మార్చుకుందని ఆరోపించారు. ఒప్పందం నిలుపుదల ఏకపక్షం, చట్టవ్యతిరేకం అని అన్నారు. ‘రాజకీయ ప్రయోజనాల కోసం కోట్లాది ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టొద్దు. పాక్ దీనికి అంగీకరించదు. ఈ హద్దు దాటితే మేము అస్సలు సహించం’ అని అన్నారు.
ఈ కామెంట్స్పై కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఘాటుగా బదులిచ్చారు. ఒప్పందం కుదిరిన నాటి నుంచి నేటి వరకూ పరిస్థితుల్లో ఎన్నో మౌలికమైన మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. సాంకేతికత అభివృద్ధి, జనాభా, వాతావరణ మార్పులు, సీమాంతర ఉగ్రవాదం వంటివి పెరిగాయని తెలిపారు. ఫలితంగా ఈ ఒప్పందంపై మరోసారి సమీక్ష అవసరమని అభిప్రాయపడ్డారు. అయితే, నిరంతరంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ పాక్ స్వయంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని అతిక్రమిస్తోందని అన్నారు. చివరకు నెపం ఇతరులపైకి నెట్టే ప్రయత్నం చేస్తోందని అన్నారు. సహృద్భావం, స్నేహపూర్వక వాతావరణంలో ఈ ఒప్పందం చేసుకున్నట్టు అగ్రిమెంట్ ముందుమాటలో పేర్కొన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఒప్పందం నిలుపుదల బాధ్యత పాక్దేనని మరోసారి స్పష్టం చేశారు.
పహల్గాం దాడికి కారణమైన పాక్పై ప్రతీకార చర్యగా భారత్ సింధు నదీ జలాల ఉప్పందాన్ని కూడా నిలుపుదల చేసిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి:
వాస్తవాన్ని వివరించిన భారత్.. పాక్కు మద్దతు ఉపసంహరించిన కొలంబియా
నిప్పుతో చెలగాటం వద్దు.. అమెరికాపై మండిపడ్డ చైనా
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి