ఆన్లైన్లో బుక్ చేస్తే రాకెట్లో వచ్చేస్తుంది!
ABN , Publish Date - Jun 12 , 2025 | 05:20 AM
ఏదైనా వస్తువు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే.. చాలా వేగంగా రాకెట్లా డెలివరీ చేస్తామని కంపెనీలు చెబుతూ ఉంటాయి.

‘డెలివరీ రాకెట్’ ప్రయోగం చేసిన చైనా సంస్థ సెపోచ్
అలీబాబా ఈ-కామర్స్కు చెందిన 20 కిలోల ప్యాకేజీలతో ప్రయోగం
బీజింగ్, జూన్ 11: ఏదైనా వస్తువు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే.. చాలా వేగంగా రాకెట్లా డెలివరీ చేస్తామని కంపెనీలు చెబుతూ ఉంటాయి. అయితే రాకెట్లా కాదు.. అచ్చంగా రాకెట్తోనే డెలివరీ చేస్తే!? భూమ్మీద ఏ మూలనో, వేల కిలోమీటర్ల దూరంలోనో ఉన్నా.. గంటా, రెండు గంటల్లోనే ప్యాకేజీలు చేతికి అందితే!? చైనాకు చెందిన ప్రైవేటు రాకెట్ సంస్థ సెపోచ్ గత నెల 29న చైనా తూర్పు తీర ప్రాంతంలో ఈ తరహా ప్రయోగం నిర్వహించింది. సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా స్టెయిన్లె్స స్టీలు రాకెట్ ప్రాథమిక రూపాన్ని అభివృద్ధి చేసింది. మళ్లీ మళ్లీ వినియోగించగల (పునర్వినియోగ) ఈ రాకెట్ ఎత్తు 26.8 మీటర్లు, బరువు 57 టన్నులు. దీనిలోని కంటెయినర్లో సుమారు 10 టన్నుల మేర సరుకులను మోసుకెళ్లగలదు.
ప్రస్తుతం రాకెట్ కంటెయినర్లో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అలీబాబా అనుబంధ సంస్థ టావోబావోకు చెందిన 20 కిలోల బరువున్న ప్యాకేజీలను పెట్టి ప్రయోగాత్మకంగా పరిశీలించారు. రాకెట్ 125 సెకన్ల పాటు మంటలు విరజిమ్ముతూ 2.5 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుందని.. తర్వాత షాంగ్డోంగ్ ప్రావిన్స్ తీరానికి సమీపంలో సముద్రంలో నిలువునా ల్యాండ్ అయిందని సెపోచ్ సంస్థ తెలిపింది. ఆ రాకెట్ను రికవరీ చేశామని, అది ఏమాత్రం దెబ్బతినలేదని.. తమ ప్రయోగం విజయవంతమైందని ప్రకటించింది. ఈ ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయి ప్రయోగం చేస్తామని తెలిపారు. కాగా, అమెరికా రక్షణశాఖ, వైమానిక దళం, రాకెట్ ల్యాబ్స్ ప్రైవేటు సంస్థ కలసి.. ‘డెలివరీ రాకెట్’ను అభివృద్ధి చేయడంపై పనిచేస్తున్నాయి. అయితే అమెరికా ఆయుధాలను రవాణా చేసేందుకు దానిని రూపొందిస్తున్నారు.