Air Indias flight to Israel diverted: మిస్సైల్ అటాక్.. ఎయిర్ ఇండియా ఫ్లైట్ అబుదాబికి మళ్లింపు
ABN , Publish Date - May 04 , 2025 | 05:06 PM
పాలస్తీనియన్లకు సంఘీభావంగా ఇజ్రాయెల్పై దాడి చేస్తున్న హౌతీ తిరుగుబాటుదారులు.. టెల్ అవీవ్ విమానాశ్రయంలో హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. అయితే, ఈ దాడికి ఏడురెట్ల ప్రతీకారం తీర్చుకుంటామని..

Air Indias flight to Israel diverted: ఇజ్రాయెల్ కు చెందిన ప్రధాన విమానాశ్రయం టెల్ అవీవ్ కు దగ్గర్లో క్షిపణి దాడి తర్వాత ఇజ్రాయెల్కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం అబుదాబికి మళ్లించారు. ఇజ్రాయెల్ నగరంలోని బెన్ గురియన్ విమానాశ్రయం సమీపంలో క్షిపణి దాడి జరిగిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ఢిల్లీ నుండి టెల్ అవీవ్కు వెళ్లాల్సిన ఈ ఎయిర్ ఇండియా విమానం అకస్మాత్తుగా ఆదివారం అబుదాబికి మళ్లించారు. అంతేకాదు, ఢిల్లీ - టెల్ అవీవ్ మధ్య విమాన సర్వీసుల్ని మే 6 వరకు నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. కాగా, ఎయిర్ ఇండియా విమానం AI139 టెల్ అవీవ్లో ల్యాండ్ కావడానికి గంటలోపే క్షిపణి దాడి జరగడం విశేషం. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ Flightradar24.comలోని సమాచారం ప్రకారం, విమానం అబుదాబికి మళ్లించే సమయంలో ఫ్లైట్ జోర్డాన్ గగనతలంలో ఉంది. ఎయిర్ ఇండియా సమాచారం ప్రకారం ఎయిర్ ఇండియా విమానం అబుదాబిలో సాధారణంగా ల్యాండ్ అయిందని, త్వరలో ఢిల్లీకి తిరిగి వస్తుందని తెలిపింది.
“ఈ ఉదయం బెన్ గురియన్ విమానాశ్రయంలో జరిగిన ఘటన తర్వాత ఢిల్లీ నుండి టెల్ అవీవ్కు 4 మే 2025న బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI139ని అబుదాబికి మళ్లించారు. విమానం సాధారణంగా అబుదాబిలో ల్యాండ్ అయింది. త్వరలో ఢిల్లీకి తిరిగి వస్తుంది” అని ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు. ఢిల్లీ - టెల్ అవీవ్ మధ్య విమానాన్ని మే 6 వరకు నిలిపివేస్తున్నట్లు కూడా ప్రకటించింది. “మా కస్టమర్లు, సిబ్బంది భద్రత దృష్యా టెల్ అవీవ్కు విమాన సర్వీసులు ఇప్పటి నుంచి 2025 మే 6 వరకు నిలిపివేయబడతాయి. క్షేత్రస్థాయిలో ఉన్న మా సిబ్బంది కస్టమర్లకు సహాయం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో వారికి సహాయం అందిస్తున్నారు” అని ఎయిరిండియా ప్రతినిధి చెప్పారు.
ఇలా ఉండగా, ఈ ఉదయం యెమెన్ నుండి క్షిపణిని ప్రయోగించిన తర్వాత ఇజ్రాయెల్ దేశంలోని ప్రధాన విమానాశ్రయమైన టెల్ అవీవ్ కు విమాన రాకపోకలు పాక్షికంగా మూసివేయబడ్డాయని ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు. కాగా, క్షిపణిని ప్రయోగించిన తర్వాత విమానాశ్రయం సమీపంలో నుండి పొగ దూసుకురావడం కనిపించింది. ప్రయాణీకులు కేకలు వేయడం.. భయకంపితులు కావడం అక్కడ కనిపించింది. మిస్సైల్ అటాక్ కారణంగా టెల్ అవీవ్ టెర్మినల్ 3 పార్కింగ్ స్థలం సమీపంలో పది మీటర్ల మేర పెద్ద గుంత ఏర్పడిందని విమానాశ్రయ అధికారులు చెప్పారు. దాడి కారణంగా నలుగురు ఇజ్రాయెల్ పారామెడిక్ సర్వీస్ సిబ్బంది గాయపడ్డారు. పాలస్తీనియన్లకు సంఘీభావంగా ఇజ్రాయెల్పై దాడి చేస్తున్న హౌతీ తిరుగుబాటుదారులు విమానాశ్రయంలో హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారని అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. విమానాశ్రయ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రతిజ్ఞ చేశారు: "ఎవరైతే మాకు హాని చేస్తారో, మేము వారికి ఏడు రెట్లు హాని చేస్తాము." అని ఆయన అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Minister Atchannaidu: బెంగళూరులో ఫుల్టైం తాడేపల్లిలో పార్ట్టైం
Minister TG Bharath: లేపాక్షి భూములకు త్వరలో విముక్తి
YS Sharmila: రాష్ట్రానికి నిధులు కావాలి అప్పు కాదు
For More AP News and Telugu News