Gaza : ఇజ్రాయెల్ దాడిలో గాజాకు చెందిన 18 మంది సామాన్యులు మృతి
ABN , Publish Date - Aug 03 , 2025 | 10:16 AM
గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. ఈ దాడిలో 18 మంది సామాన్యులు మరణించినట్లు అక్కడి వైద్య అధికారులు తెలిపారు.

ఇంటర్నెట్ డెస్క్, ఆగస్టు 3: గాజా, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతుంది. యుద్ధంలో ఎంతో మంది అమాయకుల ప్రాణాలు పోతున్న యుద్ధం మాత్రం ఆపాడం లేదు ఇరుదేశాలు. తాజాగా గాజాపై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. ఈ దాడిలో 18 మంది సామాన్యులు మరణించినట్లు అక్కడి వైద్య అధికారులు తెలిపారు.
మరణించిన వారిలో ఎనిమిది మంది సహాయ కేంద్రం వద్ద ఆహారం కోసం పడిగాపులు కాస్తూ.. ఇజ్రాయెల్ తూటాలకు బలైన వారే కావడం బాధకారం. మిగిలిన 10 మంది మధ్య, దక్షిణ గాజా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడుల్లో మరణించారు. శరణార్తుల కోసం గాజా హ్యుమేనిటేరియన్ ఫౌండేషన్ (జీహెచ్ఎఫ్)సహాయ కేంద్రం నిర్వహిస్తుంది.
అయితే ఆహారం కోసం సహాయం కేంద్రం వద్దకు ఎక్కువ సంఖ్యలో జనాలు రావడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అదే సమయంలో ఇజ్రాయెల్ సేనలు కాల్పులు జరపడంతో అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అయితే తాము నిర్వహిస్తున్న సహాయ కేంద్రాల వద్ద అలాంటిదేదీ జరగలేదని జీహెచ్ఎఫ్ పేర్కొంది. కాల్పులకు గురై మరణించే అవకాశాలుండీ సహాయ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో గాజావాసులు గుమిగూడటం ఆ ప్రాంతంలో నెలకొన్న తీవ్ర క్షామ పరిస్థితులకు నిదర్శనమని అంతర్జాతీయ సంస్థలు అంటున్నాయి. మరోవైపు పౌష్టికాహార లోపం కారణంగా ఏడుగురు పాలస్తీనీయులు గడచిన 24 గంటల్లో మరణించారని స్థానిక ఆరోగ్య శాఖ తెలిపింది.
జనవరిలో ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటి ఇజ్రాయెల్ విరమణకు విరుద్ధంగా గాజాపై మళ్లీ దాడులను తెగబడింది. దీంతో మళ్లీ మొదటికి వచ్చింది పరిస్థితి. గాజా బెల్ట్లో ఉన్న హమాస్ అనేది ఇజ్రాయెల్కు విరుద్ధంగా పోరాటం చేసే ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ. గాజాలో హమాస్ అధికారంలోకి రావడం, ఇజ్రాయెల్తో హింసాత్మక సంబంధాలను మరింత పెంచింది. హమాస్ తరచూ ఇజ్రాయెల్ మీద రాకెట్ దాడులు చేసింది. దీంతో తానని రక్షించుకోవడానికి ఇజ్రాయెల్ తిరిగి గాజాపై దాడులు చేస్తుంది