ఇదేమి మర్యాద
ABN , Publish Date - May 23 , 2025 | 05:44 AM
‘ఎంటర్ ఎట్ యువర్ ఓన్రిస్క్’.. అమెరికా అధ్యక్షుడు తన ఓవల్ ఆఫీస్లో అడుగుపెట్టినవారితో మర్యాదగా వ్యవహరించపోగా, తీవ్రంగా అవమానించి పంపిస్తాడంటూ ప్రపంచదేశాధినేతలందరికీ ఒక ఆంగ్లపత్రిక చేసిన హెచ్చరిక ఇది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రాంఫోసాతో బుధవారం డోనాల్డ్ ట్రంప్ వ్యవహరించిన...

‘ఎంటర్ ఎట్ యువర్ ఓన్రిస్క్’.. అమెరికా అధ్యక్షుడు తన ఓవల్ ఆఫీస్లో అడుగుపెట్టినవారితో మర్యాదగా వ్యవహరించపోగా, తీవ్రంగా అవమానించి పంపిస్తాడంటూ ప్రపంచదేశాధినేతలందరికీ ఒక ఆంగ్లపత్రిక చేసిన హెచ్చరిక ఇది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రాంఫోసాతో బుధవారం డోనాల్డ్ ట్రంప్ వ్యవహరించిన తీరుతో బహుశా ఏ దేశాధినేతాకూడా నమ్మకంగా ఓవల్ ఆఫీసులోకి అడుగుపెట్టలేడేమో. ట్రంప్తో భేటీ తరువాత విలేఖరులతో రాంఫోసా ఓ బలవంతపు చిరునవ్వు మధ్యన ‘మిమ్మల్ని నిరాశపరిచినట్టున్నాను’ అని ఓ వ్యాఖ్య చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఇదే కార్యాలయంలో ట్రంప్ ఎంత అవమానకరంగా వ్యవహరించారో రాంఫోసాకు తెలుసు. ఆ సందర్భంగా జెలెన్స్కీ ఏమాత్రం తగ్గకుండా ట్రంప్కు దీటైన సమాధానాలు ఇచ్చి, అగ్రరాజ్యాధినేత ఆగ్రహానికి గురై అర్థంతరంగా అవమానకరమైన రీతిలో బయటకు పోవాల్సివచ్చింది. కానీ, ట్రంప్ ఎంత అవమానించినా కూడా వాగ్యుద్ధం హద్దులు దాటకూడదని, తాను మరో జెలెన్స్కీ కాకూడదని రాంఫోసా జాగ్రత్తపడ్డారు. అందుకే, విలేఖరులను నిరాశపరిచానన్న నర్మగర్భమైన వ్యాఖ్య చేశారు.
దక్షిణాఫ్రికాలో నల్లవారు ఒక పద్ధతిప్రకారం శ్వేతజాతిరైతుల భూములను ఆక్రమించుకుంటూ, వందలాది తెల్లవారిని ఊచకోతకోశారన్నది మస్క్–ట్రంప్ బృందం వాదన. అమెరికాలో శ్వేతజాతీయుల ఓట్లు కొల్లగొట్టడానికి ఇది ఎంత ఉపకరించిందన్నది అటుంచితే, ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత దక్షిణాఫ్రికాలోని తెల్లవారికి అమెరికా ప్రవేశాన్ని సులభతరం చేశారు. దక్షిణాఫ్రికామీద కక్షకట్టి నిధుల నిలిపివేతసహా పూర్తిస్థాయి సహాయనిరాకరణ ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ట్రంప్తో మాట్లాడి, ఈ కక్షకు స్వస్తిపలకాలని రాంఫోసా ప్రతిపాదించినప్పుడు, ట్రంప్ మనసు తెలిసి కూడా వెళ్ళి అవమానపడటం ఎందుకని ఆయన శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారట. కానీ, ఆర్థికంగా దేశానికి జరిగేనష్టం కంటే, ఉధృతంగా సాగుతున్న ట్రంప్ ప్రచారాన్ని మిగతా ప్రపంచం ఎప్పటికోప్పటికి నమ్మే ప్రమాదం ఎక్కువగా ఉన్నదని, పోయిరావలసిందేనని రాంఫోసా పట్టుబట్టి, చివరకు ఇలా అవమానపడాల్సి వచ్చింది. నిజంగా వందలాదిమంది తెల్లరైతుల హత్యలే జరిగితే ఈ నల్లదేశాన్ని పాశ్చాత్యప్రపంచం బతకనిస్తుందా?
మొహమాటపు పలకరింపులు అయ్యాక, ట్రంప్ ఒక్కసారిగా ముసుగు తీసేశారు. చావులు..చావులు..ఘోరమైన చావులు అంటూ మీ దేశంలో శ్వేతజాతిమారణకాండ సాగిపోతోందని రాంఫోసా మీద విరుచుకుపడ్డారు. దక్షిణాఫ్రికాలో హింస హెచ్చుగా ఉన్నమాట నిజమే కానీ, వ్యవసాయరంగానికి సంబంధించిన హత్యల్లో నల్లవారే ఎక్కువగా చనిపోయారని రాంఫోసా ఒక దశలో ఏదో చెప్పబోయారు. చూస్తాను, చేస్తానని ఏదో అన్నారు. ఇంతలోగా ట్రంప్ ఆదేశాలమేరకు ఓవల్ ఆఫీసులో లైట్లు తగ్గిపోయి, అప్పటికప్పుడు అది ఓ చలనచిత్ర ప్రదర్శనశాలగా మారిపోయింది. దక్షిణాఫ్రికా స్వాతంత్ర్యపోరాట కాలంలో శ్వేతజాతివారిమీద నల్లజాతి నాయకులు కక్షపూరితంగా పాడిన పాటలు, ఇటీవల కొందరు నాయకులు ఇచ్చిన నినాదాలు, డ్రోన్ద్వారా చిత్రీకరించిన కొన్ని దృశ్యాలు గుదిగుచ్చిన ఒక ఐదునిముషాల విడియోను రాంఫోసా చెమటలు తుడుచుకుంటూ చూడాల్సివచ్చింది. ప్రదర్శన ఆగినవెంటనే, ఉపాధ్యక్షుడు వాన్స్ అందించిన ఒక పెద్దకాగితాలకట్టని ముందుగా మీడియాకు విప్పిచూపించి, ఆ తరువాత రాంఫోసాకు అందించారు ట్రంప్. వాటిమీద కనిపిస్తున్న ఫోటోలన్నీ ప్రిటోరియా తదితర ప్రాంతాల్లో ఊచకోతకు గురైన తెల్లవారి మృతదేహాలని ట్రంప్ బృందం ప్రపంచానికి చెప్పదల్చుకుంది. కానీ, బిబిసి సహా చాలా మీడియా సంస్థలు ట్రంప్ ప్రదర్శించిన విడియోలోనూ, చూపిన ఈ కాగితాల్లోనూ ఎన్ని అసత్యాలు దాగివున్నాయో విశ్లేషిస్తున్నాయి. కాంగో దృశ్యాలను తెచ్చి, దక్షిణాఫ్రికా మీద రుద్దుతున్నారని, గతంలో ఒక శ్వేతజాతిరైతుదంపతుల హత్యకు ఆగ్రహించి ఒక రహదారికి అటూ ఇటూ తెల్ల శిలువలు పాతితే, ఆ దృశ్యాన్ని సైతం వాడుకొని ఆ శిలువలన్నీ వందలాదిమంది తెల్లరైతుల ఊచకోతకు నిదర్శనంగా ప్రచారం చేస్తున్నారని ఈ సంస్థలు అంటున్నాయి. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించి, గాజాలో సాగుతున్నది జీనోసైడ్గా నిర్థారించేట్టు చేసి, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూకు అరెస్టువారెంట్ జారీచేయించినందుకు, అదే పదజాలంతో ట్రంప్ బృందం దక్షిణాఫ్రికా మీద ఇలా కక్షతీర్చుకుంటోందన్నమాట.
ఇవీ చదవండి:
బీసీసీఐపై ఫ్రాంచైజీలు సీరియస్!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి