మహావిషాదం
ABN , Publish Date - Jun 13 , 2025 | 06:13 AM
ఆ భయానక ఘటన ఒళ్ళు జలదరింపచేస్తోంది. ఆ పెనువిషాదం గుండెలను నలిపేస్తున్నది. అలవోకగా సముద్రాలను అధిగమించి, సునాయాసంగా వేలాదికిలోమీటర్లు దూసుకుపోవాల్సిన ఆ లోహవిహంగం నింగిని తాకకముందే...

ఆ భయానక ఘటన ఒళ్ళు జలదరింపచేస్తోంది. ఆ పెనువిషాదం గుండెలను నలిపేస్తున్నది. అలవోకగా సముద్రాలను అధిగమించి, సునాయాసంగా వేలాదికిలోమీటర్లు దూసుకుపోవాల్సిన ఆ లోహవిహంగం నింగిని తాకకముందే నేలవాలిపోయింది. తల్లిగర్భంలో శిశువులా భద్రంగా ఉన్నామని, గమ్యాన్ని నిక్షేపంగా చేరుకుంటామన్న ప్రయాణికుల నమ్మకాన్ని ఈ ఇనుపరెక్కల పక్షి వమ్ముచేసింది. అనేక ఆశలనూ, ఆశయాలను, ఊసులనూ గుండెల్లో నింపుకొని, నేలవాలగానే ముంచెత్తబోయే సన్నిహితుల, ఆత్మీయుల ఆలింగనాల కోసం ఆనందంగా ఎదురుచూస్తున్నవారు అర్థంతరంగా, అతివిషాదంగా తమ జీవితాన్ని ముగించాల్సివచ్చింది. మహాశక్తిమంతమైన ఇంజన్, అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలు ఉన్న ఒక గొప్ప కంపెనీ విమానం రివ్వున ఎగిరి, లండన్లో నిక్షేపంగా దిగడానికి బదులు వందల అడుగులు లేవడానికే వేదనపడటం, క్షణాల్లో కూలి భగ్గుమనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏం జరిగిందన్నది కళ్ళకు కనిపిస్తోంది. ఎందుకు జరిగిందన్న ప్రశ్న మాత్రం నిర్దిష్టమైన, నమ్మశక్యమైన సమాధానం దొరికేవరకూ మనలను నిలవనివ్వదు. మాటలకు అందని మహావిషాదం ఇది. పట్టుమని తొమ్మిదివందల అడుగులు కూడా లేవలేక విమానం కుప్పకూలింది. విమాన ప్రమాదాల్లో సగానికి పైగా టేకాఫ్, లాండింగ్ సందర్భాల్లోనే జరుగుతాయి కనుక, పక్షి ఢీకొన్నదేమోనన్న అనుమానాలూ ఉన్నాయి. టేకాఫ్ సక్రమంగా జరగలేదని, అందుకు తగినంత శక్తి సమకూరలేదని అర్థమవుతూనే ఉంది. పొట్టనిండా ఇంధనం ఉన్నా, సరఫరా వ్యవస్థల్లో లోపం ఉంటే, ఇంధనం సరిగా చేరక ఇంజన్ విఫలమవుతుంది. ఇంజన్ మీద అత్యంత భారం పడే టేకాఫ్ సందర్భం పైలట్ల నైపుణ్యానికీ, అనుభవానికీ కూడా ఓ విషమపరీక్ష. నిండుగా ఉన్న ఇంధనం నిక్షేపంగా గమ్యానికి చేర్చాల్సింది పోయి విమానం మొత్తం క్షణాల్లో భగ్గుమనిపోయేందుకు ఉపకరించడం విషాదం. కాపాడమంటున్న ఆ మేడేకాల్ క్షేత్రస్థాయికి చేరి, ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది స్పందించేలోగానే విమానం మరింత కిందకు జారింది, అంతిమంగా కుప్పకూలింది. దురదృష్టకరమైన ఈ పరిణామానికి తోడు, ఆ విమానం వైద్యవిద్యార్థుల హాస్టల్ మీద పడి, అనేక మంది ప్రాణాలు తీసింది. తాను కుప్పకూలుతూ అన్నం తింటున్నవారిని పొట్టనబెట్టుకుంది. ఈ హాస్టల్ భవనం సహా విమానాశ్రయానికి చేరువలో ఉన్న ప్రాంతాలన్నీ ఈ విధ్వంసం తీవ్రతకు ప్రత్యక్షసాక్ష్యాలు. డీఎన్ఏ పరీక్షతో తప్ప మృతులను గుర్తుపట్టలేని రీతిలో ఈ వినాశనం జరిగింది.
అందరినీ పొట్టనబెట్టుకున్న ఆ విమానంలో నుంచి ఒకే ఒక్కడు నిక్షేపంగా బయటపడటం ఓ అద్భుతం. విమానంలో నుంచి ఎవరో విసిరివేసినట్టుగా, ఒంటిమీద పెద్ద గాయాలు లేకుండా బతికి బయటపడిన ఈ వ్యక్తి తనకు తానుగా నడిచిపోతున్న ఆ దృశ్యం ఎన్నటికీ చెరిగిపోనిది. ఇప్పుడు ప్రమాదానికి గురైన విమానానికి వయసెక్కువనీ, సాంకేతిక సమస్యలతోనూ, పలుమార్లు డీజీసీఏ హెచ్చరికలతో దానిని పక్కనబెట్టారని కొన్ని వార్తలు వస్తున్నాయి. నిజానిజాలు అటుంచితే, శల్యపరీక్షలు చేయనిదే, ప్రయాణానికి నూరుశాతం అర్హమైనదని నిర్ధారణ కానిదే ఏ విమానమూ గాలిలోకి ఎగరదు. అత్యంత అనుభవజ్ఞులైన పైలట్, కోపైలట్కు ఏ మాత్రం అనుమానం కలిగినా ఈ ప్రయాణానికి అంగీకరించేవారే కాదు. ఇంతటి ఘోర ప్రమాదం జరిగిన తరువాత, మొత్తంగా బోయింగ్మీద, ప్రత్యేకించి ఈ తరహా విమానాలమీద కొన్ని సత్యాసత్యాలు ప్రచారంలోకి రావడం సహజం. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ విమానాలు నిక్షేపంగా తిరుగుతున్నమాటా నిజం. ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన సందర్భంలో టాటా సంస్థకు సంక్రమించిన విమానాల్లో కొన్నింటికి వయసు మీదపడటంతో వాటి ఆధునికీకరణ కూడా సాగుతోందని అంటారు. గత నెలలోనే నాలుగు వందల మిలియన్ డాలర్ల వ్యయంతో అది మలిదశ కార్యక్రమానికి నడుంబిగించింది. ఈ ప్రమాదం నేపథ్యంలో, ఎయిర్ ఇండియా తన విమానాల సంపూర్ణ ప్రక్షాళనకు సిద్ధపడక తప్పదు. విమానాల ఆధునికీకరణకు సంబంధించి దేశీయ విమానయానసంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకొని వాటి తరఫున విదేశాలతో వ్యవహరించడం అవసరం. సాంకేతిక వైఫల్యాల నుంచి మానవ నిర్లక్ష్యం వరకూ ఈ ప్రమాదానికి దోహదం చేసిన అంశాలన్నింటినీ నిజాయితీతో గుర్తించి, కఠినమైన చర్యలను చేపట్టడంతో పాటు, సరైన పరిష్కారాలను సాధించడం అవసరం.