విరాట్ లేని క్రికెట్
ABN , Publish Date - May 15 , 2025 | 02:05 AM
ఆటలో విజయమే తప్ప రాజీపడని పోరాట యోధుడిగా పేరుగాంచిన క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ తన టెస్టు ప్రస్థానానికి ముగింపు పలికాడు. ఇది క్రికెట్ అభిమానులకు ఒకింత బాధను కలిగించొచ్చు. మొన్నటికి మొన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్రికెట్లో సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలకడం అందరినీ...

ఆటలో విజయమే తప్ప రాజీపడని పోరాట యోధుడిగా పేరుగాంచిన క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ తన టెస్టు ప్రస్థానానికి ముగింపు పలికాడు. ఇది క్రికెట్ అభిమానులకు ఒకింత బాధను కలిగించొచ్చు. మొన్నటికి మొన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్రికెట్లో సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలకడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతలోనే విరాట్ కూడా సంప్రదాయ క్రికెట్ నుంచి వైదొలగడం భారత క్రికెట్కు అతిపెద్ద లోటే. కానీ, ఎంత గొప్ప ఆటగాడైనా ఏదో ఒకరోజు తప్పుకోక తప్పదు. ప్రతి ప్రయాణానికీ ముగింపు ఉంటుందనేలా... కోహ్లీ కూడా తన సుదీర్ఘ కెరీర్కు గుడ్బై చెప్పేశాడు. అయితే, ఈ గొప్ప ఆటగాడి మజిలీలో ఎన్నో మలుపులు, మైలురాళ్లు, మరెన్నో అద్భుతాలను క్రికెట్ ప్రపంచం ఆస్వాదించగలగడం ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం.
కొందరు ఆటతో పేరు తెచ్చుకుంటారు, మరికొందరు ఆ ఆటకే వన్నె తెస్తారు. రెండో కోవలోకి వస్తాడు విరాట్ కోహ్లీ. సాధారణంగా ఓ క్రికెటర్కు ఒక ఫార్మాట్లో గొప్ప రికార్డు ఉంటుంది. కానీ, మూడు ఫార్మాట్లలోనూ ప్రతిభ చూపడం కోహ్లీకే చెల్లింది. టీ20, వన్డేలు, టెస్టుల్లో అద్భుతమైన ప్రదర్శనతో క్రికెట్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అద్వితీయమైన ఆటతో, మొక్కవోని పట్టుదలతో క్రికెట్ ప్రేమికులను మంత్రముగ్ధులను చేశాడు. ఎన్నో మెగా టోర్నమెంట్లలో ఒంటిచేత్తో ప్రత్యర్థులను అడ్డుకొని అపురూపమైన విజయాలను అందించాడు. మరీ ముఖ్యంగా ఛేదనలో ఒక్కొక్క బ్యాటర్ చేతులెత్తేస్తుంటే, ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్తో కట్టి పడేస్తుంటే, అభిమానుల ఆశలు మోస్తూ చివరిదాకా మైదానంలో నిలిచిన సందర్భాలు అతని కెరీర్లో అనేకం. ధనాధన్ షాట్లతో, వేగంగా పరుగులు రాబట్టగలిగే పరిమిత ఓవర్ల ఆటకే పరిమితమవుతున్న నేటితరం క్రికెట్లో... మెరుపు వేగంతో దూసుకొచ్చే ఎరుపు బంతులను కళాత్మక షాట్లతో బౌండ్రీకి తరలిస్తూ ఐదురోజుల ఆటను మరింత జనరంజకంగా మలచిన ఘనత కోహ్లీది. శారీరకంగానే గాకుండా మానసిక పరీక్షగా నిలిచే ‘టెస్టు’ క్రికెట్లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా నిలిచిన తీరు సర్వదా ప్రశంసనీయం. పద్నాలుగేళ్ల క్రితం వెస్టిండీస్ పర్యటనతో మొదలైన అతని టెస్టు ప్రస్థానం, ఒక్కో మెట్టు ఎక్కుతూ దినదిన ప్రవర్ధమానమైంది. 123 టెస్టులాడిన అతను 210 ఇన్నింగ్స్ల్లో 9,230 పరుగులు సాధించాడు. 30 శతకాలు, 31 అర్ధ శతకాలతో అలరించాడు. ఓ వైపు పరుగుల మోత మోగిస్తూనే, నాయకుడిగానూ తనకు తిరుగులేదని చాటుకున్నాడు. కెప్టెన్ హోదాలో 68 టెస్టుల్లో 40 విజయాలు జట్టుకు కట్టబెట్టాడు. ఆస్ట్రేలియా గడ్డపై చరిత్రాత్మక సిరీస్ విజయాన్ని అందించాడు. ఏకంగా 42 నెలలపాటు టీమిండియాను టెస్టుల్లో నెంబర్వన్ ర్యాంకుతో అగ్రపీఠాన నిలబెట్టాడు. టెస్టుల్లో అత్యంత విజయవంతమైన భారత సారథిగా ఖ్యాతి గడించాడు. స్వదేశం, విదేశం అన్న తేడా లేకుండా అన్ని పిచ్లపైనా రాణించగలగడం విరాట్ ప్రత్యేకత. విదేశాల్లో భారత జట్టు టెస్టు మ్యాచ్లను డ్రా చేసుకుంటే చాలు అన్న దశ నుంచి ప్రత్యర్థిని వాళ్ల గడ్డపైనే చిత్తు చేసే స్థాయికి తీసుకొచ్చిన గొప్ప సారథి అతను. భారత క్రికెట్లో చెరగని ముద్ర వేసిన ధోనీ వారసత్వాన్ని నిలబెట్టిన నిఖార్సయిన నాయకుడు. తనకే సాధ్యమైన ఆటతో ప్రపంచ క్రికెట్లో ‘విరాట విప్లవం’ తీసుకొచ్చిన దిగ్గజ ఆటగాడు. విరాట్ కోహ్లీ ఆటతోనే గాకుండా, సత్ప్రవర్తన, అభిరుచులలో కూడా ఉన్నతంగా నిలుస్తాడు. కఠినమైన శ్రమతో, ఉక్కు సంకల్పంతో వృత్తి జీవితాన్ని చక్కగా మలుచుకొన్న విరాట్ నుంచి ఈ తరం యువత ఎంతో నేర్చుకోవచ్చు.
విరాట్ తరహాలోనే రోహిత్ శర్మ కూడా భారత జట్టుకు లభించిన అరుదైన ఆణిముత్యం. పరిమిత ఓవర్ల ఆటలో ఎన్నో అద్భుత ప్రదర్శనలతో అలరించిన రోహిత్, టెస్టుల పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయిన మాట వాస్తవం. కానీ, కోహ్లీ నుంచి నాయకత్వ బాధ్యతలు స్వీకరించాక, జట్టును అత్యున్నత స్థాయిలో చూపిన అగ్రగణ్యుడిగా రోహిత్ కీర్తి గడించాడు. గతేడాది భారత జట్టు టీ20 ప్రపంచకప్ గెలిచిన వెంటనే పొట్టి ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ, రోహిత్ల ఆట ఇక వన్డేలకు పరిమితం. ఈ ఇద్దరి అనూహ్య నిష్క్రమణతో ఇప్పుడు టెస్టులకు కొత్త సారథిని నియమించడం అనివార్యమైంది. వీళ్ల వారసత్వాన్ని కొనసాగించగల సత్తా ఉన్న ఆటగాళ్లను అన్వేషించే పనిలో భారత బోర్డు ఉంది.
ఇవి కూడా చదవండి..
BSF Jawan: బీఎస్ఎఫ్ జవాన్ విడుదల.. అటారీ వద్ద భారత్కు అప్పగించిన పాకిస్తాన్..
India VS Pakistan: భారత్-పాక్ కాల్పుల విరమణ.. పాకిస్తాన్పై చైనా గుర్రు.. కారణమిదే..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి