Share News

జనజయ సిందూరం!

ABN , Publish Date - May 08 , 2025 | 02:00 AM

‘భారత్‌, పాకిస్థాన్‌లు శాంతి సామరస్యాలతో మనలేవు. పెద్ద ఎత్తున విదేశీ సహాయం లేకుండా, చిన్న యుద్ధం కూడా చెయ్య లేవు’ అని 1960ల్లో స్వీడిష్‌ ఆర్థికవేత్త, సామాజిక శాస్త్రవేత్త గనర్‌ మిర్డాల్‌ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలోని తొలి భాగం ఇప్పటికీ...

జనజయ సిందూరం!

‘భారత్‌, పాకిస్థాన్‌లు శాంతి సామరస్యాలతో మనలేవు. పెద్ద ఎత్తున విదేశీ సహాయం లేకుండా, చిన్న యుద్ధం కూడా చెయ్య లేవు’ అని 1960ల్లో స్వీడిష్‌ ఆర్థికవేత్త, సామాజిక శాస్త్రవేత్త గనర్‌ మిర్డాల్‌ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలోని తొలి భాగం ఇప్పటికీ ఒక దురదృష్టకర వాస్తవంగా ఉన్నది. రెండో భాగంలోని యథార్థతను మనం అధిగమించాం.

పహల్గామ్‌లో ఉగ్రవాద ఘాతుకంపై భారత్‌ ప్రతీకార దాడి– ఆపరేషన్‌ సిందూర్‌– ని జయప్రదంగా నిర్వహించింది. భారతీయులలో సహజంగానే భావోద్విగ్నత నెలకొన్నది. పాకిస్థాన్‌ ఎప్పుడు, ఎలా ప్రతిస్పందిస్తుందో తెలియదు. దేశవ్యాప్తంగా కంటోన్మెంట్‌, చమురు శుద్ధి కర్మాగారం, అణు విద్యుదుత్పత్తి కేంద్రం మొదలైనవి ఉండే ప్రాంతాలలో యుద్ధ సన్నద్ధతకు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. శత్రు విమాన దాడుల గురించి హెచ్చరించేందుకు సైరన్‌ మోగించడం పరిపాటి. ఇలా సైరన్లు మోగింది చివరిసారి 1971 బంగ్లాదేశ్‌ విముక్తి సమర సందర్భంలోనని నేటి వృద్ధతరంలోని చాలా మందికి ఇంకా గుర్తు ఉండి ఉంటుంది. సంప్రదాయ యుద్ధాల కాలం (ఇది రెండో ప్రపంచ యుద్ధంతోనే ముగిసిపోయింది)లోనే ఎటువంటి విపత్కర పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు ప్రజలను సంసిద్ధపరచడం ఆనవాయితీగా ఉండేది. అణ్వస్త్రాలు, బాలిస్టిక్స్‌ మిస్సైల్స్ తదితర అత్యాధునిక యుద్ధ పరికరాలు, నవీన సాంకేతికతల ఆలంబనతో జరుగుతున్న ప్రస్తుత యుద్ధాల కాలంలోనూ ప్రజలను ఎటువంటి ముప్పు నెదుర్కోవడానికైనా సదా సర్వసన్నద్ధంగా ఉంచేందుకు ప్రభుత్వాలు సహజంగానే ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నాలు ఏ మాత్రం ఉపేక్షించదగినవి కావు. దేశ సరిహద్దుల్లో సైనికులు ఎంత జాగరూకతతో ఉంటారో ప్రజలు సైతం అంతే జాగరూకతతో ఉండాలి.


యుద్ధ కాలంలో దేశభక్తి ఉప్పొంగడం సహజం. అందులోనూ మనం యుద్ధం చేస్తున్న శత్రు దేశం మతతత్వ రాజకీయాలతో, ఉన్మాదంతో మనపై అమానుష హింసాకాండకు పాల్పడి యుద్ధ ఉద్రిక్తతలు నెలకొనేందుకు కారణం అయినప్పుడు సామాన్య ప్రజల్లో అంతులేని ఆగ్రహావేశాలు పెల్లుబికడం అసహజమేమీ కాదు. ఇప్పుడు మన సమాజంలో అదే జరుగుతోంది. దీంతో వ్యక్తులుగా ప్రజల అంతరంగంలో కొన్నిసార్లు సహజ మానవత అంతరించిపోతోంది. పసుపు పారాణి ఆరకుండానే పహల్గాంలో కళ్లెదుట భర్తను కోల్పోయిన హిమాన్షి నర్వాల్‌ మానవతా గీతాన్నే ఎలుగెత్తటాన్ని ఈ సందర్భంగా స్మరించుకోవాలి. విద్వేషాన్ని వీడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కొంత మంది సామాజిక మాధ్యమాలలో ఆమెపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేయడం గర్హనీయం. అలాగే పహల్గాంలో తండ్రిని కోల్పోయిన విషాద సమయంలో తనకు తోబుట్టువుల వలే బాసటగా నిలబడ్డ ఇద్దరు కశ్మీరీ యువకుల గురించి ఆరతీ శేఖర్‌ అనే కేరళ యువతి చెప్పిన ప్రేమాస్పద మాటలు మనలో సౌభ్రాతృత్వ భావాన్ని పరిపూర్ణం చేస్తాయి. పహల్గాం దురాగతాన్ని సాకుగా తీసుకుని మత దృష్టితో అమాయకులను వేధించవద్దని హిమాన్షి, ఆరతి, ఇంకా ఇతర బాధితుల ఆప్తులు విజ్ఞప్తి చేశారు. యుద్ధ ఉద్రిక్తతలు విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మానవత్వంతో ప్రదీప్తమైన వారి మాటలను భారతీయ సమాజం విస్మరించకూడదు.


యుద్ధం వాంఛనీయమా? అదే పరిష్కార మార్గమా? అన్న ప్రశ్నలకు సమాధానాలు సందర్భాలను బట్టి ఉంటాయి. మన ప్రస్తుత సందర్భమూ అందుకు భిన్నమేమీ కాదు. యుద్ధాలు మానవత్వాన్ని హరించివేయడంతో పాటు ఆర్థిక జీవనాన్నీ ధ్వంసం చేస్తాయి. ఆర్థిక జీవనం సవ్యంగా లేనప్పుడు సామాజిక జీవనం సజావుగా సాగదు. రాజకీయ గమనంలో ఒడిదుడుకులు జాతి జీవనాన్ని సంక్షుభితపరుస్తాయి. చరిత్ర పునరావృతం అవటం ఎవరికీ క్షేమం కాదు. ఇరుగు పొరుగు దేశాలు, అందునా సహస్రాబ్దాల పాటు ఒకటిగా ఉండి నిన్న మొన్న విడిపోయిన దేశాల మధ్య సమస్యలు సహజమే కాకుండా అనివార్యం కూడా. ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని వివేకాన్ని కోల్పోకుండా ఉండడమే అసలైన జయపతాక. టెర్రరిస్టు కేంద్రాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని భారత్‌ చేసిన దాడులతో ఆ వివేకం ప్రదర్శితమైందనే అనుకోవాలి.

ఇవి కూడా చదవండి:

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‎పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన

Updated Date - May 08 , 2025 | 02:00 AM