ఆగని మానవహననం
ABN , Publish Date - May 07 , 2025 | 04:52 AM
గాజాపట్టీ మొత్తాన్ని ఆక్రమించుకొని, ఐక్యరాజ్యసమితి, తదితర స్వచ్ఛంద సంస్థల అధీనంలో ఉన్న ఆహారసరఫరాలను తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది. అదనంగా ముప్పైవేలమంది సైనికబలగాలు, మారణాయుధాలతో సాగబోయే...

గాజాపట్టీ మొత్తాన్ని ఆక్రమించుకొని, ఐక్యరాజ్యసమితి, తదితర స్వచ్ఛంద సంస్థల అధీనంలో ఉన్న ఆహారసరఫరాలను తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది. అదనంగా ముప్పైవేలమంది సైనికబలగాలు, మారణాయుధాలతో సాగబోయే ఈ కొత్త ఊచకోత ఇంకెంతమందిని బలితీసుకుంటుందో తెలియదు కానీ, ఆకలిని ఆయుధంగా వాడి నిరవధిక యుద్ధం చేయబోతున్నామన్నది నెతన్యాహూ ప్రసంగం సారాంశం. ఇప్పటికే రెండునెలలుగా నిలిచిపోయిన ఆహారసరఫరాలతో ఆఫ్రికాదేశాల తరహా ఆకలి సమస్యను ఎదుర్కొంటున్న ఈ దురదృష్టకర గడ్డపై, సమీపకాలంలోనే మరిన్ని భయానకమైన దృశ్యాలను చూడబోతున్నాం.
హమాస్ను పూర్తిగా తుదముట్టించడం, దానివద్ద బందీలుగా మిగిలిపోయినవారిని విడిపించుకోవడం వంటి అవే పాతలక్ష్యాలతో ఇజ్రాయెల్ ఈ కొత్తప్రణాళిక అమలు చేయబోతోంది. హమాస్మీద ఇంత యుద్ధం చేసినా, అది ఒప్పందంలో భాగంగా తనకు తానుగా బందీలను అప్పగించడం వినా, ఇజ్రాయెల్ సైనికులు ఎవరినీ విడిపించుకున్నదేమీ లేదు. హమాస్ దుంపనాశనం, బందీలను రక్షించుకోవడం అనే లక్ష్యాలు ఇంతవరకూ నెరవేరనేలేదు కానీ, 90శాతం మంది గాజావాసులను నిరాశ్రయులను చేసి, యాభైవేల మందిని ఊచకోతకోయడం మాత్రం జరిగిపోయింది. స్వల్పవిరామం తరువాత ఇప్పుడు మళ్ళీ కొత్త అంకానికి తెరదీసి, గాజాను పూర్తిగా కబ్జా చేసి నిరవధికంగా, నిరంతరాయంగా దశాబ్దాల తరబడి తన అధీనంలో ఉంచుకోవడానికి ఇజ్రాయెల్ ఎత్తులు వేస్తోంది. ట్రంప్ మహాశయుడు వచ్చేవారం పశ్చిమాసియాలో పర్యటించి, బుజ్జగింపులు, హెచ్చరికలతో వాతావరణాన్ని సానుకూలం చేసిపోగానే, పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయెల్ ఈ భీకరస్థాయి సైనికచర్య ఆరంభిస్తుంది. గాజామీద పట్టు సాధించి, అత్యధికులను తరిమికొట్టి, ఆయుధాలతో, ఆకలిచావులతో మిగిలినవారిని హతం చేసి, అంతిమంగా ఆ పట్టీని పళ్ళెంలో పెట్టి ట్రంప్కు అప్పగించే కార్యక్రమం దిశగా అడుగులు పడుతున్నాయి. గాజాను అత్యద్భుతమైన టూరిస్టు రిసార్టుగా మార్చాలన్న ట్రంప్ కల నెరవేర్చి, ఆయన కళ్ళలో ఆనందాన్ని చూడాలనుకుంటున్నారు ఆప్తమిత్రుడైన నెతన్యాహూ. జనాన్ని దక్షిణగాజాకు తరలించడం అన్నది మాయమాటే తప్ప, ఒకసారి మానవహననం మొదలైతే పాలస్తీనియన్లు పారిపోక తప్పదు, హద్దులు గీసుకొని కూర్చున్న పొరుగుదేశాల మనసులు కరగకా తప్పదు.
రెండునెలలుగా అంతర్జాతీయ సాయాన్ని పట్టీలోకి ప్రవేశించకుండా అడ్డుతున్న ఇజ్రాయెల్ ఇప్పటికే దయనీయమైన పరిస్థితులకు కారణమైంది. ఆహారసరఫరాలు నిలిచిపోయిన కారణంగా ఒక వ్యక్తికి మూడురోజులకు ఒకసారి మాత్రమే తినడానికి ఏదైనా దొరుకుతోందని వార్తలు వస్తున్నాయి. మూడులక్షలమంది పిల్లలు చావు అంచున ఉన్నారు. ఆహారం, మందులు, ఇంధనం లేకుండా చేయడం ద్వారా పాలస్తీనియన్లను మాడ్చేస్తున్న ఇజ్రాయెల్ ఇకపై ఆకలిచావులను కూడా ఆయుధంగా వాడబోతోంది. జనవరిలో కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చినప్పటికీ, ఆహారసరఫరాలు ఇంకా జోరందుకోకముందే ఆ ముచ్చటా ముగిసిపోయింది. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపు గురించి హమాస్–ఇజ్రాయెల్ మరో ఇరవై నాలుగుగంటల్లో ఒక నిర్ణయానికి రావాల్సి ఉండగా, ఇజ్రాయెల్ మార్చి 18 తెల్లవారుజామున గాజామీద విరుచుకుపడి ఐదువందలమందిని ఊచకోతకోసింది. ఈ ఘటనలో వందలాదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఎఫ్–16, ఎఫ్–35 వంటి యుద్ధవిమానాలతో పాటు, హెలికాప్టర్లు, డ్రోన్లు కూడా ఆకాశంనుంచి అమాయకజనంమీద నిప్పులు కురిపించాయి. పరుగులు తీస్తున్నవారిని సైతం ఇజ్రాయెల్ సైనికులు కాల్చిపారేశారు. గాజా యుద్ధంలో ఒకేరోజున అత్యధికసంఖ్యలో జనహననం జరిగిన సందర్భం అది. కాల్పుల విరమణ అమలైన ఆ స్వల్పకాలంలో గాజాకు తిరిగివచ్చిన పాలస్తీనియన్ల సంఖ్య ఓ ఐదులక్షలవరకూ ఉంది. వారిని భయోత్పాతంలో ముంచెత్తి, వెనక్కు పంపివేసి, గాజాను ఖాళీచేయించే ప్రయత్నాలు అప్పటినుంచే మొదలైనాయి. స్వస్థలాన్ని వీడిపోవడానికి ససేమిరా అంటున్న మిగతా పాలస్తీనియన్లమీద ఒత్తిడిపెంచేందుకు ఇప్పుడు ఇజ్రాయెల్ మరో దమనకాండకు ఉపక్రమిస్తోంది. ఈ కొత్త యుద్ధం హమాస్ చేతుల్లో ఉన్న బందీలను విడిపించేందుకు వీసమెత్తు ఉపకరించదని నెతన్యాహూకు తెలుసు. కానీ, ఆ పేరిట గాజాలో ఊహకు అందనంత విధ్వంసానికి పాల్పడి, అంతిమంగా రిసార్టు కల నెరవేర్చుకోవడం అమెరికా–ఇజ్రాయెల్ పాలకులకు ముఖ్యం.
ఇవి కూడా చదవండి..
సరిహద్దు వెంబడి భారీ వైమానిక ఎక్సర్సైజ్.. నోటీసు విడుదల చేసిన కేంద్రం
India Pak War: యుద్ధం పరిష్కారం కానేకాదు.. భారత్కు ఐరాసా సూచన
Pakistan Army Chief: భారత్ దాడికి దిగితే.. పాక్ ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
మరిిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్పై క్లిక్ చేయండి