Share News

యుద్ధం శాంతి

ABN , Publish Date - May 13 , 2025 | 05:17 AM

భారత్‌–పాకిస్థాన్‌ల మధ్య నాలుగు రోజులపాటు సాగిన సాయుధ సంఘర్షణ పూర్తిస్థాయి యుద్ధంగా మారకముందే ముగిసింది. ఘర్షణ ఆగిపోవడం, హింసకు తెరపడడం సంతోషమే అయినా అది జరిగిన తీరు మాత్రం తీవ్ర చర్చకు, అనుమానాలకు దారితీసింది. పాక్‌ ఉగ్రవాదులు, పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు...

యుద్ధం శాంతి

భారత్‌–పాకిస్థాన్‌ల మధ్య నాలుగు రోజులపాటు సాగిన సాయుధ సంఘర్షణ పూర్తిస్థాయి యుద్ధంగా మారకముందే ముగిసింది. ఘర్షణ ఆగిపోవడం, హింసకు తెరపడడం సంతోషమే అయినా అది జరిగిన తీరు మాత్రం తీవ్ర చర్చకు, అనుమానాలకు దారితీసింది. పాక్‌ ఉగ్రవాదులు, పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏప్రిల్‌ 22న పహల్గాంలో భారత టూరిస్టులను వారి భార్యాబిడ్డల ముందు దారుణంగా కాల్చిచంపిన సంఘటన ప్రపంచాన్ని కుదిపేసింది. లష్కరే తోయిబా నుంచి విడివడిన ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ అనే నిషేధిత సంస్థకు చెందిన ఈ టెర్రరిస్టులకు పాక్‌ అన్ని రకాల సహాయ సహకారాలు అందించినట్లు భారత్‌ ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. దీనిపై అట్టుడికిన భారత్‌ మే 7న పాకిస్థాన్‌, ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై లాంగ్‌రేంజ్‌ ఆయుధాలతో దాడులు చేసింది. దానికి పాక్‌ ఊరుకోకుండా ఎదురుదాడికి దిగడంతో భారత్‌ కూడా స్పందించి గట్టిగా తిప్పికొట్టింది. భారత్‌ దాడుల్లో పాక్‌ సైన్యానికి బలమైన ఎదురుదెబ్బలు తగలడంతో పాక్‌ ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌ అణ్వస్త్ర నేషనల్‌ కమాండ్‌ అథారిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీంతో ఇది అణు యుద్ధానికి దారితీస్తుందనే ఆందోళన మొదలైంది.

ఆ దశలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నుంచి అకస్మాత్తుగా కాల్పుల విరమణ ప్రకటన వెలువడింది. ఆ తర్వాత కాసేపటికి కాల్పుల విరమణను ధ్రువీకరిస్తూ భారత్‌ కూడా ప్రకటన విడుదల చేసింది. ‘‘నిర్ణీత లక్ష్యాలేవీ సాధించకుండా, పాక్‌ నుంచి ఎలాంటి హామీలూ పొందకుండా కాల్పుల విరమణకు అంగీకరించడం ఏమిటి? అది కూడా ట్రంప్‌ దీనిని ప్రకటించడం ఏమిటి?’’ అంటూ వివిధ వర్గాల నుంచి వచ్చిన ప్రశ్నలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. కొందరు బీజేపీ మద్దతుదారులు సైతం ఈ విషయంలో మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు. పైగా ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్‌ రెండు గంటల్లోనే భారత్‌పై దాడికి దిగడంతో ఈ విమర్శలు మరింత తీవ్రమయ్యాయి. చివరికి కాల్పులు ఆగిపోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.


భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తోను, పాక్‌ ప్రధాని షరీఫ్‌తోను అమెరికా విదేశాంగ మంత్రి రూబియో గత శుక్రవారం చర్చలు జరిపారు. దీంతో కాల్పుల విరమణ కోసం అమెరికా ప్రయత్నాలు చేస్తోందని అందరూ భావించారు. అయితే ఆ తర్వాత కాసేపటికే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ మాట్లాడుతూ భారత్‌, పాక్‌ వివాదంతో అమెరికాకు సంబంధం లేదని, తాము అందులో జోక్యం చేసుకోబోమని ప్రకటించారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే తమ మధ్యవర్తిత్వం వల్ల రెండు దేశాలూ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు శనివారం ట్రంప్‌ ప్రకటన వచ్చింది. 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్చిందని భారత్‌ చెప్పిన కాసేపటికే పాక్‌ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. దీంతో ఏం జరుగుతోందనే ఆందోళన అందరిలో కలిగింది. కానీ తుదకు అన్నీ సర్దుకున్నాయి.

ఘోరమైన ఉగ్రవాద దాడి మనస్సుల్ని కాలుస్తున్నప్పుడు కాల్పుల విరమణ అందరికీ సంతృప్తి కలిగించకపోవచ్చు. కానీ ఈ యుద్ధం ద్వారా భారత్‌ కొన్ని లక్ష్యాలను నెరవేర్చుకుందనే చెప్పాలి. తొలిరోజు దాడుల్లోనే పాక్‌లోని అనేక ఉగ్రవాద శిబిరాల్ని, వారి మౌలిక సదుపాయాల్ని భారత్‌ ధ్వంసం చేసింది. పలువురు కీలకమైన ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. అలాగే అణ్వస్త్ర దాడి చేస్తామనే బెదిరింపుల్ని లెక్క చేయబోమని, పాక్‌ మరోసారి ఉగ్రవాద దాడికి పాల్పడితే యుద్ధమే మా సమాధానమని పాక్‌కే కాదు, ప్రపంచానికి కూడా గట్టి సందేశం ఇచ్చింది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత జరిగిన బాలాకోట్‌ దాడులు ఆరేళ్లపాటు పాక్‌ భారీ ఉగ్రదాడులకు పాల్పడకుండా నిరోధించగలిగాయి. ఇప్పుడు భారత్‌ మరింత తీవ్రంగా స్పందించడంతో ఉగ్రవాదాన్ని ప్రేరేపించే విషయంలో భవిష్యత్తులో పాక్‌ ఒకటికి పదిసార్లు ఆలోచించుకోక తప్పదు. పాక్‌ యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడినా ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలతో వాటిని కూల్చడం ద్వారా భారత్‌ తన సత్తా చాటింది. భారత్‌ కూడా కొన్ని యుద్ధ విమానాలను కోల్పోయినట్లు వార్తలు వస్తున్నప్పటికీ యుద్ధంలో కొన్ని నష్టాలు సర్వసాధారణమే.


ఏ యుద్ధమైనా శాంతితోనే ముగియాలి. ఇది కూడా అంతే! యుద్ధం చేసే సైనికుడికే శాంతి విలువ తెలుస్తుంది. ‘‘మంచి యుద్ధమూ, చెడు శాంతీ ప్రపంచంలో లేవు’’ అన్నాడు బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌. గతంలో దీనిని చెడు యుద్ధంగా భావించిన బీజేపీ వ్యతిరేకులు తాజా కాల్పుల విరమణ మంచిది కాదనడం, గతంలో ఇది మంచి యుద్ధమన్న బీజేపీ మద్దతుదారులు ఇప్పుడు కాల్పుల విరమణ మంచిదేననడం మాత్రం ఇందులో ఓ వైచిత్రి.

ఇవి కూడా చదవండి..

AP SSC Supplimentary Exams hall tickets: టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..

Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల

Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ

Encounter: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు భారీ దెబ్బ

For National News And Telugu News

Updated Date - May 13 , 2025 | 05:17 AM