Share News

కక్ష శిక్ష

ABN , Publish Date - May 14 , 2025 | 06:17 AM

బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యం నిలబడాలని, ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అక్కడి తాత్కాలిక ప్రభుత్వాధినేతకు ఏ మాత్రం ఉన్నా, మాజీ ప్రధాని షేక్‌హసీనా పార్టీని రద్దుచేయాలన్న నిర్ణయం తీసుకొనేవారు కాదు. ఆమెను నియంత అంటున్నప్పుడు అదేరీతిలో వ్యవహరించేవారు కాదు. షేక్‌ హసీనా నాయకత్వంలోని అవామీలీగ్‌ పార్టీని నిషేధిస్తూ...

కక్ష శిక్ష

బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యం నిలబడాలని, ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అక్కడి తాత్కాలిక ప్రభుత్వాధినేతకు ఏ మాత్రం ఉన్నా, మాజీ ప్రధాని షేక్‌హసీనా పార్టీని రద్దుచేయాలన్న నిర్ణయం తీసుకొనేవారు కాదు. ఆమెను నియంత అంటున్నప్పుడు అదేరీతిలో వ్యవహరించేవారు కాదు. షేక్‌ హసీనా నాయకత్వంలోని అవామీలీగ్‌ పార్టీని నిషేధిస్తూ సోమవారం బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2009 నాటి ఉగ్రవాద వ్యతిరేక చట్టంలో, ఈ పార్టీ రద్దుకు అవకాశమిచ్చే వెసులుబాట్లు లేవు కనుక, దానిని సవరించి మరీ మహ్మద్‌ యూనిస్‌ ప్రభుత్వం ఈ చర్యకు ఒడిగట్టింది. అవామీలీగ్‌, దాని అనుబంధ, సోదర సంస్థలన్నింటినీ నిషేధించడానికి వీలుగా ఆ సవరణను తయారుచేసుకుంది. అవామీలీగ్‌, దాని నాయకులందరిపైనా ప్రత్యేక ట్రైబ్యునల్‌ ఎలాగూ విచారణ జరుపుతోంది. ఆ విచారణ పూర్తయ్యేవరకూ నిషేధం అమలులో ఉంటుందట. ఒక ఆర్డినెన్సుద్వారా రాత్రికి రాత్రి ఉగ్రవాద వ్యతిరేక చట్టాన్ని సవరించి, వెనువెంటనే హసీనా పార్టీమీద వేటువేయడం గమనించినప్పుడు అక్కడి తాత్కాలిక ప్రభుత్వం కక్షసాధింపులో హసీనాను మించిపోతోందని అర్థమవుతోంది. హసీనా దేశం విడిచిపోగానే గృహనిర్బంధం నుంచి బయటకు వచ్చిన ఆమె రాజకీయ ప్రత్యర్థి ఖలీదాజియా విదేశాల్లో ఖరీదైన చికిత్సలన్నీ చేయించుకొని ఇటీవలే దేశంలో తిరిగి కాలూనారు. సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా ఆమె రాకడ, హసీనా పార్టీమీద నిషేధం ఒకేసారి జరగడం కాకతాళీయం కాకపోవచ్చు. భారతదేశం పశ్చిమదిక్కున పాకిస్థాన్‌తో పోరాడుతున్న సమయంలో, పాకిస్థాన్‌ అనుకూల యూనిస్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని హసీనా అనుకూల భారతదేశాన్ని ఇరకాటంలోకి నెట్టేసిందని అంతర్జాతీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. సరైన విధానాలు, ప్రక్రియలు పాటించకుండా అవామీలీగ్‌ మీద నిషేధాన్ని విధించడం సముచితం కాదని భారత విదేశాంగశాఖ మంగళవారం ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. సాధ్యమైనంత వేగంగా, స్వేచ్ఛాయుతంగా, సమ్మిళితంగా ఎన్నికలు జరగాలన్నది. అవామీలీగ్‌ భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో పాల్గొనకుండా బంగ్లాదేశ్‌ ఎన్నికల సంఘం ఒక రాజకీయపార్టీగా దాని గుర్తింపును సైతం రద్దుచేసింది. డెబ్బైఐదేళ్ళ అవామీలీగ్‌ మీద చేపట్టిన చర్యలన్నీ దురుద్దేశపూరితమైనవేనని ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యూనల్‌ ఆఫ్‌ బంగ్లాదేశ్‌ (ఐసిటి–బిడి) ఒకపక్కన ఈ పార్టీ కార్యకర్తలు, నేతల దుర్మార్గాలూ దాష్టీకాలమీద విచారణ జరుపుతున్న నేపథ్యంలో తుది తీర్పులు, నిర్ణయాలు వెలువడేవరకూ ప్రభుత్వం ఆగివుంటే సరిపోయేది. కానీ, అడ్వయిజరీ కౌన్సిల్‌ అత్యవసర సమావేశాన్ని ప్రకటించడం, దానికి ముందు, నేషనల్‌ సిటిజన్ పార్టీ, జమాతే ఇస్లామీ వంటివి అవామీలీగ్‌ను నిషేధించాలంటూ భారీ ప్రదర్శనలు జరపడం వంటి పరిణామాలు ఒక ప్రణాళికాబద్ధంగా జరిగాయి.


ఆ తరువాత యూనిస్‌ వ్యాఖ్యలు గమనించినప్పుడు కూడా ఈ నిర్ణయం ఎప్పుడో జరిగిపోయిందని అనిపించింది. హసీనా దేశం విడిచిపోయిన తొమ్మిదినెలల్లో, ఒక ఉగ్రవాద వ్యతిరేకచట్టాన్ని ప్రయోగించి మరీ యూనిస్‌ ప్రభుత్వం ఆమె పార్టీని రద్దుచేసింది. ఈ చర్య మిగతా ప్రపంచానికి ఏ సందేశాన్ని ఇస్తుందో నోబెల్‌ బహుమతి గ్రహీతకు తెలియదనుకోలేం. హసీనా తన పాలనాకాలంలో ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకున్నారని ఎవరూ అనడం లేదు. కానీ, అవామీలీగ్‌ ఆవిర్భావం కొన్ని ఆదర్శాలు, ఆకాంక్షలకు అనుగుణంగా జరిగాయన్నవాదనను ఎవరూ కాదనలేరు. పాకిస్థాన్‌ మతోన్మాద, నిరంకుశ వైఖరులకు, విధానాలకు వ్యతిరేకంగా ముజబూర్‌ రహ్మాన్‌ పార్టీ జన్మించింది. దేశమనుగడకు లౌకికవాదం పునాది కావాలని కాంక్షించింది. భాష, సంస్కృతి ఇత్యాది అనేక విషయాల్లో తూర్పుపాకిస్తాన్‌ పూర్తిభిన్నమైనది కనుకనే, మిగతా పాకిస్థాన్‌ నుంచి విడివడేందుకు రక్తంధారపోసింది. ముజబూర్‌ రహ్మాన్‌ విగ్రహాలను కూల్చి, చరిత్ర పుస్తకాల్లోంచి ఆయననూ, ఆయన పార్టీనీ చెరిపివేసే విశేష కృషి ఇప్పటికే అక్కడ జోరందుకుంది. బంగ్లా విముక్తి పోరాటానికి మసిపూసి, దేశ ఆవిర్భావ రహస్యాలకు పాతరేసి పాక్‌ పాలకులకు నొప్పికలగనివ్వకుండా చూసే ప్రయత్నం బలంగా సాగుతోంది. చరిత్రను తిరగరాసే పేరిట తమ మూలాలకే ముప్పుతెచ్చుకొనే ప్రమాదంలో అక్కడివారు ఉండటం విషాదం. హసీనాకు వ్యతిరేకంగా ఉద్యమించి, ఆమెను దేశం నుంచి వెళ్ళగొట్టినవారంతా రేపటి ఎన్నికల్లో సైతం ఆమె పార్టీని ఘోరంగా ఓడిస్తే ఎవరికీ ఏ అభ్యంతరమూ ఉండదు. కానీ, ఆమెను నియంతనీ, మానవహక్కులను మంటగలిపిందనీ, ప్రజాస్వామ్యాన్ని పాతరేసిందనీ నిందించినవారే ఆమెను కనీసం ఎన్నికల బరిలోకి కూడా దిగనివ్వకుండా చేయడం విషాదం. న్యాయస్థానాలనూ, ట్రిబ్యునల్స్‌ను నామమాత్రం చేసి, ప్రస్తుత పాలకులే తీర్పులు చెప్పేస్తూ ఆమెకూ, ఆమె పార్టీకీ శిక్షలు వేయడం ఆశ్చర్యకరం.

ఈ వార్తలు కూడా చదవండి..

Sravan Rao: చీటింగ్ కేసులో శ్రవణ్ రావు అరెస్ట్

CM Chandrababu: ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సీఎం చంద్రబాబు భేటీ

Suryapet DSP Parthasarathy: డీఎస్పీ ఇంట్లో అక్రమంగా 100 బుల్లెట్లు..

Updated Date - May 14 , 2025 | 06:17 AM