Share News

ఉగ్రభూత పీచమణచగా

ABN , Publish Date - May 11 , 2025 | 02:47 AM

‘‘పొరుగుదేశం నుంచి వచ్చి మన ఇంట్లో మనల్ని కొట్టి వెళితే చర్చలు అంటూ ప్రేమలేఖలు రాయడమేమిటి? మన మంత్రి అమెరికా వెళ్లి మా మీద దాడి జరిగిందని అక్కడ ఏడవడమేమిటి? ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో అలాగే చెప్పాలి!’’... గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...

ఉగ్రభూత పీచమణచగా

‘‘పొరుగుదేశం నుంచి వచ్చి మన ఇంట్లో మనల్ని కొట్టి వెళితే చర్చలు అంటూ ప్రేమలేఖలు రాయడమేమిటి? మన మంత్రి అమెరికా వెళ్లి మా మీద దాడి జరిగిందని అక్కడ ఏడవడమేమిటి? ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో అలాగే చెప్పాలి!’’... గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక టీవీ షోలో చేసిన వ్యాఖ్యలు ఇవి! ‘‘అంతర్జాతీయ ఒత్తిళ్లను కూడా దృష్టిలో పెట్టుకోవాలిగా!’’ అని టీవీ వ్యాఖ్యాత అన్నప్పుడు ‘‘వంద కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంపై ఒత్తిళ్లు ఏమిటి?’’ అని కూడా మోదీ బదులిచ్చారు. ఇప్పుడు దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ దేశ భద్రతను తన చేతుల్లోకి తీసుకున్నారు. పహల్గాంలో ఉగ్రమూకలు కర్కశంగా దాడి చేసి 26 మందిని హతమార్చిన తర్వాత రగిలిపోయిన ప్రధాని పాకిస్థాన్‌పై దాడికి త్రివిధ దళాలను సిద్ధం చేసి ప్రతి దాడులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి వ్యవహరించిన, వ్యవహరిస్తున్న తీరు ఇంటా బయటా ఆయన ప్రతిష్ఠను అమాంతం పెంచింది. పహల్గాంలో యాత్రికుల మతం తెలుసుకొని మరీ పురుషులను మాత్రమే చంపి మన మహిళల పసుపు కుంకుమలను ఉగ్రవాదులు చెరిపేయడంతో దేశ ప్రజలందరూ ప్రతీకార వాంఛతో రగిలిపోయారు. పాకిస్థాన్‌కు సరైన గుణపాఠం చెప్పాల్సిందేనని కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు నినదించారు. దీంతో ఇదే అదనుగా భావించిన ప్రధానమంత్రి... పాక్‌పై ప్రారంభించిన ప్రతి దాడులకు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ అని వ్యూహాత్మకంగా నామకరణం చేశారు. ఏ మహిళల నుదుటిపై సిందూరం తుడిచివేయబడిందో అదే సిందూరం పేరిట ఆపరేషన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఆపరేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియాకు తెలియజేసే బాధ్యతను ఇద్దరు మహిళా సైనికాధికారులకు అప్పగించారు. ప్రధాని మోదీ చతురతకు ఇది నిదర్శనం!


అమెరికా ద్వారా పాకిస్థాన్‌ రాయబారాలు నడిపి కాల్పుల విరమణకు ఒప్పించిందా... లేదా మరేదైనా రూపంలో శరణుకోరిందా అనేది ప్రస్తుతానికి తెలియదు కానీ... శనివారం సాయంత్రం 5 గంటల నుంచి అనూహ్య రీతిలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అమలులోకి వచ్చింది. ఇది ఒకరకంగా శుభ పరిణామమే! అయితే... పాకిస్థాన్‌ నుంచి వచ్చిన ఉగ్రవాదులు మత ప్రాతిపదికన మారణహోమం సృష్టించడం ద్వారా మన దేశంలో హిందువులను సంఘటితం చేశారు. ఫలితంగా ప్రధాని మోదీ అత్యంత శక్తిమంతుడిగా అవతరించారు. మాకు మోదీ ఉన్నారన్న ధీమాలో ఇప్పుడు దేశ ప్రజలు ఉన్నారు. నాడు ఇందిర.. నేడు మోదీ ఆపరేషన్‌ సిందూర్‌ ప్రారంభించిన రాత్రి పాకిస్థాన్‌ గడ్డపై తిష్ఠవేసిన దాదాపు వంద మంది ఉగ్రవాదులను మట్టుబెట్టగలగడం మన దేశం సాధించిన విజయం. గతంలో పాకిస్థాన్‌పై మన దేశం రెండు పర్యాయాలు యుద్ధం చేయవలసి వచ్చింది. ఈ రెండు సందర్భాలలోనూ భారత దేశానిదే పైచేయి అయింది. మన దేశం 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం చేసింది. అప్పుడే పాకిస్థాన్‌ నుంచి బంగ్లాదేశ్‌ విడిపోయి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. మనకు 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రెండుసార్లు పాకిస్థాన్‌తో, ఒకసారి చైనాతో యుద్ధం చేయాల్సి వచ్చింది. 1971 తర్వాత భారత్‌–పాక్‌ మధ్య ఉద్రిక్తతలు ఏర్పడటం, స్వల్ప స్థాయిలో దాడులు చేసుకోవడం మినహా పూర్తి యుద్ధం జరగలేదు. 1971లో జరిగిన యుద్ధం గురించి ఇప్పుడు అరవై ఏళ్ల వయసు ఉన్న వారికి కూడా పూర్తిగా తెలియదు. అప్పుడు దేశ మంతటా బ్లాక్‌ ఔట్‌ పాటించారు. సైరన్‌ మోతలతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతికారు. అప్పుడు దివంగత ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండగా ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్నారు.

ఇద్దరూ శక్తిమంతమైన నాయకులే! 1971తో పోల్చితే మన దేశం ఆర్థికంగా ఎన్నో రెట్లు బలపడింది. మన సైనిక శక్తి పాటవాలు కూడా అనేక రెట్లు పెరిగాయి. అందుకే డ్రోన్లు, క్షిపణులతో పాకిస్థాన్‌ దాడులు చేసినప్పటికీ మనవైపు చెప్పుకోదగిన నష్టం ఏమీ జరగలేదు. అంతర్జాతీయ సమీకరణాలు... 1971లో పాక్‌కు దన్నుగా అమెరికా, బ్రిటన్‌, చైనా వంటి దేశాలు నిలవగా... మన దేశానికి సమైక్య రష్యా మాత్రమే అండగా ఉండింది. ప్రపంచ దేశాలపై ఎల్లకాలం అమెరికా పెత్తనం చేయడమేమిటి? మనమెందుకు ఆ పని చేయకూడదు? అని చైనా తలపోస్తోంది. అమెరికాను తప్పించి ఆ స్థానంలో తాను పెద్దన్న పాత్రను పోషించాలని చైనా భావించడం వల్ల అమెరికాకూ చైనాకూ పొసగడం లేదు. మరో వైపు భారతదేశం కూడా బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. దీంతో భారత్‌ నుంచి ముప్పు తప్పదని భావించిన చైనా మనతో శత్రుత్వం పెంచుకుంటోంది. చైనాకు సామంత దేశంగా ఉండటానికి భారత్‌ ఎప్పటికీ అంగీకరించదు. ఈ కారణంగా చైనా వ్యూహాత్మకంగా పాకిస్థాన్‌ను చేరదీస్తోంది. దాయాది దేశానికి వివిధ రూపాల్లో సహాయం చేస్తోంది.


భవిష్యత్తులో చైనాతో తలపడాల్సి వస్తే భౌగోళికంగా పాక్‌ భూభాగం అమెరికాకు కావాలి. ఈ కారణంగా ఉగ్రవాదంపై తమది రాజీ లేని పోరు అంటూనే అమెరికా దొడ్డి దారిన పాకిస్థాన్‌కు సహాయం చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో సైనికపరంగా అత్యంత శక్తిమంతంగా ఉన్న రష్యా మాత్రమే ఎప్పటికైనా మనకు అంతో ఇంతో అండగా నిలవొచ్చు. పశ్చిమ దేశాలతో ఉన్న వైరం కారణంగా రష్యా కూడా చైనాకు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరించే పరిస్థితి లేదు. ఈ కారణంగానే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్‌కు ఆర్థిక సహాయం చేయవద్దని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు భారత్‌ విజ్ఞప్తి చేసినా... శుక్రవారంనాడే వంద కోట్ల డాలర్ల సహాయం అందించడానికి అంగీకారం తెలిపింది. అంతర్జాతీయంగా ఎవరి ప్రయోజనాలు వారికి ఉంటాయి. రష్యా–ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కారణంగా ఉభయ దేశాలూ నష్టపోయాయి. రష్యాకు తిరుగులేని సైనిక శక్తి, ఆయుధ సంపద ఉన్నప్పటికీ... పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికా అండతో ఉక్రెయిన్‌ ఎదురొడ్డి నిలబడగలుగుతోంది. రష్యాతో తలపడటానికి అవసరమైన సహాయం కోసం ఉక్రెయిన్‌ తమ దేశంలోని సహజ వనరులు, ముఖ్యంగా ఖనిజ సంపదపై హక్కులను అమెరికాకు ధారాదత్తం చేయాల్సి వచ్చింది. మరోవైపు రష్యా కూడా పూర్వం ఉన్నట్టుగా ఆర్థికంగా పటిష్ఠంగా లేదు. మొత్తం మీద ఈ యుద్ధం వల్ల బలవంతుడు, బలహీనుడు కూడా నష్టపోయారు–నష్టపోతున్నారు. ఆర్థిక... వాణిజ్య... యుద్ధం! యుద్ధాలను భరించే స్థితిలో ప్రపంచ దేశాలు ఇప్పుడు లేవు. ఐదు దశాబ్దాల క్రితం పరిస్థితులు వేరు. అప్పుడు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కూడా లేవు. 1971 యుద్ధ సమయంలో అంతర్జాతీయ పరిణామాలు మన దేశ ప్రజలపై ప్రభావం చూపలేదు. ఇప్పుడు మన దేశం నుంచి ఎగుమతులు, దిగుమతులు కూడా పెరిగాయి.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ రెండో పర్యాయం బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ దేశాలపై సుంకాలను పెంచడంతో ప్రపంచ దేశాలు అల్లాడిపోయాయి. ప్రపంచీకరణ ఫలితం ఇది. గతంలో ఉంటే తినేవాళ్లం, లేకుంటే పస్తులు ఉండేవాళ్లం. ఇప్పుడు పరిస్థితి వేరు. అలా అని పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పకుండా ఉండలేం. మన దేశంతో యుద్ధం చేసి నెగ్గలేని పాకిస్థాన్‌ ఉగ్ర మూకలను పెంచి పోషించి మనపైకి ఉసిగొల్పుతోంది. తృతీయ ఆర్థిక శక్తిగా ఎదగాలనుకుంటున్న భారత్‌కు ఈ యుద్ధం ప్రతిబంధకమే అవుతుంది. అలా అని చేతులు ముడుచుకొని కూర్చోలేని స్థితి. కశ్మీర్‌ అందాలను ఆస్వాదించడానికి వెళ్లిన పర్యాటకులను వారి భార్యల కళ్లెదుటే కాల్చి చంపిన ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం ద్వారా మన దేశాన్ని పాకిస్థానే యుద్ధ రంగంలోకి లాగింది. కులమతాలతో సంబంధం లేకుండా దేశ ప్రజల భావోద్వేగాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. దుష్ట కుట్రల పాక్‌... ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ కూడా బావుకుంటున్నది ఏమీ లేదు. పాముకు పాలు పోసి పెంచితే అది ఏదో ఒకరోజు మనల్నే కాటేస్తుంది. పాకిస్థాన్‌కు కూడా ఈ పరిస్థితి ఎదురవుతోంది. భారత్‌ చర్యలవల్ల బంగ్లాదేశ్‌ పేరిట తమ భూభాగాన్ని కోల్పోవలసి రావడంతో పాక్‌ ప్రజలకు మన దేశంపై కోపం ఉంది.


దీన్ని ఆసరాగా తీసుకొని ఉగ్ర సంస్థలు పుట్టుకొచ్చాయి. భారత్‌తో నేరుగా తలపడి నెగ్గే పరిస్థితి లేనందున ఉగ్ర మూకల ద్వారా మన దేశంలో అలజడులు సృష్టించే ప్రయత్నం పాకిస్థాన్‌ చేస్తోంది. ఈ క్రమంలో పాక్‌లో తిష్ఠ వేసిన ఉగ్రవాదులు మరింత శక్తిమంతులుగా మారారు. పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఇంటర్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) ద్వారా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారు. ఫలితంగా పాక్‌ మిలటరీకి, ఉగ్రవాద సంస్థలకు మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది. పాకిస్థాన్‌లో ప్రజా ప్రభుత్వం కంటే మిలటరీనే శక్తిమంతమైనది. సైన్యాన్ని ధిక్కరించి పాక్‌ ప్రధానమంత్రులు పదవిలో కొనసాగలేరు. గతంలో ఎంతో మంది సైన్యాధ్యక్షులు ప్రధానమంత్రులను తొలగించి పాలనా పగ్గాలు చేపట్టడం చూశాం! అదే సమయంలో ఉగ్రవాద సంస్థలను కాదని స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి సైన్యానికి కూడా లేదు. సైన్యాన్ని ఉగ్రవాదులు తమ అదుపులో పెట్టుకోగా, ప్రభుత్వాలను సైన్యం తన అదుపులో పెట్టుకుంటోంది. స్థూలంగా పాక్‌ పరిస్థితి ఇది. తాము శత్రు దేశంగా పరిగణించే భారత్‌ను ఏదో చేయాలన్న దుగ్ధతో పాకిస్థాన్‌ తన తల కొరివిని తానే పెట్టుకుంటోంది. ప్రపంచ దేశాలు, ముఖ్యంగా భారత్‌ కోరుతున్నట్టు ఉగ్రవాదులకు సహాయ సహకారాలను నిలిపివేసే పరిస్థితి పాక్‌ ప్రభుత్వాలకు ఉందా? అంటే లేదు అనే చెప్పాలి. ఉగ్రవాదులను కట్టడి చేయాలనుకుంటే ఆ ప్రభుత్వాలకు మనుగడ ఉండదు. కొన్ని దశాబ్దాలుగా పాకిస్థాన్‌లో ఇదే పరిస్థితి ఉంది. ఫలితంగా పాకిస్థాన్‌ అన్ని విధాలుగా కునారిల్లుతోంది. ఆ దేశం ఆర్థికంగా దివాలా అంచున ఉంది. బయటి నుంచి ఆర్థిక సాయం అందని పక్షంలో పాక్‌ కుప్పకూలిపోతుంది. అయినా, ఉగ్రవాదులను ధిక్కరించలేని స్థితి. పాక్‌లో ప్రజా ప్రభుత్వం నిమిత్తమాత్రం. ఆర్థిక సంక్షోభం ఒకవైపు – అంతర్గత పోరు మరోవైపు ఆ దేశాన్ని కుంగదీస్తున్నప్పటికీ ఉగ్రవాదులకు పట్టదు. మతపరమైన ఉన్మాదంతో ఊగిపోతున్నారు.


పాకిస్థాన్‌లో దాదాపు 40 శాతం భూ భాగమైన బలూచిస్థాన్‌ స్వతంత్ర దేశంగా ఏర్పడాలని కోరుకుంటోంది. ఇందుకోసం బలూచీలు సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు. ఆమె కంట కన్నీరొలికితే... మనది పుణ్య భూమి! ఇప్పుడు మన మహిళల పసుపు కుంకుమలను ఉగ్రవాదులు చెరిపేశారు. పురాణాల నుంచి నేటి వరకు స్ర్తీల కన్నీటి కారణంగానే యుద్ధాలు జరిగాయి. నాడు ద్రౌపది వల్ల పాండవులు–కౌరవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం, సీత కోసం రామ రావణ యుద్ధం జరిగాయి. పుణ్య స్ర్తీ కన్నీటికి ఎంతో మహిమ ఉంటుందని నమ్మే దేశం ఇది. ఇప్పుడు పసుపు కుంకుమలు పోగొట్టుకున్న ఆడపడుచులకోసం ‘ఆపరేషన్‌ సిందూర్‌’ మొదలైంది. పహల్గాంలో ఉగ్రవాదుల చర్య అత్యంత హేయమైనది. అందువల్లే ఈ దారుణాన్ని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి. పాక్‌కు మద్దతు ఇస్తున్న చైనా కూడా ఈ దుశ్చర్యను ఖండించక తప్పలేదు. ప్రపంచ చరిత్రలో ఉగ్రవాదంగానీ, తీవ్రవాదంగానీ సఫలమైన దాఖలాలు లేవు. బుల్లెట్లను, హింసను నమ్ముకున్న వారు వాటికే బలయ్యారు. అల్‌ఖైదా చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌కు ఏ గతి పట్టిందో చూశాం! ఐసిస్‌ను ప్రారంభించిన వారికి కూడా అదే గతి పట్టింది. ఈ రెండు సంస్థలూ తమ హింస ద్వారా కొంతకాలం పాటు ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. చివరకు కాలగర్భంలో కలసిపోయాయి. ఈ రెండు సంస్థలూ, వాటి అధిపతులతో పోల్చితే మసూద్‌ అజర్‌లాంటి వాళ్లు ఎంత? హింసను నమ్ముకున్న తీవ్రవాదం పరిస్థితి కూడా ఇదే! శ్రీలంకలో తమిళులు అధికంగా నివసించే జాఫ్నా తదితర ప్రాంతాలను తమిళ ఈలం పేరిట విడగొట్టాలన్న డిమాండ్‌తో ఎల్టీటీఈని ప్రారంభించిన ప్రభాకరన్‌ చివరకు సైన్యం చేతిలో హతుడయ్యారు. ఆత్మాహుతి దళాల సంస్కృతిని ప్రవేశపెట్టిన ఘనత ఆయనదే. ఎల్టీటీఈకి చెందిన ఆత్మాహుతి దళమే మన మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని పొట్టనబెట్టుకుంది. ఖలిస్థాన్‌ ఉద్యమాన్ని ప్రారంభంలో పరోక్షంగా ప్రోత్సహించిన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చివరికి ఖలిస్థాన్‌ వాదాన్ని నరనరాన జీర్ణించుకున్న తన సొంత అంగరక్షకుల తుపాకీ నుంచి వెలువడిన తూటాలకే బలయ్యారు. పాకిస్థాన్‌లో కూడా మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో వంటి వారు ఉగ్రవాదుల తుపాకీ గుళ్లకు బలయ్యారు. తీవ్రవాదాన్నే తీసుకుందాం! ఐదు దశాబ్దాల క్రితం అప్పుడు నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తీవ్రవాదాన్ని నమ్ముకుని మావోయిస్టు పార్టీ పురుడు పోసుకుంది. కాలక్రమంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు, మంత్రులను హతమార్చారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అనే సిద్ధాంతానికి తావు ఉండటం లేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై యుద్ధం ప్రకటించింది. దీంతో ప్రధాన జనజీవన స్రవంతికి దూరమై అడవులకే పరిమితమైన మావోయిస్టులకు ఊపిరి సలపడం లేదు.


తమ ఉనికిని కాపాడుకునేందుకు శాంతి చర్చల ప్రతిపాదనను తెరమీదకు తెస్తున్నారు. ఆరు నెలల పాటు కాల్పుల విరమణకు సైతం సిద్ధం అని ప్రకటించాల్సిన పరిస్థితి. అయినా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మావోయిస్టులపై పోరాటాన్ని ఆపే పరిస్థితి లేదు. ఉగ్రవాద సంస్థలైనా, తీవ్రవాద సంస్థలైనా అంతిమంగా కనుమరుగు కావాల్సిందే! ఉగ్రవాదులు, తీవ్రవాదుల ఆలోచనల్లో హేతుబద్ధత ఉండదు. వారి వాదన తర్కానికి అందదు. ఉగ్రవాదులనే తీసుకుందాం. పవిత్ర యుద్ధం ‘జీహాద్‌’ అంటూ భారత్‌ పైకి తుపాకులు ఎక్కుపెట్టారు. మత ప్రాతిపదికన చేసే యుద్ధం పవిత్రమైనది ఎలా అవుతుంది? హింసను నమ్ముకోమని ఇస్లాం చెప్పలేదే! అమాయకులను పొట్టనపెట్టుకోమని అల్లా చెప్పలేదే? సాటి మానవుడిని ప్రేమించమని, సాయపడమనే ఏ మతమైనా చెబుతుంది. ఖురాన్‌ కూడా ఇదే చెబుతుంది. మరి ద్వేషానికి తావెక్కడ? పహల్గాంలో జరిగిందేమిటి? ఉగ్రవాదుల చేతిలో చనిపోయినవారు చేసిన పాపం ఏమిటి? వారు ఏ హాని చేశారు? మతం అడిగి మరీ చంపడమా? ఈ దుశ్చర్యను ఇస్లాం సమర్థిస్తుందా? ఎన్నటికీ కాదు! నిజంగా ఇస్లాంను ఆచరించేవారు ఇతరులకోసం ప్రాణాలను ఇస్తారు కానీ ప్రాణాలను తీయరు. ఉగ్రవాదులకు వారి నాయకులు నూరిపోస్తున్నది ఏమిటి? ‘పవిత్ర యుద్ధంలో మీరు చనిపోతే స్వర్గానికి వెళతారు. అక్కడ అందగత్తెలు మీ సొంతం. సకల భోగాలూ అనుభవించవచ్చు’ అని చెబుతారు. హిందూ మతంలో కూడా స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనకలు ఉంటారని చెబుతారు. అలా అని అమాయకులను చంపితే వారు మీకు సొంతం అవుతారని ఎవరూ చెప్పడం లేదే! ఖురాన్‌లో కూడా అమాయకులను చంపితే స్వర్గం ప్రాప్తిస్తుందని చెప్పలేదు. రంజాన్‌ మాసంలో ముస్లింలు తమ సంపాదనలో పది శాతం పేదలకు దానం చేయాలని ఖురాన్‌లో చెప్పారు. అంటే భూమిపై పుణ్య కార్యాలు చేసినప్పుడే స్వర్గ ప్రాప్తి లభిస్తుందనే కదా చెప్పింది! అన్నెం పున్నెం ఎరుగని వారిని చంపితే స్వర్గం కాదు కదా, భూమిపైనే నరకం ప్రాప్తిస్తుంది.


జమ్మూ కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల కంటే స్వర్గం అందంగా ఉంటుందా? భూతల స్వర్గాన్ని కళ్లెదురుగా పెట్టుకొని ఉందో లేదో తెలియని స్వర్గం కోసం పాకులాడటం మూర్ఖత్వం కాదా? జమ్మూ కశ్మీర్‌లో శాంతిభద్రతలు అదుపులోకి రావడం వల్ల మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచీ పర్యాటకులు తరలివస్తున్నారు. కళ్లెదుటే కనువిందు చేస్తున్న కశ్మీరీ అందాలను ఆస్వాదించడానికి వస్తున్న పర్యాటకుల వల్ల స్థానిక ముస్లింలు లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. పహల్గాం సంఘటనతో ఉపాధి కోల్పోయిన వారిలో ముస్లింలే అధికంగా ఉన్నారు కదా? ఉగ్ర మూకలు వారి కుటుంబాలను ఆదుకుంటాయా? ఉగ్రవాదం అనే మతిలేని చర్యలకు పాల్పడుతూ, అమాయకులను పొట్టనపెట్టుకుంటూ అర్ధంతరంగా ప్రాణాలను కోల్పోతున్నది కూడా ఉగ్రవాదులే. జమ్మూ కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లో శాంతి, సామరస్యం వెల్లివిరిస్తే ప్రపంచ నలుమూల నుంచీ పర్యాటకులు వస్తారు. స్విట్జర్లాండ్‌కు బదులుగా ఈ ప్రాంతాన్నే ఎంచుకుంటారు. పర్యాటకుల సంఖ్య పెరిగే కొద్దీ స్థానిక ప్రభుత్వాలకు ఆదాయం పెరిగి, ఆ ప్రాంతాన్ని స్వర్గధామంగా అభివృద్ధి చేయవచ్చు. అప్పుడు స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి కదా? అలాంటప్పుడు ఉందో లేదో తెలియని స్వర్గం కోసం హింసను నమ్ముకోవడం ఏమిటి? భారత్‌–పాక్‌ ఒక్కటిగా నిలిస్తే ప్రపంచాన్నే శాసించగలవు. శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగవచ్చు. అలా జరిగే అవకాశం ఉన్నందునే బ్రిటిష్‌ పాలకులు పోతూ పోతూ ఉభయ దేశాలలో మత విద్వేష బీజాలు నాటారు. ఇప్పుడు ఆ విద్వేషాలే కాలనాగులై మాతృ దేశాలకే అపకారం చేస్తున్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌లో మృతి చెందిన ఉగ్రవాదులకు పాక్‌ సైన్యం అధికారికంగా అంత్యక్రియలు జరిపించి ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడింది. అంత్యక్రియలకు హాజరు కాని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఉగ్రవాదుల నుంచి హుకుం వచ్చి ఉంటుంది. దాయాది దేశాల మధ్య యుద్ధం ఎందుకని ప్రశాంతంగా ఆలోచిస్తే ఏ సమస్యా ఉండదు. పాకిస్థాన్‌ను ఇప్పుడు ఉగ్రవాదులు పాలిస్తున్నారు. కాబట్టే విచక్షణారహితంగా వ్యవహరిస్తున్నారు. పహల్గాంలో అమాయకులను పొట్టన పెట్టుకున్నవారు ‘వెళ్లి మీ మోదీకి చెప్పుకోండి’ అని భర్తలను కోల్పోయిన భార్యలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.


ఈ నేపథ్యంలోనే ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత చనిపోయిన ఉగ్రవాదుల శవాల మధ్య ఏడుస్తున్న నాయకుడి ఫొటో పెట్టి ‘మేం మోదీకి చెప్పాం. ఫలితమే ఇది’ అన్నట్టుగా మాజీ ఆర్మీ చీఫ్‌ ఒక పోస్టు పెట్టారు. ప్రధాని మోదీ సాదాసీదా రాజకీయ నాయకుడు కాదు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని రాజకీయంగా బలపడటానికి ఎలా ఉపయోగించుకోవాలో ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి, ఆపరేషన్‌ సిందూర్‌కు వ్యతిరేకంగా మాట్లాడే దుస్సాహసం ఎవరూ చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు పాక్‌ పీచమణచడం ద్వారా అంతర్జాతీయంగా కూడా మోదీ కీర్తి ప్రతిష్ఠలు మరింత పెరిగే అవకాశం ఉంది. దటీజ్‌ మోదీ!

ఆర్కే

ఇవి కూడా చదవండి

Operation Sindoor: పౌరులు, ఆలయాలపైనే పాక్ దాడి.. వీడియోలతో భారత్ కౌంటర్

Operation Sindoor: సోషల్ మీడియాలో పాకిస్తాన్ తప్పుడు ప్రచారం.. అందులో నిజం లేదు..

Read Latest International News And Telugu News


2-Ed.jpg

యూట్యూబ్‌లో

‘కొత్త పలుకు’ కోసం QR Code scan చేయండి

Updated Date - May 11 , 2025 | 02:47 AM