Share News

అన్నాచెల్లెళ్ల వార్‌

ABN , Publish Date - May 25 , 2025 | 03:29 AM

అనగనగా రాజకీయాల్లో ఇద్దరు అన్నలు.. వారికి చెరో చెల్లి ఉన్నారు. ఆ ఇద్దరు అన్నల తండ్రులు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. షరా మామూలే.. తండ్రుల అధికారాన్ని అడ్డుపెట్టుకొని సంపదను పోగేసుకున్నారు. సహజంగానే సంపద కోసం అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. రక్తం పంచుకు పుట్టిన వాళ్లు బద్ధశత్రువులయ్యారు...

అన్నాచెల్లెళ్ల వార్‌

అనగనగా రాజకీయాల్లో ఇద్దరు అన్నలు.. వారికి చెరో చెల్లి ఉన్నారు. ఆ ఇద్దరు అన్నల తండ్రులు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. షరా మామూలే.. తండ్రుల అధికారాన్ని అడ్డుపెట్టుకొని సంపదను పోగేసుకున్నారు. సహజంగానే సంపద కోసం అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. రక్తం పంచుకు పుట్టిన వాళ్లు బద్ధశత్రువులయ్యారు. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. తెలుగునాట వర్తమాన రాజకీయాలలో ఇదొక రసవత్తర ఘట్టం. ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంలో చెలరేగిన కలహాలను ఇప్పటిదాకా చూశాం.. చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాలలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబంలో అదే సీన్‌ రిపీట్‌ కాబోతున్నది. తండ్రుల వల్ల సంక్రమించిన అధికారం, సంపదలో కుమార్తెలకు వాటా దక్కకపోవడం ఆ చెల్లెళ్ల ఆగ్రహానికి కారణమైంది. ఎన్టీఆర్‌ హయాంలో ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారని గుర్తుచేసుకోవాల్సిన సందర్భం ఇది. తండ్రులు అధికారంలో ఉన్నప్పుడు అన్నల చేతికి రాఖీలు కట్టి తమ మధ్య ఉన్న రక్త సంబంధాన్ని చాటి చెప్పినవాళ్లే ఇప్పుడు ఆ అన్నల ద్రోహాన్ని బయటపెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆస్తుల పంపకంలో తనకు అన్యాయం చేస్తున్నారనీ, కోరుకున్న రాజ్యసభ సీటు కూడా ఇవ్వకుండా నిరాదరణకు గురిచేశారంటూ షర్మిల తిరుగుబాటు చేయడం చూశాం. ఈ ఆస్తుల గొడవలో తల్లి విజయలక్ష్మి కుమార్తె షర్మిలకు అండగా నిలవడం, వివాదాలు న్యాయస్థానాలకు చేరడం చూశాం. ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబంలో కూడా అంతఃపుర కలహాలు వీధికెక్కాయి. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ వ్యవహారాల్లో అన్న కేటీఆర్‌కు ఇచ్చిన ప్రాధాన్యం తనకు ఇవ్వడంలేదన్న అసంతృప్తి చెల్లి కవితలో ఎప్పటి నుంచో ఉంది. పుండు మీద కారం రాసినట్టుగా కేటీఆర్‌కు తోడు, అప్పటి ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు పార్టీలో ప్రాధాన్యం పెరిగిపోవడాన్ని కవిత జీర్ణించుకోలేకపోయారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ఒక దశలో కేసీఆర్‌ తలపోశారు. రేపో మాపో తాను ముఖ్యమంత్రిని కాబోతున్నానని కేటీఆర్‌ కూడా చెప్పుకొన్నారు. దీంతో అన్నపై పైచేయి సాధించడం ఎలా? అని కవిత అంతర్మథనం చెందారు. భారత రాష్ట్ర సమితిలో కీలక నాయకుడిగా ఉన్న హరీశ్‌రావును తనతో చేయి కలపవలసిందిగా కవిత ఒక సందర్భంలో కోరారు. అయితే ఈ విజ్ఞప్తిని అప్పట్లోనే హరీశ్‌రావు సున్నితంగా తిరస్కరించారు. మేనమామ కేసీఆర్‌ను ధిక్కరించే సాహసాన్ని హరీశ్‌రావు చేయలేరు అని పలు సందర్భాలలో రుజువైంది. తాజాగా పార్టీలో తన ప్రాధాన్యం తగ్గిపోయి కేటీఆర్‌ అంతా తానై వ్యవహరించడం హరీశ్‌రావుకు రుచించలేదు. ‘కిం కర్తవ్యం’ ఏమిటా అని ఆయన కొన్ని రోజులుగా మథనపడుతున్నారు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం నుంచి హరీశ్‌రావుకు ఆఫర్లు వచ్చాయి. అయినా ఆయన తొందరపడకుండా మౌనాన్ని ఆశ్రయించారు.


కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కూడా హరీశ్‌రావుకు లభించని పరిస్థితి. దీంతో ఆయన బీఆర్‌ఎస్‌ను వీడతారని, బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది. ఫలితంగా కేటీఆర్‌ ఒక మెట్టు దిగి హరీశ్‌రావు ఇంటికి వెళ్లి రాజీ కుదుర్చుకున్నారు. బావ–బావమరుదుల మధ్య తాత్కాలికంగా సఖ్యత కుదిరింది. ఎర్రవల్లి ఫాంహౌజ్‌ గేట్లు కూడా హరీశ్‌రావుకు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో తండ్రి కేసీఆర్‌కు తనయ కవిత రాసిన లేఖ లీకై కలకలం సృష్టిస్తోంది. శుక్రవారం రాత్రి అమెరికా నుంచి తిరిగి వచ్చిన కవిత ఆ లేఖ తానే రాశానని ధ్రువీకరించారు. తాను రాసిన లేఖ లీకైందంటే పార్టీలో పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చునని అన్నారు. తన తండ్రి దేవుడు అని, అయితే ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. కవిత చెబుతున్న ఆ దెయ్యాలు ఎవరో ఇప్పుడు తేలాల్సి ఉంది. కేసీఆర్‌ను అంటిపెట్టుకొని ఉంటున్నవారు కేటీఆర్‌, సంతోష్‌ కుమార్‌ మాత్రమే. ఈ ఇరువురు కాకుండా కొంత మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కేసీఆర్‌తో అంటకాగుతూనే ఉంటారు. అయితే రక్తం పంచుకు పుట్టిన కవిత కంటే వారి మాటలకు కేసీఆర్‌ అధిక ప్రాధాన్యం ఇస్తారని భావించలేం. కేసీఆర్‌కు సన్నిహితంగా మెలిగిన బయటివారు అనతికాలంలోనే ఆయనకు దూరమవడం పరిపాటే. ఈ కారణంగా కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాలు కేటీఆర్‌, సంతోష్‌కుమార్‌ అని భావించాల్సి ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడు.. ముఖ్యంగా చివరి రెండు సంవత్సరాలు పార్టీలో, ప్రభుత్వంలో అంతా తానే అన్నట్టుగా సంతోష్‌కుమార్‌ వ్యవహరించారు. ఈ పరిణామాన్ని ఒక దశలో కేటీఆర్‌ కూడా జీర్ణించుకోలేకపోయారు. రాజీ పడటానికి అలవాటుపడిన హరీశ్‌రావు ఈ పరిణామాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే కవిత మాత్రం అప్పట్లోనే తన అసంతృప్తిని దాచుకోలేకపోయారు. ఈ దశలో ఎన్నికలు జరగడం, బీఆర్‌ఎస్‌ అధికారాన్ని కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత అటు తండ్రి వద్ద, ఇటు పార్టీలో కేటీఆర్‌ ప్రాధాన్యం పెరిగింది. సరిగ్గా ఈ దశలోనే ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో కవిత పేరు వెల్లడి కావడం, ఈడీ అధికారులు ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగిపోయింది. కుమార్తెను జైలు నుంచి బెయిలుపై విడిపించుకోవడానికి అప్పట్లో కేసీఆర్‌ చేయని ప్రయత్నం లేదు. కేటీఆర్‌, హరీశ్‌రావులను ఢిల్లీలో మకాం చేయించి భారతీయ జనతా పార్టీ పెద్దల వద్దకు రాయబారాలు నెరిపించారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమని కూడా ఆఫర్లు ఇచ్చారు. అయితే బీజేపీ పెద్దల నుంచి సానుకూల స్పందన రాలేదు. తెలంగాణ ఏర్పాటు సమయంలో అప్పటి టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని నమ్మబలికిన కేసీఆర్‌, రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్‌కు జెల్ల కొట్టడం బీజేపీ పెద్దలకు గుర్తుకొచ్చి ఉంటుంది. బీజేపీతో రాజీ ప్రయత్నాలు ఫలించకపోయినా మిగతా నిందితులతో పాటు కవితకు కూడా బెయిల్‌ వచ్చింది. ఆ తర్వాత కవిత కొంత కాలం పాటు పార్టీకి దూరంగా ఉండిపోయారు. ఇటీవలి కాలంలోనే ఆమె తిరిగి ప్రజల్లోకి వెళుతున్నారు. అయితే పార్టీలో తనకు పూర్వం లభించిన ప్రాధాన్యం కరువైంది. కేసీఆర్‌ కూడా ఆమెను పట్టించుకోలేదు. వరంగల్‌లో భారీగా ఖర్చు చేసి నిర్వహించిన రజతోత్సవ సభలో కూడా ఆమెకు ప్రాధాన్యం దక్కలేదు. అప్పుడు హరీశ్‌రావు కూడా రజతోత్సవ సభకు దూరంగానే ఉండిపోగా కేటీఆర్‌ సర్వం తానై వ్యవహరించారు. అదే సమయంలో పార్టీలో కవిత రీఎంట్రీని ప్రజలు హర్షించడం లేదని ప్రచారం చేశారు. దీంతో పార్టీలో తనకు చోటు లేదన్న అభిప్రాయానికి కవిత వచ్చారు.


పార్టీ పగ్గాలు సోదరుడు కేటీఆర్‌ చేతికి చిక్కితే తన పరిస్థితి ఏమిటి? అని మథనపడ్డారు. ఈ నేపథ్యంలోనే కవిత సొంత పార్టీ ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. ఈ దశలో తన కుమారుడు గ్రాడ్యుయేషన్‌ పట్టా అందుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకొని కవిత అమెరికా వెళ్లారు. అదే సమయంలో బీఆర్‌ఎస్‌ రజతోత్సవాలను అమెరికాలో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి కేటీఆర్‌ అమెరికా వెళ్లబోతున్నారు. అయితే అప్పటికే అమెరికాలో ఉన్న కవితను ఈ ఉత్సవాల గురించి ఎవరూ సంప్రదించలేదు. అమెరికాలో నివసిస్తున్న తెలంగాణ వారు కూడా ఆమెను పట్టించుకోలేదు. అదే సమయంలో రజతోత్సవ సభ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి కేటీఆర్‌ తరఫున మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అమెరికా వెళ్లారు. సుమన్‌కు ఇచ్చిన ప్రాధాన్యం కూడా తనకు ఇవ్వకపోవడంపై కవిత ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే వరంగల్‌ సభ తర్వాత తండ్రి కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ గురువారం బయటకు పొక్కింది. కవిత అమెరికా నుంచి తిరిగి రావడానికి ఒక రోజు ముందు ఈ లేఖ లీక్‌ కావడం యాదృచ్ఛికం కాకపోవచ్చు. ఈ లేఖను ఎవరు లీక్‌ చేశారన్నది ఇప్పుడు తేలవలసి ఉంది. కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాలు ఈ లేఖను లీక్‌ చేశాయా? లేక కవితనే తన రాకకు ఒక రోజు ముందు వ్యూహాత్మకంగా లీక్‌ చేశారా? అన్నది తేలాల్సి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారం తమదేనని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆశల పల్లకిలో విహరిస్తున్న వేళ చోటుచేసుకున్న ఈ పరిణామాలు ఆ పార్టీ శ్రేణులను నివ్వెరపోయేలా చేశాయి. ఇప్పుడు కవిత అడుగులు ఎటు? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా ఉంది. కవిత వెనుక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నారని బీఆర్‌ఎస్‌ నాయకులు అనుమానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చెల్లి షర్మిల వెనుక చంద్రబాబు ఉన్నారని జగన్మోహన్‌రెడ్డి ఆరోపించడం విన్నాం. ఇప్పుడు తెలంగాణలో కవిత వెనుక ఫలానా వారు ఉన్నారని బీఆర్‌ఎస్‌ నాయకులు స్పష్టంగా చెప్పడం లేదు. ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్‌ వైఖరి ఎలా ఉండబోతున్నదో తెలియకుండా మాట్లాడితే తమకే మంచిది కాదన్న ఉద్దేశంతో బీఆర్‌ఎస్‌ నాయకులు మౌనాన్ని ఆశ్రయించారు.


మా చెడ్డ అధికారం!

అధికారం మహా చెడ్డది. అయినవాళ్ల మధ్య కూడా దూరం పెంచుతుంది. తండ్రి కేసీఆర్‌కు ఎదురు నిలిచి ధిక్కరించే సాహసం ఇప్పటివరకు కేటీఆర్‌ గానీ, కవిత గానీ చేయలేదు. అలాంటిది ఇప్పుడు కవిత హఠాత్తుగా తండ్రికి ఇబ్బందులు సృష్టించే పనిచేయడం సహజంగానే ఆశ్చర్యం కలిగిస్తోంది. కవిత తిరుగుబాటు స్వరం టీ కప్పులో తుఫానులా చల్లబడుతుందా? లేక బీఆర్‌ఎస్‌ పుట్టి ముంచుతుందా? అన్నది ఇప్పుడే చెప్పలేం. కేసీఆర్‌ను కలిసి అన్ని విషయాలూ మాట్లాడతానని కవిత అంటున్నందున కేసీఆర్‌ తన కుమార్తెకు సర్దిచెబుతారా? లేక ఆమెను పార్టీ నుంచి బయటకు పంపుతారా? అన్నది స్పష్టమవుతుంది. కేసీఆర్‌ ఆగ్రహానికి గురైతే కవిత పరిస్థితి ఏమిటి? కార్యకర్తల మద్దతు గానీ, ప్రజల మద్దతు గానీ ఆమెకు లభించే పరిస్థితులు కనిపించడం లేదు. విమానాశ్రయం వద్ద కవితకు స్వాగతం పలకడానికి జాగృతి కార్యకర్తలు వచ్చి ఉండవచ్చును గానీ చివరి వరకు వారంతా ఆమె వెంట నిలబడకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో షర్మిల ఒక విఫల ప్రయోగంగా నిలిచారు. తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించి రాజీ పడకుండా పాదయాత్ర చేసినా ఆమెకు ఆదరణ లభించలేదు. దీంతో అన్న జగన్‌రెడ్డిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమె ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ బాధ్యతలు చేపట్టారు. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే పగలనకా రాత్రనకా కష్టపడాలి. అవరోధాలను ఓర్పుగా అధిగమించాలి. ఈ లక్షణాలు షర్మిలలో లేకపోవడం వల్ల ఆమె రాజకీయంగా నిలదొక్కుకోలేక పోతున్నారు. షర్మిలతో పోలిస్తే కవితది భిన్నమైన నేపథ్యం. తెలంగాణ ఉద్యమంలో కవిత చురుగ్గా పాల్గొన్నారు.. తెలంగాణ జాగృతి పేరిట తనకంటూ ప్రత్యేకంగా ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నారు. కింది స్థాయి కార్యకర్తలతో కూడా ఆమెకు పరిచయాలు ఉన్నాయి. వైఎస్‌ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం చెందినందున జగన్‌–షర్మిల మధ్య ఏర్పడిన వివాదాల పరిష్కారానికి ఆ కుటుంబంలో పెద్ద దిక్కు లేకుండా పోయింది. తల్లి విజయలక్ష్మి కుమారుడు, కుమార్తె మధ్య నలిగిపోవడం మినహా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. కేసీఆర్‌ కుటుంబంలో ఈ పరిస్థితి లేదు. ఇటు పార్టీని, అటు కుటుంబాన్ని కంటి సైగతో శాసించగల కేసీఆర్‌ ఉన్నారు. ఆయన గీసిన గీత కవిత దాటుతారా? లేదా? అన్నదే ఇప్పుడు ప్రశ్న. తండ్రి నాయకత్వంలోనే పనిచేస్తానని కవిత స్పష్టం చేశారు. కేసీఆర్‌ను ధిక్కరించి రాజకీయంగా నిలదొక్కుకోవడం దాదాపు అసాధ్యం అన్న విషయం తెలుసుకోలేనంత అమాయకురాలు కాదు కవిత. పార్టీలో తన స్థానం ఏమిటో స్పష్టం చేయాలని ఆమె తండ్రి వద్ద మారాం చేయవచ్చు. అయితే తాజా పరిణామాలతో కేసీఆర్‌ కుటుంబం కూడా రాజశేఖరరెడ్డి కుటుంబం వలె బజారున పడింది. అర్ధాంతరంగా చనిపోవడం వల్ల తన కుటుంబ కలహాలు చూసి బాధపడే దౌర్భాగ్యం రాజశేఖర రెడ్డికి తప్పింది. కేసీఆర్‌ విషయంలో ఆయన కళ్ల ముందే కుటుంబ కలహాలు వీధిన పడ్డాయి. ఈ సమస్యను ఆయన ఎలా పరిష్కరించుకుంటారో వేచి చూద్దాం. కవిత వ్యాఖ్యలు, లేఖ వ్యవహారాన్ని తేలికగా తీసిపారేయడానికి కేటీఆర్‌ శుక్రవారం విలేకరుల సమావేశంలో ప్రయత్నించారు. అయితే ‘దాల్‌ మే కుచ్‌ కాలా హై..’ అని అర్థమవుతోంది.


జరుపుకోవాల్సింది ప్రాయశ్చిత్త దినం!

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు వద్దాం. మద్యం కుంభకోణంలో దర్యాప్తు వేగం అందుకుంటున్న కొద్దీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కలవరం చెందుతున్నారు. ఈ వ్యవహారంలో సిట్‌ అధికారులు నేరంతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధం ఉన్న వారిని అరెస్టు చేస్తున్నారు. బాలాజీ గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అరెస్టులతో జగన్‌ ఉలిక్కిపడుతున్నారు. ఇటు లిక్కర్‌ కుంభకోణంలో, అటు జెత్వానీ కేసుతో పాటు ఇతర కేసుల్లో అధికారులు అరెస్టయ్యారు. దీంతో కూటమి ప్రభుత్వాన్ని జగన్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను అరెస్టు చేయడం ఏమిటి? వాళ్లంతా మంచివాళ్లు అని ఆయన చెప్పుకొనే ప్రయత్నం చేశారు. తెలుగునాట ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు జైలుకు వెళ్లాల్సి రావడానికి అప్పుడు ఇప్పుడు కూడా జగన్‌రెడ్డి కారణం కావడం గమనార్హం? రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు. నీటి ప్రాజెక్టులతో పాటు ఇతరత్రా వ్యవహారాల్లో కమీషన్లుగా వచ్చిన సొమ్ములో కొంత భాగాన్ని ఐఏఎస్‌ అధికారులకు వారి వాటాగా రాజశేఖరరెడ్డి పంపేవారు. ఈ దశలో జగన్మోహన్‌రెడ్డి ధన దాహం తోడవడంతో ఐఏఎస్‌ అధికారులు తప్పులు చేశారు. సీబీఐ కేసులలో పలువురు అధికారులు విచారణను ఎదుర్కొన్నారు. బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి వంటి ఐఏఎస్‌ అధికారులు జైలుకు వెళ్లి వచ్చారు. అధికారులకు వారి వాటాను రాజశేఖరరెడ్డి హయాంలో పంచడం మాత్రమే చేయగా, జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అక్రమ సొమ్ము సమీకరణ బాధ్యతలను ఏకంగా అధికారులకే అప్పగించారు. లిక్కర్‌ కుంభకోణంలో ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి వంటి వారు జగన్మోహన్‌రెడ్డికి రావాల్సిన వాటాను వసూలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. అధికారులను అలా కూడా ఉపయోగించుకోవచ్చునని జగన్‌రెడ్డి మొదటిసారిగా రుజువు చేశారు. ఇక జగన్‌రెడ్డి ప్రస్తావించిన ఐపీఎస్‌ అధికారుల విషయానికి వద్దాం. ప్రస్తుతం జైల్లో ఉన్న పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు చేయని అరాచకం లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014–2019 మధ్య ఆయన విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌గా పనిచేశారు. అప్పుడొక మహిళా డాక్టర్‌ను లైంగికంగా వేధిస్తున్నారని ప్రస్తుతం అదే జైల్లో ఉన్న వల్లభనేని వంశీ ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతంపై విచారణ చేయడానికి కోడె దుర్గాప్రసాద్‌ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించారు. ఆయన విచారణ జరిపి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు తప్పు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అయినా చంద్రబాబు ఆ నివేదికను పక్కనబెట్టారు.


డీజీపీ స్థాయి అధికారిని అరెస్టు చేసి జైలుకు పంపుతారా? అని ఇప్పుడు బోలెడంత ఆశ్చర్యపోతున్న వారికి ఈ విషయం తెలియకపోవచ్చు. డీజీపీ స్థాయి అధికారి ఏమి ఖర్మ.. ముఖ్యమంత్రులుగా ఉన్నవారిని కూడా అరెస్టు చేసి జైలుకు పంపిన ఉదంతాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. కేంద్ర మంత్రులుగా ఉన్న వారు కూడా జైలుకు వెళ్లారు. జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక డిప్యుటేషన్‌ నుంచి రాష్ర్టానికి తిరిగి వచ్చిన ఆంజనేయులు అధికారిగా అన్ని పరిధులూ అతిక్రమించారు. ముఖ్యమంత్రి మెప్పు కోసం ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డారు. సీఐడీ విభాగం అధిపతులుగా పనిచేసిన సునీల్‌ కుమార్‌, సంజయ్‌లు ఎలా వ్యవహరించారో తెలిసిందే. కాంతి రాణా టాటా, విశాల్‌ గున్ని వంటి వారు కూడా ఈ కోవలోకే వస్తారు. ఈ అధికారులకు వత్తాసు పలుకుతున్న జగన్‌రెడ్డి కానీ, ఇతరులు కానీ ఒక విషయం తెలుసుకోవాలి. నాడు గానీ, నేడు గానీ అధికారులు కేసుల్లో ఇరుక్కోవడానికి కారణం ఎవరు? జగన్‌రెడ్డి కారణంగానే వీరంతా హద్దు మీరి వ్యవహరించి కష్టాలు కొని తెచ్చుకోలేదా? అధికారం శాశ్వతం అని తాను నమ్మడమే కాకుండా తనకు ఊడిగం చేయడానికి సిద్ధపడిన అధికారులను కూడా భ్రమల్లోకి నెట్టింది జగన్‌రెడ్డి కాదా? జనం అంటే వెర్రిబాగులోళ్లు అని జగన్‌రెడ్డి బలంగా నమ్ముతున్నట్టు ఉంది. రాజ్య హింసను ప్రోత్సహించిన జగన్‌రెడ్డి ఇప్పుడు తన ఏలుబడిలో ఏం జరిగిందో జనానికి గుర్తులేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చి అందరికీ సినిమా చూపిస్తాను అనడం ద్వారా ఆయన ఇప్పటికీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం ఆశ్చర్యంగా ఉంది. ‘మొగుడ్ని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు’గా అధికారంలో ఉన్నప్పుడు ఎడాపెడా దోచుకొని ఇప్పుడు చంద్రబాబే కుంభకోణాలకు పాల్పడ్డారని చెప్పగలుగుతున్నారంటే అది ఆయన విపరీత మనస్తత్వానికి నిదర్శనం. మద్యం కుంభకోణంలో అరెస్టయిన నిందితుల్లో పలువురిని.. ఎన్నికల్లో జగన్‌రెడ్డి ఎందుకు ఓడిపోయారని మీరు భావిస్తున్నారని సిట్‌ అధికారులు ప్రశ్నించగా, నాసిరకం మద్యం సరఫరా చేయడం ప్రధాన కారణం అని పేర్కొనడం నిజం కాదా? అయినా తన ఓటమికి కారణాలను తెలుసుకోవడానికి ఇష్టపడని జగన్‌రెడ్డి.. ఇతర మీడియా సంస్థలపై పడి ఏడుస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఆయన చూపించిన సినిమా వారి స్మృతిపథం నుంచి తొలగక ముందే మళ్లీ వస్తే సినిమా చూపిస్తానని గుర్తుచేస్తున్నారు. జగన్‌ రాజకీయ జీవితం అంతా నయవంచనే అనడానికి రాజధాని విషయంలో ఆయన చేసిన ప్రకటనలే నిదర్శనం.


2014–2019 మధ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘రాజధాని ఎక్కడైనా ఏర్పాటు చేయండి, అయితే కనీసం 30 వేల ఎకరాలు అందుబాటులో ఉండేలా చూడండి’ అని కోరిన పెద్దమనిషే ముఖ్యమంత్రి అయ్యాక మూడు రాజధానుల కథ వినిపించారు. ఇప్పుడు తాజాగా రాజధానికి ఎంత కావాలి? 500 ఎకరాలు చాలవా? నాగార్జున యూనివర్సిటీకి చెందిన భూమి నుంచి 500 ఎకరాలు తీసుకొని కట్టండి అంటున్నారు. ఈ మూడు ప్రకటనల మధ్య పొంతన ఉందా? యూనివర్సిటీలకు వందల ఎకరాలు కేటాయించిన గత పాలకులు పిచ్చివాళ్లా? నిన్నగాక మొన్న హైదరాబాద్‌లో సెంట్రల్‌ యూనివర్సిటీ భూముల విషయంలో ఏం జరిగిందో చూశాం. 500 ఎకరాల్లో రాజధాని ఏర్పాటు చేస్తే యూనివర్సిటీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కేటాయించడానికి భూములు ఎక్కడి నుంచి వస్తాయి? రాజధానికి 500 ఎకరాలు చాలవా? అంటున్న పెద్ద మనిషికి ఇడుపులపాయ, హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌, బెంగళూరులోని ఎలహంక, తాడేపల్లి ప్యాలెస్‌లు ఎందుకు? జగన్‌రెడ్డికి ఇద్దరు కుమార్తెలు. వారిరువురూ విదేశాల్లో ఉంటున్నారు. కేవలం ఇద్దరు మాత్రమే ఉండే జగన్‌రెడ్డి దంపతులకు ఇన్ని ప్యాలెస్‌లు అవసరమా? ఈ ప్రశ్నకు ఆయన ఏం సమాధానం చెబుతారు? ఇవి కాకుండా విశాఖలో రుషికొండపై వందల కోట్ల ప్రభుత్వ సొమ్ముతో మరో ప్యాలెస్‌ నిర్మింపజేశారు. చదరపు అడుగుకు 30 వేలకు పైగా ఖర్చు చేయించారు. ఆయనే ఇప్పుడు రాజధానిలో చదరపు అడుగుకు తొమ్మిది వేలు ఖర్చు చేయడం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి గత ఎన్నికల్లో ఆయనను ఓడించారు గానీ.. లేనిపక్షంలో రుషికొండ ప్యాలెస్‌లో ఆయన కొలువుదీరి ఉండేవారు. మన దేశ రాజకీయాలలో బహుశా మరే ఇతర నాయకుడికీ ఇన్ని నగరాలలో ఇంత విశాలవంతమైన ప్యాలెస్‌లు లేవు. తాను నమ్మే జీసస్‌పై ప్రమాణం చేసి తాను నిర్మించుకున్న ప్యాలెస్‌లు, ఏర్పాటు చేసుకున్న వ్యాపార సామ్రాజ్యం కష్టపడి సంపాదించుకున్నానని జగన్‌రెడ్డి చెప్పగలరా? కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే నెల 4వ తేదీన వెన్నుపోటు దినంగా పాటించబోతున్నట్టు ఆయన ప్రకటించారు. గత ఏడాది జూన్‌ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.


ప్రజలు ఆయనను 11 సీట్లకే పరిమితం చేస్తూ తీర్పు ఇచ్చారు. ఫలితాలు వెల్లడైన రోజునే ఆయన ఎంచుకున్నారంటే ప్రజలు తనకు వెన్నుపోటు పొడిచారని జగన్‌ భావిస్తున్నారేమో తెలియదు! బటన్లు నొక్కి డబ్బులు పంచినా ప్రజలు తనను ఓడించడం అంటే వెన్నుపోటు పొడవడమేనని ఆయన అనుకుంటున్నట్టుగా ఉంది. ప్రజలు ఆయనకు వెన్నుపోటు పొడిచారా? ఆయనే ప్రజలకు వెన్నుపోటు పొడిచారా? అన్నది సుస్పష్టం. రాజశేఖరరెడ్డి వేరు.. జగన్మోహన్‌రెడ్డి వేరు అని ప్రజలు గ్రహించారు కనుకనే ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. జగన్‌రెడ్డి నిర్వహించాల్సింది వెన్నుపోటు దినాలు కాదు. ప్రాయశ్చిత్త దినాలు జరుపుకోవాలి. అప్పుడైనా ప్రజలకు ఆయనపై భయాలు తొలగిపోతాయేమో చూడాలి!

ఆర్కే

ఇవి కూడా చదవండి

Viral Video: బస్ రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్‌కు గుండెపోటు.. కండెక్టర్ లేకపోయి ఉంటే..

Daughter Marriage: కూతురు చేసిన పనికి ముగ్గురు కుటుంబసభ్యులు బలి..

Updated Date - May 25 , 2025 | 03:29 AM