Share News

పొంగిపోకుండా, కుంగిపోకుండా...

ABN , Publish Date - Apr 20 , 2025 | 03:38 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు 75వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. 1978లో తొలిసారిగా ఆయన ఇందిరా కాంగ్రెస్‌ (ప్రస్తుత కాంగ్రెస్‌) తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. నాటి నుంచి నేటి వరకు...

పొంగిపోకుండా, కుంగిపోకుండా...

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు 75వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. 1978లో తొలిసారిగా ఆయన ఇందిరా కాంగ్రెస్‌ (ప్రస్తుత కాంగ్రెస్‌) తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. నాటి నుంచి నేటి వరకు తెలుగునాట రాజకీయాలలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగునాట ఇంత సుదీర్ఘ కాలం రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన నాయకుడు మరొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు. ఈ 47 ఏళ్లలో ఆయన ఎన్నో ఉత్థానపతనాలు చూశారు. అపజయాలు, అవమానాలకు కుంగిపోకుండా రాజకీయాలలో ఆయన తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ వస్తున్నారు. 1978లో ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన ఆయన అదే టర్మ్‌లో మంత్రి కూడా అయ్యారు. మంత్రి పదవితో పాటు ఆయనను మరో అదృష్టం కూడా వరించింది. పిన్న వయసులోనే మంత్రిగా నియమితులైన చంద్రబాబును చూసి ముచ్చటపడిన ఎన్టీ రామారావు తన కుమార్తె భువనేశ్వరిని ఆయనకు ఇచ్చి పెళ్లి చేశారు. అప్పటి నుంచి ఆయన జాతకం మారింది. మంత్రిగా ఉండగానే ఆయన పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి సస్పెండ్‌ అవడం, సాయంత్రానికల్లా తనపై విధించిన సస్పెన్షన్‌ను తొలగింపజేసుకొని రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. అప్పుడు చిత్తూరు జిల్లా జెడ్పీ చైర్మన్‌ పదవికి మరో మంత్రి నల్లారి అమర్నాథ్‌రెడ్డి ప్రతిపాదించిన అభ్యర్థిని పార్టీ ఖరారు చేయగా, అధికార అభ్యర్థిని కాదని మరో మంత్రి సి.దాస్‌తో కలసి డాక్టర్‌ కుతూహలమ్మను పోటీ పెట్టి గెలిపించుకున్నారు. దీంతో పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినందుకు నాటి పీసీసీ అధ్యక్షుడు కోన ప్రభాకరరావు ఆగ్రహించి మంత్రులుగా ఉన్న చంద్రబాబు నాయుడు, దాస్‌లను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. దీంతో ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ అధినాయకత్వాన్ని కలసి, వారికి వాస్తవ పరిస్థితిని వివరించి తమపై విధించిన సస్పెన్షన్‌ను చంద్రబాబు రద్దు చేయించుకున్నారు. అప్పట్లో ఇదొక సంచలనం. ఆ తర్వాత 1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడం, 1983 ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన చంద్రబాబు తెలుగుదేశం అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత తెలుగుదేశంలో చేరి, 1984 ఆగస్టు సంక్షోభంలో పదవీచ్యుతుడైన ఎన్టీరామారావుకు అండగా నిలబడి పార్టీలో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. సంక్షోభ సమయంలో చంద్రబాబు రాజకీయ చాతుర్యాన్ని గమనించిన ఎన్టీ రామారావు.. తెలుగుదేశం పార్టీ రాజకీయాలలో చంద్రబాబును ప్రోత్సహించారు. 1989 ఎన్నికల్లో ఎన్టీఆర్‌ అధికారం కోల్పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు పాత్ర మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సభలో తనను అవమానించిన కారణంగా శాసనసభను ఎన్టీఆర్‌ బహిష్కరించగా, చంద్రబాబు అన్నీ తానై నడిపించారు. అధికారంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టడంలో ఎన్టీఆర్‌ది కీలక పాత్ర కాగా, ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్న చంద్రబాబు జాతీయ స్థాయి నాయకులతో పరిచయాలు పెంచుకున్నారు. 1989 తర్వాత ఎన్టీఆర్‌ మార్గదర్శకత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలను మొత్తం ఆయన పర్యవేక్షించినప్పటికీ ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించడంతో చంద్రబాబు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్‌పై లక్ష్మీపార్వతి ప్రభావం అధికంగా ఉండటంతో అనేక సందర్భాలలో పార్టీ వ్యవహారాల్లో చంద్రబాబు మాట చెల్లుబాటు అయ్యేది కాదు. ఈ నేపథ్యంలో 1994లో ఎన్టీఆర్‌ మళ్లీ అధికారంలోకి రావడం, పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలోనూ లక్ష్మీపార్వతిదే పైచేయి కావడంతో చంద్రబాబు ఉక్కపోతకు గురయ్యారు. పరిస్థితి చేయి దాటిపోతోందని భావించిన చంద్రబాబు నాయుడు పార్టీలో మరో ముఖ్యుడిగా ఉన్న తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును కలుపుకొని ఎన్టీఆర్‌ కుటుంబాన్ని తనవైపు తిప్పుకొన్నారు. లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేయడం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడం, తెలుగుదేశం పార్టీని కూడా సొంతం చేసుకోవడం 1995లో జరిగింది. 1984లో అధికారం కోల్పోయినప్పుడు ఎన్టీఆర్‌కు అండగా నిలబడి ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం పోరాడిన ప్రజలు.. 1995లో మాత్రం లక్ష్మీపార్వతి పాత్ర కారణంగా ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడ్ని చేసినా పట్టించుకోలేదు.


కేంద్రంలో కీలకంగా...

అధికారాన్ని కోల్పోయిన కొంత కాలానికే ఎన్టీఆర్‌ కన్ను మూయడం, 1996లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు గెలిపించుకోగలగడంతో తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు స్థానం సుస్థిరమైంది. 1978లోనే చంద్రబాబుతో పాటు ఇందిరా కాంగ్రెస్‌ తరఫున కాకుండా రెడ్డి కాంగ్రెస్‌ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజశేఖరరెడ్డి సమ ఉజ్జీగా తెలుగునాట రాజకీయాలలో కీలక పాత్ర పోషించారు. కేంద్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నా యంగా యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో చంద్రబాబు పాత్ర కీలకం. ఆ తర్వాత వాజపేయి నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటులో కూడా చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అప్పుడు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాకుండా జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు తనదైన ముద్ర వేసుకున్నారు. జాతీయ రాజకీయాలతో పాటు రాష్ట్రంలో కూడా ఆయన కొంతకాలం కమ్యూనిస్టులతో, మరికొంత కాలం భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టారు. రాజకీయాలలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఆయన తన వైఖరిని ఎప్పటికప్పుడు మార్చుకున్నారు. ఈ కారణంగానే రాజకీయ అవకాశవాది అన్న విమర్శను చంద్రబాబు ఎదుర్కోవలసి వచ్చింది. భారతీయ జనతా పార్టీకి కొంత కాలం దగ్గరగా ఉండటం, మరికొంత కాలం దూరంగా జరగడంతో జాతీయ రాజకీయాల్లో ఆయన ప్రతిష్ఠకు మచ్చ ఏర్పడింది. తన రాజకీయ పోకడలు, నిర్ణయాలపై చంద్రబాబు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. సందర్భాన్ని, పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకొని ఉండకపోతే ఇతరుల వలె తాను కూడా రాజకీయాల నుంచి ఎప్పుడో కనుమరుగయ్యే వాడినని విమర్శకులకు సమాధానంగా ఆయన చెబుతుంటారు. ఒక దశలో ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం వచ్చినా చంద్రబాబు కాదనుకున్నారు. జాతీయ స్థాయిలో కూడా ఉద్ధండ రాజకీయ నాయకులతో కలిసి పనిచేసిన అనుభవం ఆయన సొంతం. కమ్యూనిస్టు ఉద్ధండులు జ్యోతి బసు, హరికిషన్‌ సింగ్‌ సుర్జీత్‌లతో పాటు భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు అటల్‌ బిహారీ వాజపేయి, లాల్‌కృష్ణ ఆడ్వానీ వంటి వారు చంద్రబాబు మాటకు, నిర్ణయాలకు విలువ ఇచ్చేవారు. దేవెగౌడ, ఐకే గుజ్రాల్‌లను ప్రధానమంత్రులుగా చేయడంలోనూ, డాక్టర్‌ అబ్దుల్‌ కలాంను రాష్ట్రపతిగా నియమించడంలోనూ చంద్రబాబుది కీలక పాత్ర. 2019 ఎన్నికలకు ముందు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తీవ్రంగా విభేదించిన చంద్రబాబు.. 2024 ఎన్నికల్లో తిరిగి ఆయనతోనే జత కట్టారు. నిజానికి 2024కు ముందు చంద్రబాబుతో చేతులు కలపడానికి ప్రధాని మోదీ అంతగా ఇష్టపడలేదు. అయితే ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల గురించి తెలంగాణకు చెందిన ఒక కీలక నాయకుడితో జరిపిన చర్చలు ప్రధాని మోదీపై ప్రభావం చూపాయి. ‘ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు చంద్రబాబు జీరోగా కనిపించవచ్చు. ఈ ఎన్నికల్లో ఆయనకు 20 వరకు ఎంపీ స్థానాలు వస్తాయి. చంద్రబాబును రాష్ట్రంలో 40 శాతం మంది ప్రజలు వ్యతిరేకించవచ్చు కానీ జాతీయ స్థాయిలో ఆయన ఎటు నిలబడితే అటు బలం చేకూరుతుంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ లభించదు. చంద్రబాబు గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలుచుకుంటారు. ఆయన ఇండియా కూటమి వైపు మళ్లితే పరిస్థితిని ఊహించుకోండి’ అని సదరు కీలక నేత ప్రధాని మోదీకి వివరించారు. ఈ కారణంగానే అని చెప్పలేం గానీ చంద్రబాబుతో స్నేహం విషయంలో ప్రధాని మోదీ తన మనసు మార్చుకోవడానికి ఇది కూడా ఒక కారణమని చెప్పవచ్చు.


విజన్‌.. ఓర్పు.. సహనం!

చంద్రబాబు రాజకీయాలను, నిర్ణయాలను వ్యతిరేకించేవారు రాష్ట్రంలోనే కాదు.. జాతీయ స్థాయిలోనూ ఉన్నారు. అయితే ఆయన పట్టుదలను, కృషిని ప్రశంసించనివారు అరుదుగా ఉంటారు. చంద్రబాబుకు తెలుగు, ఇంగ్లిషులో వాగ్ధాటి లేదు. అయినా అంతర్జాతీయ ప్రముఖుల మన్ననలను ఆయన చూరగొనగలిగారు. అభివృద్ధి విషయంలో ఆయనకు ఉన్న అంకితభావమే ఇందుకు కారణం. విజనరీగా పేరొందిన చంద్రబాబు.. అప్పుడు ప్రజలకు అందనంత దూరంలో పరుగెట్టేవారు. ఫలితంగా ఓటమిపాలవుతూ వచ్చారు. ఆయన విజన్‌ను అందుకోలేని ప్రజలు ఆయనను ఓడించారు. చంద్రబాబు రాజకీయాలను విమర్శించేవారు కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది చంద్రబాబుతోనే సాధ్యం అని అంగీకరించక తప్పని పరిస్థితి. తక్షణ ప్రయోజనాలు, స్వల్పకాలిక ప్రయోజనాలు ఆశించే ప్రజలతో పాటు పార్టీ శ్రేణులు కూడా చంద్రబాబుతో మరీ అంత దూరదృష్టి ఎందుకు అని విభేదిస్తూ ఉంటారు. అయితే తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్‌ స్థాపించినప్పటికీ ఆ పార్టీని కాపాడి నిలబెట్టింది మాత్రం చంద్రబాబే. 1995లో పార్టీ పగ్గాలు చేపట్టిన ఆయన పదిహేనేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ మరో పదిహేనేళ్లపాటు ప్రతిపక్షంలోనూ ఉన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు– ఉమ్మడి రాష్ట్రంలోనూ, విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆయన ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఎన్నో అవమానాలూ ఎదురయ్యాయి. పార్టీని కాపాడుకొనే క్రమంలో ఆయన ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపారు. భూదేవికి ఉన్నంత సహనం, ఓర్పు ఆయన సొంతం. అవమానాలను దిగమింగుకుంటూ ఆయన పార్టీని కాపాడుకున్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటూ ఆయన ఎదిగారు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబుకు ఎదురైన అవమానాలు అన్నీ ఇన్నీ కావు. తన సతీమణిని నిండు సభలో అవమానించడంతో ఎన్నడూ లేని విధంగా వెక్కి వెక్కి ఏడ్చారు. చివరికి జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. రాజశేఖరరెడ్డి రాజకీయం వేరు.. జగన్‌రెడ్డి రాజకీయం వేరు అని గుర్తించి కోలుకోవడానికి ఆయనకు చాలా సమయమే పట్టింది. వాజపేయి, ఆడ్వానీ, జ్యోతిబసు, బిజూ పట్నాయక్‌, వీపీ సింగ్‌, దేవీలాల్‌ వంటి వారితో రాజకీయాలలో కలిసి నడిచిన చంద్రబాబు.. ఇప్పుడు జగన్‌రెడ్డి వంటి వ్యక్తితో రాజకీయం చేయాల్సి వస్తోంది. జగన్‌ వంటి సైకో మనస్తత్వం కలిగిన వ్యక్తితో రాజకీయాల్లో పోటీ పడాల్సి వచ్చినప్పుడు ఆయన సహజంగానే తొట్రుపడ్డారు. తనకు ఎదురైన చేదు అనుభవాలను దిగమింగుకొని పార్టీని కాపాడుకున్న ఆయన 2024 ఎన్నికల్లో కనీవినీ ఎరుగని మెజారిటీతో తిరిగి అధికారాన్ని చేపట్టారు.


అందుకే రోబోగా మారి...

చంద్రబాబు వ్యక్తిగత వ్యవహార శైలిని విమర్శించేవారు ఎందరో ఉంటారు. ఆయన సాటి మనుషులతో ఆత్మీయంగా మసలుకోరు, యాంత్రికంగా ఉంటారు. సన్నిహితులు అనుకున్న వారి యోగక్షేమాలు కూడా ఆరా తీయరు. అలా అని ఇబ్బందుల్లో ఉన్నవారిని పూర్తిగా పట్టించుకోకుండా ఉండరు. విద్య, వైద్యం ఖర్చుల కోసం ఆయన ఎంతో మందికి ఆర్థిక సాయం చేశారు. అయితే రాజశేఖరరెడ్డి వలే చంద్రబాబు సహచరులతో కలివిడిగా ఉండరు. ఆయన భోజనం కూడా చేతులతో కలుపుకొని తినరు. స్పూన్‌తోనే తింటారు. అది కూడా పెదవులకు అంటకుండా తింటారు. నిన్న కాక మొన్న కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయానికి వెళ్లినప్పుడు అక్కడ అందించిన ప్రసాదాన్ని కూడా పూర్తిగా తినలేదు. మొదటిసారి రెండు చెంచాల ప్రసాదం తీసుకొని మిగతాది తన సతీమణి భువనేశ్వరికి ఇచ్చేశారు. రెండవసారి మరో ప్రసాదం ఇవ్వగా అది కూడా ఒక స్పూన్‌ తీసుకొని మిగతాది భువనేశ్వరికి ఇవ్వబోగా తనకు వద్దని ఆమె వారించారు. దీంతో అటూ ఇటూ చూసి పక్కనున్న వారికి ఇచ్చేశారు. మామూలుగా అయితే మనం మొత్తం ప్రసాదం తినేస్తాం. చంద్రబాబు మాత్రం తూకం వేసుకొని తింటారు. ఇలా చేయడం చూసే వారిలో కొందరికి నచ్చకపోవచ్చు. ఒకటి మాత్రం నిజం. చంద్రబాబు అనే వ్యక్తికి వ్యక్తిగత జీవితం ఉండదు. అవసరానికి మాత్రమే ఆయన తింటారు, నిద్రపోతారు. భార్యా పిల్లలతో కలిసి సరదాగా హోటల్‌కు వెళ్లి భోజనం చేసిన సందర్భాలు ఒకటో రెండో ఉంటాయంతే. చంద్రబాబు మెకానికల్‌గా ఎలా ఉంటారు? ఎందుకుంటారు? అంటే ఆయన కూడా కారణం చెప్పలేరు. స్వతహాగా అతి జాగ్రత్తపరుడు కావడం వల్లనే ఆయన ఏ ఒక్కరినీ పూర్తిగా నమ్మరని భావించవచ్చు. ఒకప్పుడు చంద్రబాబు ఇలా ఉండేవారు కాదు. ఎన్టీఆర్‌ అంటే ఆయనకు భయం, గౌరవం. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అల్లుడిగా చొరవ తీసుకొని కలిసేవారు కాదు. ఎన్టీఆర్‌ నుంచి పిలుపు వచ్చినప్పుడే వెళ్లేవారు. ఆయన మూడ్‌ను బట్టి కలుసుకొనేవారు. 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబులో అనేక మార్పులు వచ్చాయి. అతి జాగ్రత్త ఆయనను కమ్మేసింది. పిన్న వయసులోనే ముఖ్యమంత్రి కావడంతో రాజకీయాలలో తన స్థానాన్ని పదిలపరచుకోవడం కోసం ఆయన దిగని మెట్లు, ఎక్కని మెట్లు లేవు. ఈ క్రమంలోనే ఆయన తనను తాను రోబోగా మార్చుకున్నారు. ఆయన గుండె పొరల్లో తడి లేదా? అంటే ఉంటుంది. అయితే ఇతరుల వలే దాన్ని ఆయన ప్రదర్శించరు. ఎవరికైనా సాయం చేసినా ఆ విషయం ఇంకెవరికీ చెప్పవద్దంటారు. స్వగ్రామం నారావారిపల్లెకు చెందిన ఎంతోమందికి సాయం చేశారు. అయితే ఈ విషయం ఆయన చెప్పుకోరు. సహాయం పొందినవాళ్లను కూడా చెప్పుకోనివ్వరు. ఈ విషయం తెలియని చాలా మంది రాజశేఖరరెడ్డి వలె చంద్రబాబు ఉదారంగా సహాయం చేయరని అంటారు. తనకు తానుగా అవతలి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకోరు గానీ, నోరు తెరిచి అడిగిన వారికి తన శక్తి మేర సహాయం చేస్తూ ఉంటారు. ఈ కోణం తెలియని చాలా మంది ఆయనను విమర్శిస్తుంటారు. చంద్రబాబు వద్ద సహాయం పొందిన కొంత మంది ఆ తర్వాత ఆయనను మోసం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా అవేమీ ఆయన పట్టించుకోరు. పార్ట్‌ ఆఫ్‌ ద గేమ్‌ అని అనుకుంటారు.


అభివృద్ధి కాంక్ష

చంద్రబాబువి అవకాశవాద రాజకీయాలు అయివుండవచ్చు గానీ, తెలుగునాట ఇంత సుదీర్ఘకాలం కీలక పాత్ర పోషిస్తున్నారంటే ఆయన ఎప్పటికప్పుడు వైఖరులు మార్చుకోవడం ప్రధాన కారణం. రాజకీయాల్లో కక్షలు కార్పణ్యాలను చంద్రబాబు నమ్ముకోలేదు. 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కడప పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన రాజశేఖరరెడ్డిని ఓడించే అవకాశం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు వచ్చింది. అయితే చివరి నిమిషంలో ఆయన మనసు మార్చుకున్నారు. దీంతో ఐదారు వేల ఓట్ల స్వల్ప మెజారిటీతో రాజశేఖరరెడ్డి గెలిచారు. అలాంటి చంద్రబాబును గత ఎన్నికల్లో ఓడించడానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌రెడ్డి చేయని ప్రయత్నం లేదు. ఈ కారణంగానే రాష్ట్రమంతటా కూటమి సునామీ సృష్టించినా కుప్పంలో చంద్రబాబు మెజారిటీ 45 వేలకే పరిమితం అయింది. రాజశేఖరరెడ్డితో రాజకీయం చేయడం వేరు, ఆయన కుమారుడు జగన్‌రెడ్డితో రాజకీయం చేయడం వేరు అని చంద్రబాబు గుర్తించడానికి చాలా సమయం పట్టింది.. పడుతోంది. జగన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన అధికారాన్ని తనపై ఉన్న కేసులలో విచారణ ముందుకు సాగకుండా ఉండటానికి ఉపయోగించుకోగా ఇప్పుడు చంద్రబాబు రాష్ర్టాభివృద్ధి కోసం వాడుతున్నారు. కేంద్రంలో తనకు ఉన్న పలుకుబడితో రాష్ర్టానికి నిధులు, పథకాలు తెచ్చుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు. నరేంద్ర మోదీ మూడవసారి ప్రధానమంత్రి అవడానికి చంద్రబాబు మద్దతు కీలకం అయినప్పటికీ ఆయన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకు తన పలుకుబడిని వాడటం లేదు. ఆయనకు ఉన్న ఒకే ఒక స్వార్థం అధికారంలో కొనసాగడం మాత్రమే. ఇందుకోసమే రాజకీయంగా పిల్లి మొగ్గలు వేస్తారు. అధికారాన్ని అభివృద్ధి కోసం ఉపయోగించి రాష్ట్ర చరిత్రలో తన పేరు చిరస్థాయిగా ఉండిపోవాలన్న కీర్తి కాంక్ష మాత్రం ఆయనకు మెండుగా ఉంది. అందుకే రాజధాని అమరావతిని అద్భుతంగా నిర్మించి ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని ఆయన కలలుగంటున్నారు. హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ భవనాన్ని కొండ ప్రాంతమైన మాదాపూర్‌లో నిర్మించినప్పుడు కూడా ఇప్పటిలాగే విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే అప్పుడు ఆయన వేసిన పునాది హైదరాబాద్‌ విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి కారణం అయింది. రాజధాని అమరావతికి అంత భూమి ఎందుకు? ఇంత భూమి ఎందుకు? అని విమర్శిస్తున్న వారికి చంద్రబాబు విజన్‌ అర్థం కాదు. అందుకే భావి తరాల గురించి ఆలోచిస్తున్న ఆయన విమర్శల పాలవుతున్నారు. అధికారం ఎందుకు? అంటే అభివృద్ధి కోసమే అని చంద్రబాబు నమ్ముతుండగా, దోచుకోవడానికి అని జగన్‌రెడ్డి నమ్ముతారు. అందుకే జగన్‌ పేదలకు సహాయం పేరిట తాయిలాలు ఇచ్చి తెర వెనుక దోపిడీకి తెగబడ్డారు. అలాంటి మనస్తత్వం ఉన్నవారు అందరూ జగన్‌ చుట్టూ చేరారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన జగన్‌ అండ్‌ కోలో భయం లేదు. ఎందుకంటే చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరించరన్న ధీమానే! ఈ కారణంగానే అధికార మార్పిడి జరిగి ఏడాది కూడా పూర్తికాకుండానే జగన్‌ అండ్‌ కో నోటికి పని చెబుతున్నారు. నిజానికి ఇప్పుడు రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నారన్న సందేహం తెలుగు తమ్ముళ్లలో ఏర్పడటానికి కారణం లేకపోలేదు. వైసీపీకి చెందినవారు రొమ్ము విరుచుకొని తిరుగుతుండగా, జగన్‌రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే అన్న భయంతో తెలుగుదేశం వాళ్లు బిక్కుబిక్కుమంటున్నారు. ఒక విజనరీకి, ఒక పాలెగాడికి మధ్య ఉన్న తేడా వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది. జగన్‌రెడ్డి హయాంలో మద్యం కుంభకోణంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. నాసిరకం మద్యం అమ్మి ఎంతో మంది ప్రాణాలు తీశారు. వేల కోట్లు దోచుకున్నారు. మద్యం కుంభకోణం జరిగిన తీరు చూసి సిట్‌ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. కుంభకోణానికి పాల్పడటం వేరు, ఇంత వినూత్నంగా, వ్యవస్థీకృతంగా నేరం చేయడం ఇప్పుడే చూస్తున్నామని ఒక అధికారి పేర్కొనడం పరిస్థితి తీవ్రతను చెబుతోంది. ఈ వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి జగన్‌రెడ్డికి చెందిన రోత మీడియా దొంగే దొంగ అని అరుస్తున్నట్టుగా కథనాలు వండి వారుస్తోంది. 2014–2019 మధ్య కాలంలో వేల కోట్లు దోచుకున్నారని నిందలు వేస్తున్నారు. ఇంతకంటే బరితెగింపు ఉండదేమో.


జగన్‌రెడ్డి హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా రాజ్‌ కసిరెడ్డి అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చెబుతున్నారంటే అప్పుడు ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. రాజ్‌ కసిరెడ్డి ఒక ఇంటెలిజెంట్‌ క్రిమినల్‌ అని, తననే మోసం చేశాడని విజయసాయిరెడ్డి వాపోవడం చూశాం. అంటే, తానే ఒక ఇంటెలిజెంట్‌ క్రిమినల్‌ను అయితే రాజ్‌ కసిరెడ్డి తననే మోసం చేశాడన్న ఆవేదన విజయసాయి రెడ్డి మాటల్లో వ్యక్తం అవుతోంది. హేమాహేమీలతో రాజకీయం చేసి రాణించిన చంద్రబాబునాయుడు ఇప్పుడు ఇలాంటి ఇంటెలిజెంట్‌ క్రిమినల్స్‌తో తలపడాల్సి రావడమే ఆయన రాజకీయ జీవితంలో అత్యంత విషాదమని చెప్పవచ్చు. తనను తాను క్రిమినల్‌గా మార్చుకోలేక, మరోవైపు క్రిమినల్స్‌ను కట్టడి చేయలేక చంద్రబాబు సతమతం అవుతున్నారు. 75వ పుట్టినరోజు జరుపుకొంటున్న ఆయనలో ఉత్సాహం, శక్తి సన్నగిల్లలేదు. పని రాక్షసుడిగా పేరొందిన ఆయనకు అలసట తెలియదు. అయితే క్రిమినాలజీలో ఆరితేరిన వారిని ఎదుర్కొనే క్రమంలో ఆయన కొన్ని సందర్భాలలో విఫలం అవుతున్నారు. క్రిమినల్స్‌ను కట్టడి చేయడం ముఖ్యమే గానీ రాష్ర్టాన్ని కక్షలు, కార్పణ్యాలకు నిలయంగా మార్చకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు అవసరం రాష్ర్టానికి ఉందా? రాష్ట్ర అవసరం చంద్రబాబుకు ఉందా? అని ప్రజలు ఆలోచించుకోవాలి. భవిష్యత్తు గురించి ఆలోచించేవారు చంద్రబాబుకు అండగా నిలబడి రాష్ర్టాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తారని ఆశిద్దాం. చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుదాం!

ఆర్కే

ఇవి కూడా చదవండి..

PM Modi: వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలును ప్రారంభించనున్న మోదీ

Bihar: మా నాన్నే మళ్లీ సీఎం, నో డౌట్

Rekha Gupta: ప్రైవేట్ స్కూళ్లకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

Tahawwur Rana: ప్రతీ రోజు 8 నుంచి 10 గంటల పాటు విచారణ..

BJP: హిమాలయాలకు అన్నామలై.. బాబా గుహలో ధ్యానం

Updated Date - Apr 20 , 2025 | 03:38 AM