ఆధ్యాత్మిక చలనం... అరుణాచలం...
ABN , Publish Date - May 25 , 2025 | 12:38 PM
జీవకోటి యాత్రలో ఒక గీత అడ్డంగా పెడతారట. ఏమా గీత అంటే... అరుణాచల ప్రవేశానికి పూర్వం, తర్వాత అట. ‘అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు’ అని ఓ సిద్ధాంతం ఉంది. నేనూ ఈ సిద్ధాంతాన్ని నమ్మాను. ఎందుకంటే పదేళ్ల నుంచి అక్కడికి వెళ్లాలని వెళ్లలేకపోయాను. ఈసారి ఎలాగైనా వెళ్లాలని సంకల్పించుకుని మా ఆవిడ, కూతురుతో కలిసి ప్రయాణం మొదలెట్టాను.

నా ప్రయాణం సొంత కారులో మొదలయ్యింది. హైదరాబాద్ నుంచి ఉదయం ఐదింటికే బయలుదేరి సాయంత్రం మూడు గంటలకు (వయా కర్నూలు, కడప, రేణిగుంట) కంచికి చేరుకున్నాం.
హోటల్కు చేరుకుని భోంచేసిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు అక్కడి పంచాలయాలు (కామాక్షి, ఏకాంబరనాథ్, వరదరాజ, విష్ణుకంచి, కంచి-కామకోటి పీఠం) దర్శనం పూర్తి చేశాం. కంచి పురవీధులన్నీ చాలా ఇరుకుగా ఉంటాయని, కారులో ప్రయాణం కష్టమని చెప్పిన హోటల్వారి సూచనను అనుసరించి ఒక ఆటో మాట్లాడుకుని వాటిని దర్శించుకున్నాం.
స్వామి శాంతించి కొలువైన క్షేత్రం...
మరుసటిరోజు ఉదయం అల్పాహారం తర్వాత అరుణా చలం బయలుదేరాం. కంచి నుంచి అరుణా చలానికి రోడ్డు మార్గంలో రెండుగంటల్లో చేరుకోవచ్చు. దారిలో తిరుత్తణి, శ్రీపురం ఆలయాలుంటాయి. వీటిలో తిరుత్తణి ఆలయం చాలా పురాతనమైనది. తమిళులకు ఆరాధ్య క్షేత్రం. ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లీ దేవసేన అమ్మవార్లు కొలువయ్యారు. స్వామి వెలసిన కొండకు ఇరువైపులా పర్వతశ్రేణులు వ్యాపించి ఉంటాయి. ఉత్తరాన ఉన్న పర్వతం కాస్త తెల్లగా ఉండటం వల్ల దీనిని ‘బియ్యపుకొండ’ అని, దక్షిణం వైపున కొండ నల్లగా ఉండటం వల్ల ‘గానుగపిండి కొండ’ అని పిలుస్తారు. దేవతలు, మునుల బాధలు పోగొట్టడానికి శూరపద్మునితో యుద్ధం చేసిన అనంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకుల రాజులతో చిన్నపోరు చేసి, శాంతించి, ఈ క్షేత్రంలో కొలు వయ్యాడని స్థలపురాణం చెబుతోంది. స్వామి శాంతించి కొలువయ్యాడు కాబట్టి ఈ క్షేత్రానికి ‘తణిగై’ అంటే ‘శాంతిపురి’ అనే పేరొచ్చిందం టారు. ‘తణిగ’ అంటే మన్నించుట, ఓదార్చుట అనే అర్థాలున్నాయి. స్వామి తన భక్తుల పాపాలను మన్నించి కటాక్షిస్తాడు కాబట్టి ఈ క్షేత్రానికి ‘తిరుత్తణి’ అనే పేరొచ్చింది. కొండపైకి వెళ్లడానికి మెట్ల మార్గం ఉంది. ఉచిత బస్సు సౌకర్యం ఉంది. 365 మెట్లను ఏడాదిలో 365 రోజులకు ప్రతీకలుగా చెబుతారు.
బంగారు ఆలయం...
స్వర్ణదేవాలయం పేరు చెప్పగానే అందరికీ అమృత్సర్ స్ఫురిస్తుంది. అయితే దక్షిణాదిన ‘శ్రీపురం’ క్షేత్రానికి ఆ గుర్తింపు ఉంది. ఆలయ నిర్మాణంలో స్తంభాలు, శిల్పాలను మొదటరాగి తాపడం చేశారట. ఆ తర్వాత దానిపైబంగారు రేకుల్ని తొమ్మిది పొరల్లో వేసి అందంగా తీర్చి దిద్దారు. 1500 కిలోల బంగారంతో సుమారు 400 మంది శిల్పుల ఆరేళ్ల శ్రమ ఫలితంగా ఈ బంగారు ఆలయం రూపుదిద్దుకుంది. మొదట్లో దీనిని ‘తిరుమలైకోడి’గా పిలిచేవారు. మహాలక్ష్మి ఆలయం నిర్మించిన తర్వాత ‘శ్రీపురం’గా మార్చారట. ప్రధాన గర్భగుడిని చేరుకోవాలంటే దాదాపు కిలోమీటరు దూరమున్న నక్షత్రపు ఆకారంలోని మార్గం గుండా వెళ్లాల్సిఉంటుంది. ఈ మార్గం పొడవునా రెండు వైపులా ఉండే గోడలపై భగవద్గీత, ఖురాన్, బైబిల్లోని ప్రవ చనాలు రాశారు (ఈ ప్రవచనాల పుస్తకం ఆలయ పుస్తక దుకాణంలో లభ్యమవుతుంది). వీటిని చదవడం వల్ల భక్తులు అజ్ఞానపు ఆలోచనలను వీడి, జ్ఞాన సుగంధంతో బయటకు వెళ్తారని అంటారు. ఈ రెండు ఆలయాలను దర్శించుకుని, మధ్యాహ్నం ఒంటిగంటకు అరుణాచలం (తిరువన్నామలై) చేరుకున్నాం.
అరుణగిరి ప్రదక్షిణ...
అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడంతో దీని చుట్టూ ప్రదక్షిణం చేయడమంటే సాక్షాత్తు శివునికి చేసినట్టే అని భక్తజన విశ్వాసం. పాదచారులై శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసే వారికి మహాపుణ్యం దక్కుతుందని మహాత్ముల వచనం. అందుకే నిత్యం ఎంతో మంది గిరి ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణ చాలావరకు తారు రోడ్డు మీదనే జరుగుతుంది. ఈ మధ్య రోడ్డు పక్కన కాలిబాట కూడా వేశారు. ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కాబట్టి చాలామంది రాత్రి పూట లేదంటే తెల్లవారుఝామునే గిరి ప్రదక్షిణ చేస్తారు.
ఈ ప్రదక్షిణ సాధారణంగా రమణ మహర్షి ఆశ్రమం నుంచి మొదలవుతుంది. నాలుగడు గులు వేయగానే వినాయకుడి గుడి ఉంటుంది. అక్కడ నుంచి కొండ పైకి చూస్తే నంది ఆకారంలో కనిపిస్తుంది. దానికి నమస్కారం చేసి గిరి ప్రదక్షిణకు ఉపక్రమిస్తారు.
ఇది సుమారు 14 కిలోమీటర్లు ఉంటుంది (మాకు ఐదు గంటల సమయం పట్టింది). కొండ చుట్టూ ఎనిమిది ప్రత్యేక లింగాలు (అష్ట లింగాలు), ఎనిమిది దిక్కుల్లో ఉన్నాయి. ఇంద్ర, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన్య లింగాలివి. ఎముకలు అరిగిపోయిన వారు యమలింగాన్ని దర్శించుకుంటేమంచిదని, మనసు నిలకడగా ఉండాలంటే నైరుతి లింగం వద్ద కాసేపు ధ్యానం చేయాలని చెబుతారు. ఇవిగాక గిరి ప్రదక్షిణలో మరో నాలుగు ముఖ్య ఆలయాలున్నాయి. అవి భూత నారాయణుడు, జంట వినాయకులు, మలై అమ్మన్, పూరీ జగన్నాథ్. కుబేర లింగం దాటిన తర్వాత ఇరుకైన ద్వారం వస్తుంది. దీనిని మోక్షద్వారం అంటారు. ఇందులో నుంచి దూరి బయటకు వస్తేనే గిరి ప్రదక్షిణ పూర్తయినట్లుగా చెబుతారు. ఇక్కడక్యూలైన్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. కాస్త ఓపికగా నిల్చోవాలి. మేమైతే సులువు గానే దూరి బయటకు వచ్చేశాం. అనారోగ్యంతో ఉన్న వారు, వృద్ధులు, గర్భిణులు, పిల్లలు గిరిప్రదక్షిణ చేయడం కష్టం కాబట్టి వారి కోసం ఆటోలున్నాయి. ఒక్కొక్కరికి ఐదువందల రూపాయలు తీసుకుంటారు.
గిరి ప్రదక్షిణ చేసేప్పుడు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది.
- గిరి ప్రదక్షిణ చెప్పుల్లేకుండా, నెమ్మదిగా చేయాలి. తలపై టోపీలాంటివి ధరించొద్దు.
- కేవలం ఎడమవైపునే గిరి ప్రదక్షిణ చేయాలి. ఎందుకంటే కుడివైపున దేవతలు, సిద్ధులు అదృశ్యరూపంలో గిరి ప్రదక్షిణ చేస్తుంటారంటారు. కావునే వారికి సాధారణ భక్తులు ఎదురు వెళ్లకూడదు.
- గిరి ప్రదక్షిణ ఆరంభించాక ఎలాంటి కోరికలు కోరకూడదు.
- ‘అరుణాచలశివ’ నామస్మరణతో సాగాలి. అప్పుడప్పుడు గిరి వైపు చూస్తుండాలి. ప్రతీ ఆలయం దగ్గర విభూతి ప్రసాదంగా ఇస్తారు. అది తప్పక తీసుకోవాలి.
- ప్రదక్షిణ మార్గంలో కుక్కలకు తిండి తప్పక పెట్టాలి (భైరవ స్వరూపం కనుక).
- సంతానం కోసం, వివాహం కానివారు గిరి ప్రదక్షిణలో దుర్వాస మహర్షి దేవాలయం పక్కన ఉన్న చెట్టుకు తాడు కడతారు.
పధ్నాలుగు కిలోమీటర్లు చెప్పుల్లేకుండా నడిచేసరికి కాళ్లనొప్పులు మొదలయ్యాయి. అల్పాహారం తీసుకుని రాత్రి తొమ్మిది గంటలకే నిద్రపోయాం. మరుసటి రోజు ఉదయం అరుణాచలేశ్వర గుడిని కాలి నడకన దర్శించుకున్నాం. అరుణాచలం... పంచలింగ క్షేత్రాల్లో అగ్ని భూతానికి ప్రతీక. ఆలయం లోపల అరుణాచలేశ్వరుని పాదముద్ర ఉంది. రమణ మహర్షి తపస్సు ద్వారా అనుగ్రహం పొందిన ప్రదేశం ఆలయంలోకి ప్రవేశించగానే కనిపిస్తుంది. సర్వసిద్ధి వినాయకునికి కుడివైపున రమణ మహర్షి తపస్సు చేసిన పాతాళ లింగేశ్వరుని సన్నిధి ఉంది. ఆ పక్కనే వేయి కాళ్ల మండపం, అన్నదాన సత్రం, శివగంగ తీర్థం అనే కోనేరు ఉన్నాయి.
రమణాశ్రమం...
అరుణాచలేశ్వర ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలో రమణాశ్రమం ఉంటుంది. అరుణాచలం వెళ్లిన వారు ఈ ఆశ్రమాన్ని తప్పక సందర్శిస్తుంటారు. స్థానికుల కన్నా విదేశీయులే ఎక్కువ కనిపిస్తారు. ఇక్కడ రమణుల సమాధిని చూడొచ్చు. ఇక్కడి గ్రంథాలయంలో రమణ మహర్షికి సంబంధించిన పుస్తకాలు లభిస్తాయి. ఆశ్రమంలో వసతి కోసం మూడు నెలలు ముందుగానే పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
మరుసటి రోజు ఉదయం అరుణాచలం నుంచి పర్వతమలై కొండ దిగువకు ఆరుగంటలకు చేరుకున్నాం. తిరువణ్ణామలై నుంచి పర్వతమలై 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ నిటారుగా ఉన్న పర్వతం పైన శివాలయం ఉంది. శివుడు హిమాలయాల నుంచి అరుణాచలానికి తిరిగి వచ్చినప్పుడు పర్వతమలై కొండపై అడుగుపెట్టాడట. ఇక్కడ సిద్ధులు శివుని ఎదుట ధ్యానం చేసి జ్ఞానోదయం పొందడానికి ఒక ఆలయాన్ని నిర్మించుకున్నారు.
కొండపై రాత్రి బస చేసే భక్తులకు కొన్ని అద్భుతాలు అనుభవం అవుతాయని చెబుతారు. కొండపైకి తేన్మాడి మంగళం, కడలడి అనే రెండు మార్గాలుంటాయి. ఇక్కడి గుడి 24 గంటలూ తెరిచే ఉంటుంది. పూజారి అంటూ ఎవరూ ఉండరు. లక్ష్మణున్ని బతికించడానికి హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తెస్తున్నప్పుడు అందులోంచి పడిపోయిన ఒక భాగమే పర్వతమలై అనే కథ ప్రచారంలో ఉంది. ఎన్నో ప్రాణాం తకమైన వ్యాధులను నయం చేయగల శక్తిమంతమైన మూలికలు ఈ కొండపై ఉన్నాయని నమ్ముతారు. మేము ఉదయం ఆరు గంటలకు పర్వతమలై కొండను ఎక్కడం మొదలెడితే... మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి కిందకు వచ్చాం. స్వచ్ఛమైన ప్రకృతిలో ట్రెక్కింగ్ చేసిన అనుభూతి కలిగింది. తిరుగు ప్రయాణంలో మదనపల్లి సమీపంలో ఉన్న ‘హార్స్లీ హిల్స్’ చూసి అనంతపురం మీదుగా హైదరాబాద్కు చేరుకున్నాం. ముందుగా చెప్పినట్లు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత నా శరీరం, మనసు మరింత ఉల్లాసభరితంగా, ఉత్సాహభరితంగా మారింది.
- యల్లనూరు వెంకట రమణారెడ్డి, హైదరాబాద్
ఈ వార్తలు కూడా చదవండి.
భార్య సీమంతంలో భర్తకు గుండెపోటు.. మృతి
Hyderabad Metro: పార్ట్-బీ మెట్రోకు డీపీఆర్ సిద్ధం
Read Latest Telangana News and National News