Stock Market: చివరి గంటలో అమ్మకాలు.. భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు..
ABN , Publish Date - Jun 12 , 2025 | 04:30 PM
విదేశీ మదుపర్లు పెట్టుబడులను క్రమంగా పెంచుకుంటుండడంతో దేశీయ సూచీలు గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్నాయి. మంగళవారం కూడా విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.2302 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. గత మూడు రోజులుగా వారు షేర్ల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు.

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, ఇరాన్-ఇజ్రాయేల్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ ధరల్లో పెరుగుదల కారణంగా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను అరశాతం మేర తగ్గించడంతో ఈ వారం సూచీలు వరుసగా లాభపడ్డాయి. గరిష్టాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ఈ రోజు నష్టాలను చవిచూశాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ గురువారం నష్టాలను మూటగట్టుకున్నాయి. (Business News).
బుధవారం ముగింపు (82, 515)తో పోల్చుకుంటే గురువారం ఉదయం దాదాపు ఫ్లాట్గా మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత లాభ నష్టాలతో దోబూచులాడింది. అయితే మధ్యాహ్నం తర్వాత అమ్మకాలు మొదలయ్యాయి. చివరి గంటలో భారీగా అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ పతనమైంది. ఒక దశలో ఇంట్రాడే హై నుంచి ఏకంగా 1100 పాయింట్లు కోల్పోయింది. చివరకు సెన్సెక్స్ 823 పాయింట్ల నష్టంతో 81, 691 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 253 పాయింట్ల నష్టంతో 24, 888 వద్ద రోజును ముగించింది.
సెన్సెక్స్లో టొరెంట్ ఫార్మా, మ్యాక్స్ హెల్త్కేర్, ఆర్బీఎల్ బ్యాంక్, ఎస్బీఐ కార్డ్ షేర్లు లాభాల్లో ముగిశాయి. పేటీఎమ్, సీడీఎస్ఎల్, హిందుస్తాన్ పెట్రో, బీపీసీఎల్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 947 పాయింట్ల నష్టంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 377 పాయింట్లు కోల్పోయింది. డాలర్తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 85.60గా ఉంది.
ఇవి కూడా చదవండి
Elon Musk: ఒక్క సారీ
.. రూ.1600 కోట్లు లాభం.. ఎలన్ మస్క్ జాక్పాట్
ఎస్ఎస్ఏ ఉద్యోగుల కల సాకారమయ్యేనా
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..