Share News

RBI: ప్రజల వద్ద ఉన్న రూ.2000 నోట్లను తిరిగి తీసుకుంటాం.. ఇలా చేయండి..

ABN , Publish Date - Jun 02 , 2025 | 03:18 PM

రెండేళ్ల క్రితం మాయమైన రూ.2000 నోట్ల గురించి ఆర్బీఐ కీలక అప్‎డేట్ ఇచ్చింది. తాజాగా వీటిని తిరిగి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. RBI గణాంకాల ప్రకారం, ఇంకా ప్రజల దగ్గర రూ.6,181 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ఉన్నాయి.

RBI: ప్రజల వద్ద ఉన్న రూ.2000 నోట్లను తిరిగి తీసుకుంటాం.. ఇలా చేయండి..
RBI Announces Withdrawal of Rs 2000

ఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ. 2000 నోట్ల గురించి కీలక ప్రకటన చేసింది. వీటిని మే 19, 2023న ఉపసంహరించాలని నిర్ణయించినప్పటికీ, రెండేళ్ల తర్వాత కూడా ప్రస్తుతం రూ. 6,181 కోట్ల విలువైన నోట్లు ఇంకా ప్రజల వద్ద ఉన్నాయని ఆర్బీఐ డేటా సోమవారం తెలిపింది. ఈ నోట్లు ఇప్పటికీ చెల్లుబాటు అవుతాయని, అంటే వాటిని లావాదేవీల కోసం ఉపయోగించవచ్చని RBI స్పష్టం చేసింది.


నోట్లను ఎలా మార్చుకోవాలి..

2023లో వీటి రద్దు నిర్ణయం ప్రకటించినప్పుడు మొత్తం రూ. 3.56 లక్షల కోట్ల విలువైన రూ. 2000 నోట్లు చలామణిలో ఉన్నాయి. ఆ తర్వాత 2025 మే 31 నాటికి ఈ మొత్తం గణనీయంగా తగ్గి కేవలం రూ. 6,181 కోట్లకు చేరింది. అంటే, 98.26% నోట్లు మాత్రమే ఇప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి చేరాయి. మిగిలిన ఆరు వేల కోట్లు ఇంకా ప్రజల వద్దనే ఉన్నాయి. మిగిలిన రూ. 2000 నోట్లను సాధారణ బ్యాంక్ బ్రాంచ్‌లలో డిపాజిట్ చేయడం లేదా మార్చుకోవడం 2023 అక్టోబర్ 7తో ముగిసింది.


పోస్టాఫీస్ ద్వారా..

అయినప్పటికీ, మిగిలిన రూ.2 వేల నోట్లను ఆర్బీఐ 19 కేంద్రాల ద్వారా ఇప్పటికీ స్వీకరిస్తోంది. ఈ ఆఫీసులు దేశవ్యాప్తంగా ఉన్నాయి. కాబట్టి ప్రజలు తమ వద్ద ఉన్న ఈ నోట్లను అక్కడ డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపింది. దీంతోపాటు అక్టోబర్ 9, 2023 నుంచి వ్యక్తులు, వ్యాపారస్తులు తమ రూ. 2000 నోట్లను ఇండియా పోస్ట్ ద్వారా RBI ఆఫీసులకు పంపవచ్చని వెల్లడించింది. ఈ నోట్ల విలువను వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. ఈ సౌలభ్యం ప్రజలకు సులభంగా నోట్లను తిరిగి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది.


ఎందుకు ఈ ఉపసంహరణ?

రూ.2000 నోట్లను ఉపసంహరించడం వెనుక ఆర్థిక వ్యవస్థలో డబ్బు ప్రవాహాన్ని నియంత్రించడం RBI ఉద్దేశం. ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడంలో భాగంగా నిర్ణయం తీసుకున్నారు. మీ వద్ద రూ. 2000 నోట్లు ఇంకా ఉంటే, వాటిని RBI ఆఫీసులకు ఇండియా పోస్ట్ ద్వారా పంపించండి. ఆ మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. వ్యక్తులే కాదు, వ్యాపార సంస్థలూ ఈ విధంగా మార్చుకోవచ్చు.

ప్రజలు ఎందుకు తిరిగి ఇవ్వలేదు

అందుకు అనేక కారణాలు ఉండవచ్చు. కొంతమంది మరచిపోయి ఉండవచ్చు. మరికొంత మందికి సమాచారం తెలియకపోవచ్చు. ఇంకొందరు ఈ నోట్లు వ్యక్తిగతంగా నిల్వ చేసుకుని ఉండవచ్చు. కారణం ఏదైనా సరే, RBI ఇప్పటికీ వాటిని తీసుకునేందుకు అవకాశం ఇస్తోంది. కాబట్టి వాటిని వీలైనంత త్వరగా మార్చుకోండి.


ఇవీ చదవండి:

జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..

జూన్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 04:43 PM