Kisan Credit Card: 4 శాతం వడ్డీకే రూ.3లక్షల లోన్.. రైతులకు కేంద్రం ఆఫర్..
ABN , Publish Date - Jun 07 , 2025 | 02:58 PM
దేశంలో కిసాన్ క్రెడిట్ కార్డ్ (Kisan Credit Card) స్కీమ్ రైతులకు ఒక జీవనాడిగా మారిందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ పథకం ద్వారా రైతులు తక్కువ వడ్డీకే లోన్స్ తీసుకుని, తమ వ్యవసాయ కార్యకలాపాలను సజావుగా నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు.

ఢిల్లీ: దేశంలో లక్షల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ (Kisan Credit Card) స్కీమ్ ఎంతో చక్కగా ఉపయోగపడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ పథకం ద్వారా రైతులు సకాలంలో తక్కువ వడ్డీ రేటుకే రుణ సౌకర్యాన్ని పొందుతున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించిన విషయాలను వివరిస్తూ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ రుణాలు రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల వంటి వ్యవసాయ అవసరాలను తీర్చుకునేందుకు ఉపయోగపడుతున్నట్లు చెప్పారు.
సకాలంలో చెల్లిస్తే..
ఈ పథకం ద్వారా ఇప్పటివరకూ 465 లక్షలకు పైగా దరఖాస్తులు ఆమోదించబడగా, రూ.5.7 లక్షల కోట్ల రుణాలను ఇచ్చినట్లు వెల్లడించారు కేంద్ర ఆర్థిక మంత్రి. రైతులు సకాలంలో ఈ రుణాన్ని తిరిగి చెల్లిస్తే, కేవలం 4 శాతం వడ్డీ రేటుతో రూ. 3 లక్షల వరకు రుణం పొందవచ్చని తెలిపారు. అంతేకాకుండా, సకాలంలో రుణ చెల్లింపునకు 3 శాతం అదనపు ప్రోత్సాహక వడ్డీ రాయితీ కూడా అందించబడుతుందన్నారు. దీని ఫలితంగా అన్నదాతలకు వడ్డీ రేటు 4 శాతానికి తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి రూ.లక్ష రుణంపై రైతులు సంవత్సరానికి రూ. 9,000 వడ్డీని ఆదా చేసుకుంటారు.
ప్రధానంగా..
ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో కూడిన కేసీసీ రుణ పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ.5లక్షలకు పెంచింది. దీంతో దాదాపు 7.7 కోట్ల రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ఈ విధానం రైతులకు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు, ఇతర అవసరాలకు సరసమైన ధరలో రుణాన్ని అందుబాటులోకి తెచ్చారు. సమయానికి రుణాలను తిరిగి చెల్లించిన రైతన్నలకు అదనంగా 3% వడ్డీ సబ్సిడీ కల్పించబడుతుంది. రుణ పరిమితిలో పంటల రుణాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మిగిలిన మొత్తం ద్వారా పశు పోషణ, మత్స్య కార్యక్రమాల వంటి అనుబంధ కార్యకలాపాలకు రుణాలు అందిస్తారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు
వ్యవసాయ బడ్జెట్ పెంపు: 2013–14లో రూ.21,500 కోట్లు ఉన్న వ్యవసాయ బడ్జెట్ను 2024–25లో రూ.1.22 లక్షల కోట్లు వరకు పెంచారు. ఇది 5 రెట్లు పెరుగుదల.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN): ఈ పథకం ద్వారా రైతులకు నేరుగా నగదు అందించబడుతుంది. ఇప్పటివరకు 11 కోట్లకు పైగా రైతులకు రూ.3.46 లక్షల కోట్లు పంపిణీ చేశారు.
పంట బీమా పథకం (PMFBY): ఈ పథకం ద్వారా రైతుల పంట నష్టాలకు భద్రత పొందుతారు. ఇప్పటివరకూ 63.11 కోట్ల రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ క్రమంలో రూ.1.65 లక్షల కోట్లు క్లెయిమ్ చేశారు.
ఇవీ చదవండి:
5 ఏళ్లలో రూ.4 లక్షల రాబడి.. పోస్టాఫీసు పథకం
ఆ నంబర్ల నుంచి వచ్చే ఫోన్లు అస్సలు లిఫ్ట్ చేయకండి..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..