Japan Economic Growth: భారత్ కంటే వెనకబడ్డ జపాన్.. అసలు ఆ దేశంలో ఏం జరుగుతోందో తెలిస్తే..
ABN , Publish Date - May 26 , 2025 | 09:42 AM
భారత్ కంటే జపాన్ వెనుకబడటానికి ఓ ముఖ్య కారణం ఉందంటూ వెల్త్ అడ్వైజర్ హర్షల్ భట్టే లింక్డ్ ఇన్లో పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశం అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: భారత్ జపాన్ను అధిగమించింది. నామినల్ జీడీపీ పరంగా ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద దేశంగా అవతరించింది. ఇది భారతీయులందరూ సంతోషించదగ్గ విషయం. అయితే, ఈ అంశానికి మరో కోణం కూడా ఉందని వెల్త్ అడ్వైజర్ హర్షల్ భట్టే లింక్డ్ఇన్లో రాసుకొచ్చారు. వ్యవస్థాగత లోపాలు జపాన్ వెనుకబాటుకు ప్రధాన కారణమని అన్నారు.
2010లో జపాన్ ఆర్థిక వ్యవస్థ విలువ 6 ట్రిలియన్ డాలర్లుగా ఉండేది. కానీ నేడు అది కేవలం 4.2 ట్రిలియన్ డాలర్లకు కుంచించుకుపోయింది. మరోవైపు, భారత ఆర్థిక వ్యవస్థ గత పదేళ్లలో రెండింతలై 4 ట్రిలియన్ మార్కు దాటింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా అవతరించింది.
అంతర్జాతీయ ద్రవ్య నిధి లెక్కల ప్రకారం, ఈ ఏడాది భారత వృద్ధి రేటు 6.2 శాతం నుంచి 6.5 శాతం వరకూ ఉండే అవకాశం ఉంది. వినియోగంలో వృద్ధి, మౌలిక వసతులపై పెట్టుబడులు పెరగడం వంటివి ఆర్థికాభివృద్ధికి చోదక శక్తులుగా ఉన్నాయి. అంతర్జాతీయ పెట్టుబడుల రాక పెరుగుతుండటంతో పాటు తలసరి ఆదాయం కూడా గత పదేళ్లల్లో రెట్టింపైంది.
అయితే, భారత్ పూర్తిస్థాయిలో తన సామర్థ్యాలను వినియోగించుకోవట్లేదని భట్టే అభిప్రాయపడ్డారు. గతంలో జపాన్, చైనా వలెనే వరుసగా భారత్ కొన్ని సంవత్సరాల పాటు 8 శాతానికి పైగా వార్షిక వృద్ధి రేటు సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత్లో ప్రస్తుతం మౌలిక వసతులపై పెట్టుబడి 24 శాతంగా ఉందని, ఇది 32 శాతానికి పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
గొప్ప వృద్ధి రేటు సాధించాలంటే మౌలిక వసతులపై పెట్టుబడులు భారీగా పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అప్పుడే, దేశ ప్రజలను పేదరికం నుంచే బయటపడేయడం సాధ్యమవుతుందని అన్నారు. బలమైన ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకుంటుందని చెప్పారు.
ఇక జపాన్ వెనకబడటానికి ప్రధాన కారణం వృద్ధుల జనాభా పెరగడమేనని భట్టే తెలిపారు. జపాన్ జనాభాలో 65 ఏళ్లకు పైబడిన వారి వాటా 30 శాతం. దీంతో, అక్కడ కార్మికుల కొరత ఎక్కువైంది. వినియోగం, ఉత్పాదకత తగ్గాయి. వృద్ధులకు పెన్షన్లు, వైద్య ఖర్చులు భారంగా మారాయి. అంతిమంగా ఈ వ్యవస్థాగత లోపాలు జపాన్కు గుదిబండగా మారాయి.
భారత్ పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నం. ఇక్కడ దేశ ప్రజల సగటు వయసు 29.5 సంవత్సరాలు. దీంతో, యువత భారత ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే , యువత శక్తి సామర్థ్యాలను పూర్తిస్థాయిలో దేశానికి ఉపయోగపడాలంటే విద్య, ఉద్యోగాల కల్పన, కొత్త నైపుణ్యాల్లో శిక్షణ అవసరమని భట్టే అభిప్రాయపడ్డారు. ఇవి లేని పక్షంలో యువ శక్తి నిరుపయోగంగా మారుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం కొంత అభివృద్ధి జరుగుతున్నా చేయాల్సింది ఇంకెంతో ఉందని భట్టే ముగించారు.
ఇవీ చదవండి:
నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. జపాన్ను ఓవర్ టేక్ చేసిన వైనం
వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. భారత్లో ఐఫోన్లు తయారు చేస్తే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి