Crypto Tax Evasion: క్రిప్టో కరెన్సీతో భారీగా లావాదేవీలు.. పన్నులు ఎగవేస్తున్న వారిపై కేంద్రం ఫోకస్..
ABN , Publish Date - Jun 14 , 2025 | 03:40 PM
భారతదేశంలో క్రమంగా క్రిప్టోకరెన్సీపై పెట్టుబడులు చేసే వారి సంఖ్య పెరిగింది. కానీ వీటి లావాదేవీలపై మాత్రం పన్నులు చెల్లించడం లేదని కేంద్రం చెబుతోంది. ఈ క్రమంలో అలాంటి వారిపై చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది.

బిజినెస్ డెస్క్: ఇటీవల కాలంలో అగ్రరాజ్యం అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత క్రిప్టో కరెన్సీ విలువ భారీగా పెరిగింది. దీంతో వీటిపై పెట్టుబడులు చేసిన వారు పెద్దమొత్తంలో లాభాలను ఆర్జించారు. ఇదే సమయంలో ఇండియాలోనూ క్రిప్టోపై పెట్టుబడులు చేసిన వారు అనేక మంది ఉన్నారు. వీరు క్రిప్టో లావాదేవీలపై పన్నులను ఎగవేస్తున్నట్లు (Crypto Tax Evasion) కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) గుర్తించింది. దీంతో ఎగవేతను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని సీబీడీటీ నిర్ణయించింది.
పన్ను రిటర్న్లలో
ఈ క్రమంలో CBDT క్రిప్టో ఎక్స్చేంజ్ల ద్వారా పొందిన డేటా ఆధారంగా 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి వేలాది మంది పన్ను చెల్లింపుదారులపై దృష్టి సారించింది. ఆయా వ్యక్తులు తమ వర్చువల్ డిజిటల్ ఆస్తుల (VDA) ఆదాయాన్ని ఆదాయ పన్ను రిటర్న్లలో సరిగ్గా ప్రకటించడం లేదు. డిజిటల్ ఆస్తుల వృద్ధిని దృష్టిలో ఉంచుకుని, వాటిపై సరైన పన్నుల విధానం అవసరమని కేంద్రం స్పష్టం చేసింది. దీని ద్వారా బ్లాక్ మనీకి అడ్డుకట్ట వేయడంతోపాటు, పన్ను చెల్లింపుదారులకు న్యాయమైన వ్యవస్థను అందించడంపైనా ఫోకస్ చేసింది.
ప్రతి లావాదేవీపై
క్రిప్టో మార్కెట్ నియంత్రణలోకి రావడంతోపాటు, దీని ఆధారిత పెట్టుబడులపై విశ్వసనీయత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన సెక్షన్ 115BBH ప్రకారం, VDA ఆదాయంపై కేంద్రం 30% స్థిర పన్ను రేటును విధించింది. ఇది, సంపాదనలపై ఇతర పన్ను తగ్గింపులు లేదా నష్టాలను ఇతర ఆదాయాలతో సమీకరించడానికి అనుమతించదు (Crypto Tax Evasion). అదనంగా ప్రతి లావాదేవీపై 1% టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (TDS) కూడా విధించబడుతుందని వెల్లడించింది.
కొత్త మార్పులు
2025 బడ్జెట్లో క్రిప్టో లావాదేవీలపై పన్ను ఎగవేతను అరికట్టడానికి కీలక మార్పులు ప్రతిపాదించబడ్డాయి. సెక్షన్ 158B ప్రకారం అధికారులు క్రిప్టో ఆదాయాన్ని పునద్ధరించనిదిగా పరిగణించి, 60% పన్ను జరిమానా విధిస్తారు. సెక్షన్ 285BAA ప్రకారం క్రిప్టో ఎక్స్చేంజ్లు, ఇతర సంస్థలు తమ లావాదేవీల వివరాలను పన్ను అధికారులకు సమర్పించాలి. భారత ప్రభుత్వం క్రిప్టో సంస్థలపై పన్ను ఎగవేతపై కఠిన చర్యలు తీసుకుంటోంది. బైనాన్స్కు చెందిన నెస్ట్ సర్వీసెస్ లిమిటెడ్ రూ. 722.43 కోట్ల జీఎస్టీ ఎగవేతకు గురైంది. అలాగే, WazirX, CoinDCX, CoinSwitch Kuber వంటి సంస్థలూ పన్ను ఎగవేతలో భాగస్వామ్యంగా ఉన్నాయని గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..
టెలికాం యూజర్లకు గుడ్ న్యూస్.. పోస్ట్పెయిడ్ టూ ప్రీపెయిడ్ మరింత ఈజీ
For National News And Telugu News