Anil Ambani Loan Fraud: లోన్ మోసం కేసు.. ఆ సంస్థ ఎండీ అరెస్ట్..
ABN , Publish Date - Aug 02 , 2025 | 08:22 PM
Anil Ambani Loan Fraud: 2017 నుంచి 2019 మధ్య కాలంలో రిలయన్స్ కంపెనీ యస్ బ్యాంకు నుంచి రూ.3వేల కోట్ల లోన్లు తీసుకుంది. ఈ రూ.3వేల కోట్లను అనిల్ అంబానీ దారి మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి.

రిలయన్స్ గ్రూపుకు సంబంధించిన 3 వేల కోట్ల మోసం కేసులో ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. బిశ్వాల్ ట్రేడ్ లింక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారధి బిశ్వాల్ను ఈడీ అరెస్ట్ చేసింది. 68.2 కోట్ల విలువైన ఫేక్ గ్యారెంటీలు ఇచ్చాడన్న ఆరోపణల నేపథ్యంలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద ఆయనను అదుపులోకి తీసుకుంది. 2019లో బిశ్వాల్ ట్రేడ్ లింక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటైంది. ఆ కంపెనీ డైరెక్టర్లు 68.2 కోట్ల విలువైన ఫేక్ బ్యాంక్ గ్యారెంటీలను సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాకు ఇచ్చారు.
ఈ ఫేక్ గ్యారెంటీల కోసం ఎస్బీఐకి స్పూస్ డొమైన్ అయిన s-bi.co.in వాడుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఫేక్ గ్యారెంటీలు ఏర్పాటు చేయటం ద్వారా బిశ్వాల్ ట్రేడ్ లింక్ కంపెనీ రిలయన్స్ పవర్ నుంచి 5.4 కోట్ల రూపాయలు పొందినట్లు ఈడీ గుర్తించింది. ఆ కంపెనీ సరైన విధంగా రికార్డులు మెయిన్టేన్ చేయలేదని, డమ్మీ డైరెక్టర్స్తో డాక్యుమెంట్లపై సంతకాలు చేయించిందని తెలుస్తోంది. ఇక, ఈడీ అధికారులు బిశ్వాల్ను స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు బుధవారం వరకు కస్టడీ విధించింది. ఇక, ఈ కేసుకు సంబంధించి ఇదే మొదటి అరెస్ట్ కావటం గమనార్హం.
అంబానీకి లుక్ అవుట్ నోటీస్
ఇక, ఇదే కేసుకు సంబంధించి రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాకుల మీద షాకులు ఇస్తోంది. శుక్రవారం ఆయనకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. అంతకు ఒక రోజు ముందు (గురువారం) విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ సమన్లు పంపింది. కాగా, 2017 నుంచి 2019 మధ్య కాలంలో రిలయన్స్ కంపెనీ యస్ బ్యాంకు నుంచి రూ.3వేల కోట్ల లోన్లు తీసుకుంది. ఈ రూ.3వేల కోట్లను అనిల్ అంబానీ దారి మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
నడిరోడ్డుపై పాముతో హల్చల్.. లేడీ పోలీస్ పరుగో పరుగు..
హీరోయిన్ రమ్యకు అత్యాచార బెదిరింపులు.. ఇద్దరు అరెస్ట్..