Bengaluru: 10 ఏళ్లలో రూ.1,000 కోట్ల అద్దె
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:39 AM
భారత్లో ఐఫోన్ల తయారీని భారీగా పెంచడంపై దృష్టి సారించిన యాపిల్.. మన దేశంలో కార్యకలాపాలను అదే స్థాయిలో విస్తరిస్తోంది.
న్యూఢిల్లీ: భారత్లో ఐఫోన్ల తయారీని భారీగా పెంచడంపై దృష్టి సారించిన యాపిల్.. మన దేశంలో కార్యకలాపాలను అదే స్థాయిలో విస్తరిస్తోంది. ఇందుకోసం బెంగళూరులో ఎంబసీ గ్రూప్నకు చెందిన కమర్షియల్ ప్రాజెక్టు ఎంబసీ జెనీత్లో దాదాపు 2.7 లక్షల చదరపు అడుగుల భారీ కార్యాలయ స్థలాన్ని యాపిల్ 10 ఏళ్ల కాలానికి లీజుకు తీసుకుంది. 9 అంతస్తుల్లో (5 నుంచి 13వ అంతస్తు వరకు) విస్తరించి ఉన్న ఈ ఆఫీస్ స్పేస్ కోసం చదరపు అడుగుకు రూ.235 చొప్పున సంస్థ నెలకు మొత్తం రూ.6.3 కోట్ల అద్దె చెల్లించనుంది.
ఈ అద్దె ఏటా 4.5 శాతం చొప్పున పెరగనుందని.. అద్దెతో పాటు పార్కింగ్, మెయింటెనెన్స్ చార్జీలతో కలిపి పదేళ్లకు మొత్తం రూ.1,000 కోట్లకు పైగా ముట్టజెప్పనుందని డేటా అనలిటిక్స్ కంపెనీ ప్రాప్స్టాక్ సోమవారం వెల్లడించింది. 2025 ఏప్రిల్ 3 నుంచి అమలులోకి వచ్చిన ఈ లీజు ఒప్పందంలో భాగంగా యాపిల్ రూ.31.57 కోట్లు డిపాజిట్ కూడా చేసిందని ప్రాప్స్టాక్ పేర్కొంది. అయితే, ఈ విషయంపై స్పందించేందుకు యాపిల్ నిరాకరించింది.