Tatkal Tickets: తత్కాల్ బుకింగ్ కోసం కొత్త రూల్.. అలా అయితేనే టికెట్లు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం..
ABN , Publish Date - Jun 11 , 2025 | 05:55 PM
తత్కాల్ టికెట్లకు సంబంధించి రైల్వే శాఖ మరో కొత్త నిబంధనను అమల్లోకి తీసుకురాబోతోంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్లో ఆధార్ అథంటికేటెడ్ వ్యక్తులకే తత్కాల్ టికెట్ బుకింగ్ సదుపాయం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. జులై 1వ తేదీ నుంచి ఈ నిబంధన అమలు చేయబోతున్నట్టు ప్రకటించింది.

ఢిల్లీ: తత్కాల్ టికెట్ల(Tatkal Tickets)కు సంబంధించి రైల్వే శాఖ (Indian Railway) మరో కొత్త నిబంధన అమల్లోకి తీసుకురాబోతోంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్లో ఆధార్ అథంటికేటెడ్ (Aadhaar authentication) వ్యక్తులకే తత్కాల్ టికెట్ బుకింగ్ సదుపాయం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. జులై 1వ తేదీ నుంచి ఈ నిబంధనను అమలు చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు అన్ని జోన్లకు తాజాగా సర్క్యులర్ జారీ చేసింది. ఆధార్ అథంటికేటెడ్ కాని వ్యక్తులు జులై 1 తర్వాత తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోలేరు.
ఇక, జులై 15 నుంచి తత్కాల్ టికెట్ల బుకింగ్కు ఆధార్ బేస్డ్ ఓటీపీ కూడా తప్పనిసరి చేయబోతున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. రైల్వే శాఖకు చెందిన టికెట్ బుకింగ్ కౌంటర్లలో, ఏజెంట్ల దగ్గర తత్కాల్ టికెట్లు బుక్ చేయాలంటే వ్యక్తుల మొబైల్కు వచ్చే ఆధార్ ఓటీపీని చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఏజెంట్లకు తత్కాల్ టికెట్ల బుకింగ్ చేసే అవకాశాన్ని తొలి అరగంట ఇవ్వబోమని రైల్వే శాఖ తేల్చి చెప్పింది. అంటే ఏసీ కోచ్ టికెట్లను ఉదయం 10:30 తర్వాత, స్లీపర్ క్లాస్ టికెట్లను ఉదయం 11:30 గంటల తర్వాత మాత్రమే ఏజెంట్లు బుక్ చేయడానికి వీలవుతుంది.
ఈ ఆదేశాలకు అనుగుణంగా రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఐఆర్సీటీసీ తమ సిస్టమ్స్లో మార్పులు చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది. అనధికారిక టికెట్ల బుకింగ్ను నిలిపివేయడం కోసమే రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే ఇప్పటివరకూ వెయింటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్ల స్టేటస్ రైలు బయల్దేరే నాలుగు గంటల ముందు మాత్రమే తెలుస్తుంది. ఇకపై, 24 గంటల ముందే వెయింటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్ల స్టేటస్ తెలుసుకునే వెసులుబాటు కల్పించేందుకు రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది.
ఇవి కూడా చదవండి
రాజీవ్ యువ వికాసం మరింత జాప్యం
ఎస్ఎస్ఏ ఉద్యోగుల కల సాకారమయ్యేనా
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..