Share News

Women Protest: జగన్‌ మీడియాపై జనాగ్రహం

ABN , Publish Date - Jun 10 , 2025 | 03:05 AM

అమరావతిని వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీ చానల్‌లో చేసిన వ్యాఖ్యలపై మహిళా లోకం భగ్గుమంది. రాష్ట్రవ్యాప్తంగా సాక్షి కార్యాలయాల ఎదుట మహిళలు ఆందోళనలు నిర్వహించారు. కొన్నిచోట్ల గేట్లెక్కి నిరసన తెలిపారు.

Women Protest: జగన్‌ మీడియాపై జనాగ్రహం

  • మహిళల నిరసనలు.. పోలీసులకు ఫిర్యాదులు

  • మంగళగిరి ఆఫీస్‌ను ముట్టడించిన రాజధాని మహిళలు

  • కొమ్మినేని, కృష్ణంరాజుపై కఠిన చర్యలకు డిమాండ్‌

  • జగన్‌, భారతి క్షమాపణ చెప్పాలని నినాదాలు

  • చెప్పులు, చీపుర్లు, చాటలు చూపుతూ హెచ్చరికలు

  • సాక్షి నేమ్‌ బోర్డులు ధ్వంసం.. గేట్లెక్కి ఆందోళనలు

  • కర్నూలు ఆఫీసు ఎదుట జగన్‌ దిష్టిబొమ్మ దహనం

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

మరావతిని వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీ చానల్‌లో చేసిన వ్యాఖ్యలపై మహిళా లోకం భగ్గుమంది. రాష్ట్రవ్యాప్తంగా సాక్షి కార్యాలయాల ఎదుట మహిళలు ఆందోళనలు నిర్వహించారు. కొన్నిచోట్ల గేట్లెక్కి నిరసన తెలిపారు. సాక్షి బోర్డులను ధ్వంసం చేశారు. చెప్పులు, చీపుర్లు, చాటలు చూపుతూ హెచ్చరికలు చేశారు. పలు పట్టణ కేంద్రాల్లోనూ మహిళలు ఆందోళనలు నిర్వహించారు. పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. సోమవారం రాజధానిలోని తుళ్లూరు నుంచి వందల సంఖ్యలో మహిళలు మంగళగిరిలోని సాక్షి యూనిట్‌ కార్యాలయానికి చేరుకున్నారు. మంగళగిరి మహిళలు కూడా వారి వెంట నడిచారు. వారంతా సాక్షి కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సాక్షి నేమ్‌ బోర్డును పెకలించి, ధ్వంసం చేశారు. గుంటూరులోని సాక్షి కార్యాలయాన్నీ మహిళలు ముట్టడించారు. పొన్నూరులో వందలాది మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. సాక్షి మీడియాను బహిష్కరించాలని, కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులను శిక్షించాలని, జగన్‌, భారతి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కొమ్మినేని, కృష్ణంరాజు ఫొటోలు, సాక్షి దినపత్రికను చెప్పులతో కొట్టి దహనం చేశారు. కృష్ణంరాజు, కొమ్మినేనిపై కేసు నమోదు చేయాలని వేమూరు మార్కెట్‌యార్డు చైర్‌పర్సన్‌ పూర్ణకుమారి అమర్తలూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విజయవాడ ఆటోనగర్‌లోని సాక్షి కార్యాలయం వద్ద సాక్షి బోర్డును తొలగించి కాళ్లతో తొక్కారు. దిష్టిబొమ్మలు, సాక్షి ప్రతులను దహనం చేశారు. గేటుపైకి కోడిగుడ్లు విసిరారు.


సాక్షి టీవీ చానల్‌ను బ్యాన్‌ చేయాలని విశాఖపట్నంలోని సాక్షి యూనిట్‌ కార్యాలయం, అనకాపల్లిలోని ప్రాంతీయ కార్యాలయం ఎదుట తెలుగు మహిళలు, వీర మహిళలు డిమాండ్‌ చేశారు. పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. కొమ్మినేని, కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని శాసనసభ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సతీమణి, నర్సీపట్నం మునిసిపల్‌ కౌన్సిలర్‌ చింతకాయల పద్మావతి ఆధ్వర్యంలో మహిళలు నర్సీపట్నం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని సాక్షి ఆఫీసు వద్ద సాక్షి ప్రతులను దహనం చేసి, కార్యాలయ బోర్డును తొలగించి మంటల్లో వేశారు. గేటుకు చెప్పుల దండను వేలాడదీశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి లోనూ సాక్షి పత్రిక ప్రతులను దహనం చేశారు. అనంతపురంలో సాక్షి కార్యాలయ ద్వారాన్ని కూటమి నేతలు, కార్యకర్తలు తెరిచేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్రస్థాయిలో పెనుగులాట జరిగింది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఎస్పీ కార్యాలయం ఎదుట తెలుగు మహిళలు నిరసన తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యుడు మల్లెల రాజశేఖర్‌ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా సాక్షి కార్యాలయం ఎదుట మహిళలు జగన్‌ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు. కడపలోని సాక్షి కార్యాలయంలోకి వెళ్లేందుకు మహిళలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఏలూరులోని సాక్షి కార్యాలయం ఎదుట ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన నిర్వహించారు. కోనసీమ జిల్లా అమలాపురంలో కూటమి నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. సాక్షి కార్యాలయం ఎదుట కొమ్మినేని, కృష్ణంరాజు చిత్రపటాలను చెప్పులతో కొట్టి, సాక్షి ప్రతులను దహనం చేశారు. తిరుపతి జిల్లా రేణిగుంట, నెల్లూరులోని సాక్షి కార్యాలయాల్లోకి మహిళలు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

Updated Date - Jun 10 , 2025 | 07:04 AM