Women Protest: జగన్ మీడియాను నిషేధించాలి
ABN , Publish Date - Jun 11 , 2025 | 04:37 AM
జగన్ మీడియా లైవ్ డిబేట్లో అమరావతి రాజధా ని మహిళల పట్ల అనుచితంగా మాట్లాడిన జర్నలిస్టు లు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులతోపాటు ఆ మీడియా యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, బీజేపీ, జనసేన మహిళా నేతలు...

వరుసగా మూడోరోజూ మహిళల ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా సాక్షి ఆఫీసుల వద్ద నిరసనలు
నియోజకవర్గాల ముఖ్య కూడళ్లలో భారీ ర్యాలీలు
పత్రిక ప్రతులు, దిష్టిబొమ్మల దహనం
పోలీసులకు ఫిర్యాదులు.. అధికారులకు వినతులు
తిరుపతిలో పెట్రోల్తో మహిళ ఆత్మహత్యాయత్నం
ఏలూరులో సాక్షి కార్యాలయంపై కోడిగుడ్లతో దాడి
‘సాక్షి’పై చర్యలు తప్పవు: కేంద్రమంత్రి భూపతిరాజు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్)
జగన్ మీడియా లైవ్ డిబేట్లో అమరావతి రాజధా ని మహిళల పట్ల అనుచితంగా మాట్లాడిన జర్నలిస్టు లు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులతోపాటు ఆ మీడియా యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, బీజేపీ, జనసేన మహిళా నేతలు, మహిళా సంఘాల కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. జగన్ మీడియా కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించారు. నియోజకవర్గాల్లోని ముఖ్యమైన కూడళ్లలో భారీ ర్యాలీలు నిర్వహించారు. జగన్ పత్రిక ప్రతులను దహనం చేశారు. జగన్ మీడియా టీవీచానల్కు, ఆ సంస్థ ప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. నెల్లూరు జిల్లా కావలి, కందుకూరు, వింజమూరు, కోవూరులలో ర్యాలీలు నిర్వహించారు. కోవూరులో తహసీల్దారు నిర్మలానందబాబాకు వినతిపత్రం సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని సాక్షి కార్యాలయం ఎదుట అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. సాక్షి నేమ్ బోర్డును మహిళలు పీకేశారు. జగన్ మీడియాను నిషేధించాలని నినాదాలు చేశారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆందోళనకారులకు మద్దతు తెలిపారు. రాజమహేంద్రవరంలో ఆజాద్ చౌక్ నుంచి దేవిచౌక్ వరకు భారీ ర్యాలీ చేశారు. తిరుపతి జిల్లా జీవకోనలో ఓ మహిళ ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా మిగిలిన మహిళలు అడ్డుకున్నారు. జగన్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. వెంకటగిరిలో కొమ్మినేని, కృష్ణంరాజు ఫొటోలను మహిళలు చెప్పులతో కొట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. గూడూరులో సాక్షి పత్రిక ప్రతులు, జగన్ ఫ్లెక్సీని దహనం చేశారు. సూళ్లూరుపేట బస్టాండు వద్ద మానవహారం నిర్వహించారు. సత్యవేడులోనూ ర్యాలీ నిర్వహించారు. విజయనగరంలోని మూడు లాంతర్లు జంక్షన్ నుంచి కన్యకాపరమేశ్వరి జంక్షన్ వరకు మహిళలు భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. రాప్తాడు నియోజకవర్గం కక్కలపల్లి కాలనీలో నరిగమ్మ గుడి నుంచి కళ్యాణదుర్గం బైపాస్ సర్కిల్ వరకు.. అనంతపురం నగరంలో క్లాక్ టవర్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీలు నిర్వహించారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి, కదిరి, పెనుకొండలో భారీ ర్యాలీలు నిర్వహించారు. జగన్, భారతి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. పుట్టపర్తిలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తి, కదిరి పోలీస్ స్టేషన్లలో, పెనుకొండ ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదులు చేశారు. ఏలూరు, కామవరపు కోట, నూజివీడుల్లో ర్యాలీలు చేశారు. మహిళలు సాక్షి కార్యాలయంలోకి కోడిగుడ్లు విసిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి చానల్పైన, జగన్, భారతి, కొమ్మినేని, కృష్ణంరాజులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్ల చొక్కాలు విప్పుతామని ఒకవైపు జగన్ వార్నింగ్ ఇస్తుంటే.. సాక్షి కార్యాలయం వద్ద మీరెలా బందోబస్తు నిర్వహిస్తారంటూ అక్కడ ఉన్న పోలీసులను ఉద్దేశించి మహిళలు వ్యాఖ్యానించారు. కడప నగరంలో సంధ్యాసర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. కలెక్టరేట్లో డీఆర్ఓ విశ్వేశ్వరనాయుడుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం సంధ్యా సర్కిల్లో సాక్షి దినపత్రికను దహనం చేశారు. జగన్, భారతి మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆ వ్యాఖ్యలు దారుణం: భూపతిరాజు
అమరావతిని వేశ్యల రాజధాని అని సాక్షి చానల్ లైవ్ డిబేట్లో వ్యాఖ్యానించడం దారుణమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. భీమవరం మండలం రాయలం గ్రామంలో మంగళవారం ఆయన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మిలతో కలిసి జగన్ పత్రిక ప్రతులను తగలబెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జర్నలిస్టు కృష్ణంరాజు, కొమ్మినేని, యాజమాన్యంపై చర్యలు తప్పవన్నారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా ఇంకా వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదని విమర్శించారు. కార్యక్రమంలో కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు.