ఆనందం వెల్లివిరిసె..
ABN , Publish Date - Jun 14 , 2025 | 11:57 PM
తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ప్రభుత్వం రూ.13వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేయడంతో ఉమ్మడి పశ్చిమ జిల్లాలోని విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తల్లికి వందనం నగదు జమతో తల్లిదండ్రుల్లో సంతోషం
తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ప్రభుత్వం రూ.13వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేయడంతో ఉమ్మడి పశ్చిమ జిల్లాలోని విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వణుదుర్రులో వెల్లివిరిసిన ఆనందం
ముదినేపల్లి : ముదినేపల్లి మండలం వణుదుర్రులో ఆనందం వెల్లివిరిసింది. ఆ గ్రామంలో 99.5శాతం విద్యార్థులకు ఈ పథకం లబ్ధి చేకూరింది. గ్రామ యూపీ పాఠశాలలో 74 మంది విద్యార్థుల తల్లిదండ్రులు తల్లికి వందనం లబ్ధి పొందేందుకు అర్హత సాధించడం విశేషం. గ్రామంలో ముగ్గురు పిల్లలు కలిగి ఉన్న ఏడు కుటుంబాల వారు ఈ పథకం లబ్ధి పొందారు. గ్రామానికి చెందిన భట్టురాజు, శ్రీవాణి కుటుంబం, చిట్టిబొమ్మల రాముడు, సీతామహలక్ష్మి కుటుంబం, గుర్రుపు శివసుబ్రమణ్యం పద్మ కుటుంబం, దారం అప్పన్న, సుకన్య కుటుంబం, ప్రత్తిపాటి అరుణ, తాడంకి సురేష్, వెంపా అచ్చయ్య కుటుంబాలకు చెందిన ముగ్గురు పిల్లల చొప్పున తల్లికి వందనం లబ్ధి చేకూరింది. ఈ లబ్ధి పొందిన వారిలో ఇద్దరు పిల్లలు కల్గిన కుటుంబాలు 22 ఉన్నాయి. గతంలో అమ్మఒడి పథకం కింద 45 శాతం పిల్లలు మాత్రమే ప్రయోజనం పొందేవారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆ గ్రామంలోని అర్హులైన వారందరికీ తల్లికి వందనం ప్రయోజనం కలిగింది.
ఒకే కుటుంబంలో నలుగురికి తల్లికి వందనం
తణుకు రూరల్ మండలం మండపాకకు చెందిన సుంకర సత్తిబాబు, దేవి దంతులకు ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు. వ్యవసాయాధారంగా జీవించే ఆ దంపతులు వారందరినీ గ్రామంలోని ప్రభుత్వ బడులలో చదివిస్తున్నారు. వీరిలో పెద్ద కుమార్తెను చదువు మాన్పించి ఇంటి పనిలో వుండగా మిగిలిన నలుగురు కుమార్తెలు ప్రభుత్వ బడుల్లో చదువుతున్నారు. సుంకర దుర్గాభవాని 9వ తరగతి, మహేశ్వరి 8వ తరగతి, యల్లారి 6వ తరగతి, రేణుక అపర్ణ 2వ తరగతి చదువుతున్నారు. వీరందరూ తల్లికి వందనం పథకానికి అర్హత సాధించడంతో ఆ నలుగురు ఆడ బిడ్డలకు సంబంధించిన తల్లి బ్యాంక్ ఖాతాలో నగదు జమ కావడంతో ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఫిర్యాదుల స్వీకరణకు మార్గదర్శకాలు ఇలా..
ఏలూరు అర్బన్ : తల్లికి వందనం ఆర్థికసాయం పథకానికి అనర్హులైన విద్యార్థుల జాబితాల్లో తమ పిల్లల పేర్లున్నాయని తల్లిదండ్రులు గ్రామ/వార్డు సచివాలయాల్లో ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో వీటిని స్వీకరించే ప్రక్రియపై డీఈవో వెంకటలక్ష్మమ్మ శనివారం మార్గదర్శకాలు విడుదల చేశారు. సంబంధిత సచివాలయ డేటా ఎంట్రీ ఆపరేటర్లు/ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సెక్రటరీలు ఎన్బీఎం పోర్టల్లో లాగిన్ అయి సర్వీస్ రిక్వెస్టులో గ్రీవెన్స్ను రైజ్ చేయాల్సి ఉంటుందన్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఆప్షన్ను అందుబాటులోకి తెచ్చారని వివరించారు. సాంకేతిక కారణాల వల్ల తాత్కాలికంగా ఇనెలిజిబుల్ (అనర్హత)గా కనిపిస్తున్న వారి వివరాలను ఆఫ్లైన్ రిజిస్టర్లో నమోదుచేయాలని ఆదేశించారు. గ్రీవెన్స్ నమోదు చేసిన తర్వాత ఆరు స్టెప్ వాలిడేషన్ ప్రక్రియద్వారా విద్యార్థి అర్హతపై స్పష్టత వస్తుందన్నారు. సంబంధిత కారణాలను పరిశీలించి, తగిన ఆధారాలతో దరఖాస్తును సమర్పించాల్సిఉంటుందని సూచించారు. ఈ ప్రక్రియను జిల్లాలోని అన్ని గ్రామ/వార్డు సచివాలయాల్లో నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. తల్లికి వందనం పథకానికి సంబందించి వచ్చే ఏ ఒక్క ఫిర్యాదును నమోదు చేయకుండా వెనక్కి పంపరాదని స్పష్టం చేశారు. ఈ పథకం అమలులో పాఠశాల విద్యాశాఖ, సచివాలయ సిబ్బంది, సంబందిత శాఖలు సమన్వయంతో పనిచేసి, పథకాన్ని విజయవంతంగా అమలుచేయాలని ఆదేశించారు. ఈ మేరకు తల్లితండ్రులకు సరైన మార్గదర్శకత్వంచేసే బాధ్యత స్థానిక డీవైఈవోలు, ఎంఈవోలపై ఉందని వివరించారు. అభ్యంతరాలు స్వీకరించే గడువు ఈనెల 20వరకు ఉందని, వాటిని పరిశీలించి, అర్హతలు కలిగిన లబ్దిదారుల అదనపు జాబితాను ఈనెల 21నుంచి 28వ తేదీవరకు జరుగుతుందని, తుదివిడత నగదు జమప్రక్రియ జూలై 5న జరుగుతుందన్నారు.
ప్రతి ఇంటిలోనూ పండుగ : మంత్రి నిమ్మల
పాలకొల్లు అర్బన్, జూన్ 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బడులు తెరిచినరోజునే తల్లికి వందనం పేరుతో ప్రభుత్వం ఎంతమంది చదువుకునేపిల్లలు ఉంటే అందరికీ రూ.13వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేయడంతో ప్రతీ ఇంటిలోనూ పండుగ వాతావరణం సంతరించు కుందని మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. పట్టణంలో జరుగుతున్న కోట్లాది రూపాయల అభివృద్ధి పనులను మంత్రి శనివారం కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్కు తల్లికి వందనంపై మాట్లాడే నైతిక అర్హత లేదని అన్నారు. ఈ పథకం కింద 67 లక్షల మంది చదువుకునే పిల్లలకు రూ.10.651 కోట్లను ప్రభుత్వం చెల్లించిందన్నారు. పాలకొల్లును రాష్ట్రంలో నంబర్ వన్గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు జీవీ, నాయకులు వల్లభు శ్రీనివాస్, తమ్మినీడి సత్యనారాయణరావు, కర్నేన గౌరునాయుడు, గాది వెంకన్న, చినమిల్లి గణపతిరావు, అధికారులు ఉన్నారు.
వలంటీర్ల అవగాహన లోపంతో పలువురికి పథకం దూరం
ఆకివీడు : నగర పంచాయతీ పరిధిలో వలంటీర్లు అవగాహన లోపంతో ఇంటి కొలతలు సక్రమంగా చేయకపోవడంతో ప్రస్తుతం లబ్ధిదారులు తల్లికి వందనం పథకానికి దూరమయ్యారని జనసేన పట్టణ అధ్యక్షుడు పిల్లా బాబులు అన్నారు. శనివారం విలేకర్లతో ఆయన మాట్లాడుతూ టెక్నికల్ ఉద్యోగులు చేయాల్సిన సర్వే వలంటీర్లతో చేయించడం వల్ల అనుభవం లేకపోవడంతో బిల్డింగ్ కాంపౌండ్ వాల్ కొలతలు కొలిచి అధికపన్నులు వేయించడం వల్ల ఈ పథకానికి అడ్డంకిగా మారడంతో లబ్ధిదారులు నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం నిబంధనల మేర బిల్డింగ్ ప్లింత్(పునాది గోడలు) ఏరియా కొలిచి దాని ప్రకారమే పన్నులు వేయాల్సి ఉందన్నారు. అందుకు విరుద్ధంగా బిల్డింగ్ చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్ కొలతలు తీయడం వల్ల కొంతమంది లబ్ధిదారులను జాబితానుంచి తొలగించారు. తప్పుడు కొలతల కారణంగా వృద్ధాప్య పింఛన్లు నష్టపోతున్నారన్నారు. ఈవిధంగా ప్రభుత్వ పథకాలను పట్టణ ప్రజలకు అందకుండా చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని విమర్శించారు. అధికారులు చేసిన తప్పిదానికి లబ్ధిదారులు నష్టపోయారని, వారందరికి న్యాయం చేయాలన్నారు.