రీసర్వే పాపం.. రైతులకు శాపం
ABN , Publish Date - Jun 15 , 2025 | 12:25 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రీసర్వే అస్తవ్యస్తం కారణంగా ఇప్పటికీ అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భూసర్వే కారణంగా ఇద్దరు నుంచి 10 మంది దాకా రైతులకు జాయింట్ ఎలీపీఎం (ల్యాండ్ పార్సిల్ మ్యాప్) నంబర్లు ఇచ్చారు.

ప్రభుత్వ పథకాలకు దూరమయ్యే పరిస్థితి
రీసర్వే తప్పులను సరిదిద్దే పనిలో అధికారులు
ఏలూరు రూరల్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రీసర్వే అస్తవ్యస్తం కారణంగా ఇప్పటికీ అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భూసర్వే కారణంగా ఇద్దరు నుంచి 10 మంది దాకా రైతులకు జాయింట్ ఎలీపీఎం (ల్యాండ్ పార్సిల్ మ్యాప్) నంబర్లు ఇచ్చారు. జాయింట్ ఎల్పీఎంలు ఉన్న రైతులకు బ్యాంకుల్లో రుణాలు ఇవ్వడం లేదు. పట్దాదారుడి పేరుపైనే పాసు పుస్తకాలు పక్కాగా ఉంటేనే బ్యాంకు రుణాలు ఇస్తున్నారు. వైసీపీ పాలనలో చేపట్టిన భూములు రీసర్వే రైతులకు శాపంగా మారింది. ప్రభుత్వ పథకాలకు దూరమయ్యే పరిస్ధితి ఏర్పడింది. ఏలూరు మండలంలో మాదేపల్లి, కోమటిలంక, పంచాయతీలలో భూముల రీసర్వే చేపట్టారు. రీసర్వే కారణంగా భూముల్లో భారీ వ్యత్యాసం వచ్చింది. దీంతో ఇద్దరు నుంచి ఐదుగురికి కలిపి పాసు పుస్తకం ఇచ్చారు. మాదేపల్లి గ్రామంలో 1,507 ఎకరాలు, కోమటిగుంట లంక గ్రామాల్లో 1,610 ఎకరాల్లో సర్వే పూర్తయింది. జాయింట్ సీల్పీసీలు రావడంతో ఇద్దరు నుంచి ఐదుగురి దాకా రైతులకు కలిసి పాసుపుస్తకాలు ఇచ్చారు. దీంతో రైతులు రీసర్వేపై అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రైతుల వద్ద ఉన్న పట్టాదారు పుస్తకానికి, రీసర్వే చేసిన తరువాత జగనన్న పేరుతో ఇచ్చిన పాస్ పుస్తకాల్లో భూ విస్తీర్ణంలో భారీ తేడాలు ఉండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాయింట్ ఎల్పీఎంలతో రైతులకు ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పెట్టుబడి సహాయ పథకాలు దూరమయ్యే పరిస్థి నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేయడంతో రీసర్వే భూములను తిరిగి సర్వే చేసి రెవెన్యూ రికార్డులను చక్కపెట్టే పనిలో అధికారులు ఉన్నారు. ఈ మేరకు రెవెన్యూ, సర్వే అధికారులు రీ సర్వేని పూర్తిచేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈనెల 30వ తేదీలోగా సర్వే పూర్తిచేయాల్సి ఉంది.