అమ్మకు.. అండగా
ABN , Publish Date - Jun 14 , 2025 | 12:42 AM
ఎంత మందిని చదివిస్తే అంతమంది తల్లులకు తెలుగుదేశం సర్కారు వంద నం వేసింది. తల్లుల ఖాతాల్లో సొమ్ములు జమ చేసిం ది.

వేలాది కుటుంబాల్లో సంబరాలు
తల్లుల ఖాతా జమ అయిన వందనం సొమ్ములు.. తొలి రోజు 30 శాతం మందికి జమ
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లావ్యాప్తంగా వేలాది కుటుంబాల్లో అంతులేని ఆనందం. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఆ రోజులు రానే వచ్చాయి. ఎంత మందిని చదివిస్తే అంతమంది తల్లులకు తెలుగుదేశం సర్కారు వంద నం వేసింది. తల్లుల ఖాతాల్లో సొమ్ములు జమ చేసిం ది. జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఎడలేని ఆనందం నింపింది. బడులు తెరిచిన రోజే తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామంటూ తన మాటను సీఎం చంద్రబాబు అక్షరాలా రుజువు చేశారు. దీంతో అన్ని చోట్ల ఎక్కడికక్కడ తమ ఖాతాలను సరి చూసుకు న్నారు. కొందరు ఆనందంతో పొంగిపోతే, ఇంకొందరు నిరాశ చెందారు. సంబంధిత శాఖాధికారులు మాత్రం అయోమయానికి గురవుతున్న తల్లులకు వివరణ ఇచ్చేందుకు సిద్ధం కాలేకపోయారు. ‘తల్లికి వందనం’ పథకం సొమ్ములు తల్లుల బ్యాంకు ఖాతాల్లో శుక్రవా రం నుంచి జమ చేస్తుండడంతో ఆనందం నెలకొంది. ఒక కుటుంబంలో ఒకరు ఉంటే రూ.13 వేలు, ఇద్దరు వుంటే రూ.26 వేలు, ముగ్గురు ఉంటే రూ.39 వేలు, నలుగురుంటే రూ.52 వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో పడుతున్నాయి. పెద్ద మొత్తంలో సొమ్ములు జమ అవుతుండడంతో విద్యార్థుల్లోనూ, తల్లిదండ్రుల్లోను ఆనందానికి అవధులు లేవు. గత ప్రభుత్వ హయాం లో అమ్మ ఒడి కోసం తల్లిదండ్రుల నుంచి ఆధార్, బ్యాంకు ఖాతాల నమోదు వంటి వివరాలను విద్యాసంస్థల్లో సేకరించేవారు. ఈసారి అటువంటి సమాచార సేకరణ లేకపోవడంతో తల్లికి వందనంపై తల్లిదండ్రులు ఒకింత అయోమయానికి లోనయ్యారు. ప్రభుత్వం మాత్రం వార్డు, గ్రామ సచివాలయ సిబ్బందితో ఇటీవల జియోట్యాగింగ్ నిర్వహించింది. తల్లిదండ్రులు, విద్యార్థుల వివరాలను పొందుపరిచింది. ఆ సమాచారం ఆధారంగానే ప్రభుత్వం అర్హుల జాబితాను నిర్ధారించింది. అర్హుల జాబితాను ప్రకటించింది. తదనుగుణంగా తల్లుల ఖాతాలో సొమ్ములు జమ అవుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 1,76,574 మంది విద్యార్థులను అర్హులుగా గుర్తిస్తే శుక్రవారం 30 శాతం మందికి అంటే 51 వేల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో సొమ్ములు జమ అయ్యాయి. చాలా కుటుంబాలు ప్రభుత్వానికి కృతజ్ఞతగా పాలాభిషేకాలు నిర్వహిస్తున్నారు.
1120 మంది తల్లుల డేటాను అప్డేట్ చేయండి
తల్లికి వందనం ఆర్థికసాయం పథకానికి సాం కేతిక సమస్యల వల్ల అనర్హుల జాబితాలోవున్న 1120 మంది తల్లుల జాబితాను ప్రభుత్వం శుక్రవారం జిల్లా విద్యాశాఖకు పంపింది. వీరి ఆధార్, ఫోన్ నంబర్లలో అస్పష్టత వల్ల నగదు జమ చేయడానికి ఆటంకంగా ఉందని పేర్కొంది. శనివారం మధ్యా హ్నంలోగా వీటిని అప్డేట్ చేయాలని ఆదేశించింది.