ముప్పుటేరు
ABN , Publish Date - Jun 14 , 2025 | 11:59 PM
ఎన్నో ఏళ్ల నుంచి ఇసుక మేటలు, పూడికతో ఉప్పుటేరు ప్రవాహం మందగించింది.

కబ్జా కోరల్లో ఉప్పుటేరు.. కొల్లేటికి పెనుముప్పు
రూ.9 కోట్లతో డ్రెడ్జింగ్కు ప్రభుత్వం కసరత్తు
పరీవాహక ప్రాంతాలకు ఉప్పు నీటి సమస్య
ఆందోళనలో రైతాంగం
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ఆకివీడు, భీమవరం రూరల్, మొగల్తూరు మండలాల సాగు భూమి మురు గునీరు ఉప్పుటేరులోకి ప్రవహిస్తుంది. ఆక్రమ ణలకు గురికావడంతో అధిక వర్షాలు కురిస్తే జిల్లాలోని మూడు మండలాల శివారు ప్రాంత సాగు భూములు దెబ్బ తింటున్నాయి. ప్రధా నంగా ఆక్వా చెరువులు ముంపు బారిన పడు తున్నాయి. ఇటీవల ఇరిగేషన్ అధికారులు దీనిపై దృష్టి పెట్టారు. ప్రక్షాళన చేయాలను కున్నా ఆక్రమణలపై ఏమీ చేయలేకపోతు న్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ఇసుక మేటలు, పూడికతో ఉప్పుటేరు ప్రవాహం మందగించింది. డ్రెడ్జింగ్ ప్రతిపాదనలు పడకేశాయి. గత ప్రభు త్వం దీనిని పట్టించుకోలేదు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రెడ్జింగ్ కోసం రూ.9 కోట్లు మంజూరుచేశారు. ఫలితం గా నీటి ప్రవాహ వేగం పెరగనుంది. కొల్లేరుకు వరదలు వచ్చినప్పుడు ఎగువ ప్రాంతాలు, పరిసర గ్రామాలు ముంపుబారిన పడకుండా ఉండేందుకు కాస్తయినా దోహదపడుతుంది. అయితే ఇప్పుడు సర్వే నిర్వహించి కబ్జాలు తొల గిస్తే ఉప్పుటేరు వెడల్పు అవుతుంది. కృష్ణా, పశ్చిమ జిల్లాల పరిధిలోని పరివాహక మం డలాల సాగు భూములకు రక్షణ ఉంటుంది. కొల్లేరు ముంపు భయం తొలగుతుంది. ఆ దిశగా అధికారులు కసరత్తు చేయాలి.
నిధులు అంతంతే
వాస్తవానికి కూటమి ప్రభుత్వం కేటాయిం చిన రూ.9 కోట్లు సరిపోవు. పూర్తి డ్రెడ్జింగ్కు రూ.30 కోట్లు అవసరం. ఈ మొత్తంతో పనులు చేస్తేనే ఉప్పుటేరులో కొన్నేళ్లపాటు నీటి ప్రవా హం సవ్యంగా సాగుతుంది. గత ఖరీఫ్లో అధిక వర్షాలకు ఆకివీడు మండలంలో సాగు భూములు ముంపుబారిన పడ్డాయి.
ఉప్పుకయ్య
కొల్లేరు ప్రవాహం నిలిచిపోయిన సందర్భంలో ఉప్పుటేరు నుంచి సముద్రపు నీరు ఎగదన్నుతోంది. దీనివల్ల పరిసర ప్రాంత భూములు, కొల్లేరు సరస్సుకు ఉప్పు సమస్య వెంటాడుతోంది. మరోవైపు కొల్లేరు ఎగువ ప్రాంతంలో రొయ్యల సాగు చేస్తున్నారు. గతంలో చేపల సాగు ఉండేది. అంతకు ముందు వరి సాగుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. తరచూ కొల్లేరు నుంచి ఉప్పుటేరు మీదుగా ప్రవాహం లేకపోవడంతో ఎగువ ప్రాంతాలు ముంపుబారిన పడుతూ వస్తున్నాయి. వరి చేలు దెబ్బ తింటున్నాయి. వానా కాలంలో రైతులు పంటను కోల్పోతున్నారు. దీంతో చేపల చెరువు సాగుకు రైతులు మొగ్గు చూపారు. ఇటీవల కాలంలో కొల్లేరు ఎగువ ప్రాంత రైతులు రొయ్య సాగుకు ఆసక్తి చూపుతున్నారు. వేలాది ఎకరాల్లో రొయ్య సాగు విస్తరించింది. ఫలితంగా ఉప్పునీరు కొల్లేటిలోకి చేరుతోంది. ఇలా సముద్రం నుంచి ఒకవైపు, ఎగువ ప్రాంతాల నుంచి మరోవైపు ఉప్పునీరు కొల్లేరు సరస్సులోకి చేరుతోంది. ఇది భవిష్యత్తులో సరస్సుకు ప్రమాదం తేనుందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు.
రెగ్యులేటర్లే ప్రాధాన్యం
కొల్లేరు సరస్సు భవిష్యత్తులో ఉప్పుకయ్యగా మారకుండా ఉండాలంటే ఉప్పుటేరుపై రెగ్యులేటర్లు నిర్మించాలి. కొల్లేరులో అవసరమైనప్పుడు నీటిని నిల్వ చేసుకోవడానికి దంపగడప వద్ద రెగ్యులేటర్ ఏర్పాటుచేయాలి. ఉప్పుటేరులోకి సముద్రపు నీరు ఎగదన్నకుండా ముఖద్వారం మోళ్లపర్రు వద్ద మరో రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలి. ఉప్పుటేరు మధ్యభాగంలోనూ మరో రెగ్యులేటర్ నిర్మాణం చేపడితే యనమదుర్రు డ్రెయిన్లలోకి ఉప్పుటేరు నుంచి ఉప్పు నీరు ఎగదన్నకుండా ఉంటుంది. వైసీపీ హయాంలో మూడు రెగ్యులేటర్లను నిర్మించనున్నట్టు హడావిడి చేశారు. మోళ్లపర్రు వద్ద రెగ్యులేటర్కు జగన్ శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్లు టెండర్లు వేయలేదు. అవన్నీ ఇప్పుడు రద్దయ్యాయి. కొత్తగా మళ్లీ ప్రతిపాదనలు చేస్తేనే ఉప్పుటేరుపై రెగ్యులేటర్ల నిర్మాణం సాధ్యపడుతుంది. కొల్లేరు సరస్సుతోపాటు, ఉప్పుటేరు పరివాహక ప్రాంతాలు సురక్షితంగా ఉంటాయి.