Share News

లెక్క తేలింది

ABN , Publish Date - Aug 02 , 2025 | 12:46 AM

పెయ్యేరు పంచా యతీలో గత మూడేళ్లలో పంచాయతీ నిధులు రూ.37.59 లక్షలు దుర్వినియోగం జరిగినట్టు పంచాయతీ శాఖ అధి కారులు లెక్క తేల్చారు.

 లెక్క తేలింది

పెయ్యేరు పంచాయతీలో రూ.37.59 లక్షల నిధుల దుర్వినియోగం

ముదినేపల్లి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): పెయ్యేరు పంచా యతీలో గత మూడేళ్లలో పంచాయతీ నిధులు రూ.37.59 లక్షలు దుర్వినియోగం జరిగినట్టు పంచాయతీ శాఖ అధి కారులు లెక్క తేల్చారు. గతంలో నిధుల దుర్వినియోగంపై గ్రామస్థులు కొందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం, హైకోర్టులో విచారణ కోరుతూ రిట్‌ దాఖలు చేసిన పరిస్థితుల్లో అప్పటి డివిజనల్‌ పంచాయతీ అధికారి చంద్రశేఖర్‌ విచారణ జరిపా రు. నిధుల వినియోగం, పరిపాలన పరమైన అంశాల్లో పలు అవకతవకలు చోటు చేసుకోవడం, పంచాయతీ ఆదాయాన్ని రికార్డుల్లో నమోదు చేయకపోవడం వంటి అంశాలను నిర్ధారిం చారు. పంచాయతీ ఆడిట్‌ రిపోర్టులను పరిశీలించిన అనంతరం అప్పటి డీఎల్‌పీవో ఇచ్చిన విచారణ నివేదిక ఆధారంగా 2021 –22 నుంచి 2023–24 వరకు రూ.37.59 లక్ష లు పంచాయతీ నిధులు దుర్వినియోగం జరిగినట్టు ధ్రువీక రిస్తూ డీపీవో అనురాధ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ మేరకు అప్పటి పంచాయతీ కార్యదర్శి శ్యామ్‌ సుందర్‌ను రూ.32.02 లక్షలకు, సర్పంచ్‌ సుశీలను రూ.5.56 లక్షలకు బాధ్యులను చేస్తూ డీపీవో ఉత్తర్వులు జారీ చేశారని డిప్యూటీ ఎంపీడీవో అశోక్‌ తెలిపారు.

ఆడిట్‌ రిపోర్టులపై చర్యలేవి ?

పెయ్యేరు పంచాయతీకి సంబంధించి పరిపాలన అంశాలు, నిధుల వినియోగం, రికార్డుల నిర్వహణలో అవకతవకలకు సంబంధించి ఆడిట్‌ నివేదికల్లో పంచాయతీ అధికారులు తప్పులు ఉన్నాయని పేర్కొన్నప్పటికీ ఉన్నతాధికారులు ఏ చర్యలు తీసుకోలేదు. 2021 జూలై నుంచి 2023 జూన్‌ నెలాఖరు వరకు ఏటా పంచాయతీలో జరిగిన అవకతవకలు, ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని అప్పట్లో విచారణాధికారిగా వ్యవహరించిన డీఎల్‌పీవో స్పష్టంగా పేర్కొనగా, అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఏటా ఆడిట్‌ రిపోర్టును పరిశీలించి జరిగిన అవకతవకలపై జిల్లా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదన్నది ప్రశ్నార్థకంగా ఉంది.

నిధుల దుర్వినియోగంపై రీ ఎంక్వైరీ

పెయ్యేరు పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఆ గ్రామస్థులు రెడ్డి వెంకటేశ్వరరావు, అల్లా భక్షు, దూబా చంద్రకాంత్‌ కొత్తగా చేసిన ఫిర్యాదులపై ఈ నెల 4న ఏలూరు ఇన్‌చార్జ్‌ డీఎల్‌పివో లక్ష్మీ తిరిగి విచారణ జరపనున్నట్టు డిప్యూటీ ఎంపీడీవో అశోక్‌ తెలిపారు. ఈ విచారణలో 2021–22 నుంచి 2023–24 వరకు పంచాయతీ నిధులు వినియోగం, రికార్డుల నిర్వహణపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తారని తెలిపారు.

– అశోక్‌, డిప్యూటీ ఎంపీడీవో

Updated Date - Aug 02 , 2025 | 12:46 AM