Share News

‘నీట్‌’లో మెరిశారు

ABN , Publish Date - Jun 14 , 2025 | 11:56 PM

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. పలువురు విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు.

‘నీట్‌’లో మెరిశారు
మర్రాపు జయదీవ్‌ , జాగరపు సహజ, పల్లి తారాచంద్ర ,మిత్తిరెడ్డి ప్రవల్లిక

- జిల్లా విద్యార్థులకు మంచి ర్యాంకులు

బొబ్బిలి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. పలువురు విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. బొబ్బిలి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి పట్టణంలోని మెహెర్‌కాలనీకి చెందిన మర్రాపు జయదీప్‌ ఆలిండియా స్థాయిలో 672 ర్యాంకు సాధించాడు. విజయవాడ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదివిన జయదీప్‌ నీట్‌లో 613 మార్కులతో 672 ర్యాంకును సాధించాడు. ఓబీసీ కేటగిరిలో 183 ర్యాంకు వచ్చింది. జయదీప్‌ తండ్రి రామకృష్ణ ఇటీవల అజ్జాడ జిల్లా పరిషత్‌ హైస్కూలు హెచ్‌ఎంగా పదోన్నతి పొందారు. తల్లి శోభారాణి తామరఖండిలో ప్రభుత్వ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. ఎంబీబీఎస్‌ తరువాత పీజీలో ఏదైనా స్పెషలైజేషన్‌ చేసి మంచి వైద్యునిగా గుర్తింపు పొందాలన్నది తన ఆశయమని జయదీప్‌ తెలిపారు.

===========

989 ర్యాంకు పొందిన సహజ

జామి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జన్నివలస గ్రామానికి చెందిన జాగరపు సహజ ఆలిండయా స్థాయిలో 989 ర్యాంకు సాధించింది. ఓబీసీ విభాగంలో 294 ర్యాంకు పొందింది. సహాజ తండ్రి ఈశ్వరరావు మండలంలోని యాతపాలెం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నారు. తల్లి రాధ ఎస్‌.కోట మండలం ముషిడిపల్లిలో ఉపాధి హామీ పథకం టెక్నికల్‌ ఆసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. కుమార్తె ప్రతిభపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

==============

1791 ర్యాంకు సాధించిన తారాచంద్ర

రాజాం, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): రాజాం పట్టణానికి చెందిన పల్లి తారచంద్ర ఆలిండియా స్థాయిలో 1791 ర్యాంకు సాధించాడు. తారాచంద్ర 10వ తరగతి వరకు స్థానిక డీఏవీ స్కూల్‌లో, ఇంటర్మీడియట్‌(సీబీఎస్‌ఈ) విశాఖపట్నం శ్రీచైతన్య కళాశాలలో చదివాడు. తండ్రి రాజాం జీఎంఆర్‌ వరలక్ష్మి ఫౌండేషన్‌లో సాధారణ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. తల్లి గృహిణి. డాక్టర్‌ కావాలనే లక్ష్యంతో పట్టుదలగా చదివినట్లు తారాచంద్ర తెలిపాడు

=====================

ప్రవల్లికకు 6,788 ర్యాంకు..

మెరకముడిదాం, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చిన్న బంటుపల్లి గ్రామానికి చెందిన మిత్తిరెడ్డి ప్రవల్లిక ఆలిండియా స్థాయిలో 6,788 ర్యాంకు, ఓబీసీ కేటగిరిలో 2,742 ర్యాంకు సాధించింది. ఇటీవల ఎంసెట్‌ ఫలితాల్లో 194 ర్యాంకు పొందింది. ఇంటర్‌ సీబీఎస్‌ఈలో 500 మార్కులకు 476 సాధించింది. తన కుమార్తె మొదటి ప్రయత్నంలోనే నీట్‌లో మంచి ర్యాంకు సాధించిందని, ప్రవల్లిక తల్లిదండ్రులు గౌరినాయుడు, సుమలత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 14 , 2025 | 11:56 PM