చినుకు పడితే పవర్ కట్!
ABN , Publish Date - Jun 14 , 2025 | 11:57 PM
గత నెల 21న ఉమ్మడి జిల్లాలోని సాలూరు అల్లువీధి రామమందిరంలో విద్యుత్ ఏడీఈ రంగారావును స్థానికులు నిర్బంధించారు.

- జిల్లాలో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం
- ఈఎల్ఆర్ లేదంటున్న అధికారులు
- క్షేత్రస్థాయిలో మాత్రం ఎప్పటికప్పుడు నిలిపివేత
- తరచూ సాంకేతిక సమస్యలు
- ప్రజలకు తప్పని ఇబ్బందులు
- గత నెల 21న ఉమ్మడి జిల్లాలోని సాలూరు అల్లువీధి రామమందిరంలో విద్యుత్ ఏడీఈ రంగారావును స్థానికులు నిర్బంధించారు. అల్లువీధితో పాటు అక్కేన వీధి, నాయుడువీధి, దుగ్గాణ వీధులకు మూడు రోజుల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. పెద్ద సంఖ్యలో జాతీయ రహదారిపైకి వచ్చి కొవ్వొత్తులతో ధర్నా నిర్వహించారు. చిన్నపాటి వర్షం పడినా.. ఈదురుగాలులు వీచినా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశీలన కోసం అక్కడకు వెళ్లిన ఏడీఈని స్థానికులు నిర్బంధించారు.
రాజాం, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అనధికార విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయి. రాత్రీ పగలూ అన్న తేడా లేకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. అధికారులు మాత్రం విద్యుత్ కోతలు లేవని చెబుతున్నారు. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. చిన్నపాటి వర్షం పడినా.. ఈదురుగాలులు వీచినా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తు న్నారు. మారుమూల గ్రామాలకు అయితే గంటల తరబడి విద్యుత్ కోత విధిస్తున్నారు. దీంతో ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతం.
తీగలు భయపెడుతున్నాయి..
ప్రస్తుతం పొలాలతో పాటు రోడ్ల వెంబడి ఉన్న హైటెన్షన్ తీగలు భయపెడుతున్నాయి. చాలావరకూ స్తంభాలకు సపోర్టింగ్ వైర్లు లేక ఒక వైపువేలాడుతున్నాయి. ప్రస్తుతం ఈదురుగాలులు వీస్తుండడంతో ఎప్పుడు కూలిపోతాయో తెలియని స్థితిలోకి మారాయి. వాప్తవానికి హైటెన్సన్ విద్యుత్ లైన్లకు సంబంధించి స్తంభాల మధ్య 50 మీటర్ల నిడివి ఉండాలి. కానీ, ఈ నిబంధన పాటించలేదు. ప్రతీ స్తంభం 4 అడుగుల లోతులో పాతాలి. సమపాళ్లలో కాంక్రీట్ వేసి బలోపేతం చేయాలి. కానీ అప్పట్లో కాంక్రీట్ వేయలేదు. స్తంభం విడిచి స్తంభానికి సపోర్టింగ్ వైరు వేయాలి. అలాగే ఫీజు బాక్సు, సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుచేసిన స్తంభానికి సపోర్టుగా మరో స్తంభాన్ని అడ్డంగా ఏర్పాటుచేయాలి. కానీ ఇవేవీ చేయలేదు. దీంతో ఎక్కడికక్కడే స్తంభాలు గాల్లో వేలాడుతున్నాయి. ప్రమాదకరంగా మారుతున్నాయి. దీంతో రహదారులపై ప్రయాణించే వారు, వాహన చోదకులు భయపడిపోతున్నారు.
ఇదీ పరిస్థితి
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 15 ఏజెన్సీ మండలాలు ఉన్నాయి. కేటగిరీ-1 విద్యుత్ కనెక్షన్లు 6,71,921, కేటగిరీ-2కు సంబంధించి 68,398, కేటగిరీ-3కి సంబంధించి 2,754 కనెక్షన్లతో పాటు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 26,968 ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 1600 వరకూ రెవెన్యూ గ్రామాలు ఉండగా దాదాపు 300 మంది వరకూ మాత్రమే సిబ్బంది ఉన్నారు. వర్షాకాలం, ఈదురుగాలుల సమయంలో సిబ్బందిపడే బాధలు వర్ణనాతీతం. దీనికి తోడు దశాబ్దాలు కిందట వేసిన స్తంభాలు, విద్యుత్ లైన్లు ఎప్పటికప్పుడు పాడవుతున్నాయి. వాటిని సరిచేయాల్సిన ప్రభుత్వం మిన్నకుండాపోతోంది. అటు ట్రాన్స్ఫార్మర్లను సైతం ఏళ్లతరబడి మార్చడం లేదు. దీంతో తరచూ మొరాయిస్తున్నాయి. జిల్లా విభజనలో భాగంగా పార్వతీపురం డివిజన్ పోయినా కొత్తగా శ్రీకాకుళం జిల్లా నుంచి రాజాం డివిజన్ చేరింది.
చాలీచాలని సిబ్బంది
ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఏడీలు 21 మంది ఉన్నారు. ఏఈలు 67 మందికిగాను 51 మంది, లైన్మెన్లు 172కు 152 మంది, అసిస్టెంట్ లైన్మెన్లు 200 మందికిగాను 140 మంది, జూనియర్ లైన్మెన్లు 222 మందికిగాను కేవలం 22 మంది మాత్రమే ఉన్నారు. సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్లు 556 మంది ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఒక్కో మండలంలో 50కు మించి రెవెన్యూ గ్రామాలు ఉంటాయి. కానీ ఉండేది నలుగురు లైన్మెన్లు మాత్రమే. కొత్త విద్యుత్ కనెక్షన్లు, మొండిబకాయిల వసూలు, విద్యుత్ మరమ్మతుర పనుల్లో పనిభారం ఎదుర్కొంటున్నారు.
సమస్యలు పరిష్కరిస్తున్నాం
జిల్లాలో విద్యుత్ సమస్యలు లేకుండా చూస్తున్నాం. సిబ్బంది కొరత మాట వాస్తవమే. అయినా ఉన్న సిబ్బందితో పనిచేయిస్తున్నాం. ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. వర్షాకాలం కావడంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అటు గ్రామాల్లో ఎనర్జీ అసిస్టెంట్లు సైతం మంచి సేవలు అందిస్తున్నారు.
-లక్ష్మణరావు, ఎస్ఈ, విద్యుత్ శాఖ, విజయనగరం