Share News

Dad is a Hero Forever నాన్న ఎప్పటికీ హీరోనే..

ABN , Publish Date - Jun 14 , 2025 | 11:53 PM

Dad is a Hero Forever నాన్నంటే కొండంత అండ.. ఎంతటి కష్టంలోనైనా నేనున్నానంటూ నిలిచే ధైర్యం. భవిష్యత్‌కు భరోసా.. అడుగడుగునా మన వెంట ఉంటూ చేయూతనిచ్చే మార్గదర్శి. పిల్లల ఉన్నతి కోసం పరితపించే నిరంతర శ్రమజీవి. ఆయన త్యాగం, సహనం వెలకట్టలేనిది. అందుకే పితృదేవోభవ అంటారు.

Dad is a Hero Forever  నాన్న ఎప్పటికీ హీరోనే..
భామిని: భార్యాపిల్లలతో చెల్లంనాయుడు

  • ఆయనే మొదటి గురువు, స్నేహితుడు

  • నేడు ఫాదర్స్‌ డే

నాన్నంటే కొండంత అండ.. ఎంతటి కష్టంలోనైనా నేనున్నానంటూ నిలిచే ధైర్యం. భవిష్యత్‌కు భరోసా.. అడుగడుగునా మన వెంట ఉంటూ చేయూతనిచ్చే మార్గదర్శి. పిల్లల ఉన్నతి కోసం పరితపించే నిరంతర శ్రమజీవి. ఆయన త్యాగం, సహనం వెలకట్టలేనిది. అందుకే పితృదేవోభవ అంటారు. ఎవరికైనా నాన్నే రియల్‌ హీరో. మనకు ప్రపంచాన్ని పరిచయం చేసేది తండ్రి. మొదటి గురువు, తొలి స్నేహితుడు కూడా నాన్నే. పిల్లలను జీవితాంతం గుండెల్లో పెట్టుకొని భరించే వాడు తండ్రి. నాన్న రెండు అక్షరాలే అయినా.. నిస్వార్థమైన ప్రేమకు, ఆత్మీయతకు అది ప్రతిరూపం. ఆ పిలుపులో అంతకు మించిన భావోద్వేగం ఉంది. నాన్న కోపంగా ఉన్నా.. కఠినంగా ఉన్నా.. ఒక దెబ్బకొట్టి శిక్షించినా.. ఆయన గుండెల నిండా ఉంటారు పిల్లలు. తండ్రి ఆలోచన అంతా పిల్లల భవిష్యత్‌ కోసమే పరితపిస్తుం టుంది. ఎదిగే బిడ్డలను చూసి ఆనందంగా పొంగిపోతాడు. పది మందికి చెబుతూ మురిసిపోతాడు. బిడ్డల విజయాన్ని తన విజయంగా చెబుతుంటాడు. అందుకే నాన్న ఎప్పటికీ మన హీరోనే. నేడు ఫాదర్స్‌ డే సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ కథనం.

పిల్లలను ఉన్నతంగా చదివించి..

భామిని, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): భామినికి చెందిన గురుబిల్లి చెల్లంనాయుడు రైతు. ఆయనకు నలుగురు పిల్లలు. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. వారిని ఉన్నత చదువులు చదివించాలనుకున్నారు. అయితే భామినిలో ఆ సదుపాయాలు లేవు. ఆ గ్రామం నుంచి పిల్లలను ఎలాగైనా బయటకు తెచ్చి ఉన్నత చదువులు చదివించాలనుకున్నారు. దీంతో రెండు దశాబ్దాల కిందట పిల్లలను శ్రీకాకుళానికి పంపించారు. ఓ చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని వారికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. మరోవైపు వ్యవసాయం చూసుకుంటూ.. దానిలో వచ్చిన ఆదాయంతోనే పిల్లలతో పీజీ, పీహెచ్‌డీలు చేయించారు. అప్పట్లో ప్రభుత్వ ఆర్థికసాయం, ప్రోత్సాహం లేదు. అంతేకాకుండా ఊరు దాటించి అమ్మాయిలను చదివిపించడమంటే గగనంగా ఉండేది. అయినా తమ పిల్లలు ప్రయోజకులు కావాలని భావించి ఉన్నతంగా చదివించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఆయన పెద్ద కుమార్తె కవిత ఎంఎస్‌సీ బీఈడీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఒడిశాలోని ఆశ్రమ పాఠశాలలో వార్డెన్‌గా పనిచేస్తున్నారు. కుమారుడు కిరణ్‌కుమార్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేసి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల అంబేడ్కర్‌ వర్సిటీలో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. మరో కుమారుడు ప్రసాద్‌ సాఫ్ట్‌వేర్‌గా బెంగళూరులో పనిచేస్తున్నారు. చిన్న కుమార్తె రూప ఎంసీఏ పూర్తి చేసి శ్రీకాకుళం ఓ విద్యా సంస్థలో ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారు. అప్పట్లో వ్యవసాయం కుటుంబంలో ఎవరూ చదువుపై ఆసక్తి చూపేవారు కాదు. కానీ మా నలుగురిని చదివించిన తండ్రి చెల్లంనాయుడుకు వారు థ్యాంక్స్‌ చెబుతున్నారు.

Updated Date - Jun 14 , 2025 | 11:53 PM