Share News

Workers Strike: ఉధృతంగా మారిన విశాఖ ఉక్కు కార్మికుల సమ్మె

ABN , Publish Date - May 27 , 2025 | 11:09 AM

Steel Plant Workers Strike: తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఉక్కు కర్మాగారం కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన నిరావధిక సమ్మె మంగళవారం ఉధృతంగా మారింది. అడ్మిన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కార్మికులు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో కార్మికుల నాయకుడు భాస్కర్‌‌ అస్వస్థతకు గురయ్యారు.

Workers Strike: ఉధృతంగా మారిన విశాఖ ఉక్కు కార్మికుల సమ్మె
Steel Plant Workers Strike

విశాఖ: ఉక్కు ప్రైవేటీకరణ (steel plant privatization) నిలుపుదల చేయాలని, తొలగించిన కాంట్రాక్టు కార్మికులను (contract workers) వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉక్కు కర్మాగారం కాంట్రాక్టు కార్మికుల నిరావధిక సమ్మె (strike) మంగళవారం ఉధృతంగా మారింది. గత వారం రోజులుగా విధులు బహిష్కరించి సమ్మె నిర్వహిస్తున్న ఉక్కు కాంట్రాక్టు కార్మికులు ఈ రోజు ఉదయం ఉక్కు అడ్మిన్ భవనం (Admin Building) ముట్టడికి యత్నించారు. వందలాదిమంది ఉక్కు కాంట్రాక్టు కార్మికులు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడికి ప్రయత్నం చేయడంతో పోలీసులు (Police) అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులు.. పోలీసులకు మధ్య తోపులాట జరిగడంతో కార్మికుల నాయకుడు భాస్కర్‌‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతనిని ఆస్పత్రికి తరలించారు.


ఆ ఉత్తర్వులు ఏ క్షణంలోనైనా బయటకు..

కాగా విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం కార్మికులను రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తోంది. ప్లాంటులో మొత్తం 13,250 మంది కాంట్రాక్టు కార్మికులు ఉండగా, వారిలో 33 శాతం మందిని తొలగించాలని యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఏప్రిల్‌ నెలలో 1,731 మందిని తొలగించింది. కాంట్రాక్టు కాలం పూర్తయిన మరో వేయి మందికి గేట్‌ పాస్‌లు ఇవ్వకుండా గాలిలో ఉంచింది. మరో రెండు వేల మంది తీసేయడానికి ఏర్పాట్లు చేసుకుంది. దీనిని వ్యతిరేకిస్తూ కాంట్రాక్టు కార్మికులు ఈ నెల 20వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. అయితే యాజమాన్యం ఏదో ఒక కారణం చూపించి తమను తొలగించడానికి చూస్తున్నదని తెలుసుకున్న చాలామంది సమ్మెలో పాల్గొనకుండా విధులకు వెళుతున్నారు. 25 నుంచి 30 శాతం మంది మాత్రమే సమ్మె చేస్తున్నారు. దీంతో ఉత్పత్తి తగ్గింది. ప్రతిరోజు రెండు బ్లాస్ట్‌ ఫర్నేస్‌ల ద్వారా 14 వేల టన్నుల హాట్‌ మెటల్‌ తయారవుతుండగా, శనివారం ఇది పది వేల టన్నులకు పడిపోయింది. కాంట్రాక్టు కార్మికుల సమ్మె ప్రభావం కనిపించకూడదని యాజమాన్యం ఇతర శాశ్వత ఉద్యోగులకు ఆఫీసర్లతో సహా 8 గంటలకు బదులు 12 గంటలు విధులు నిర్వహించాలని ఆదేశించి, షిఫ్టులు వేస్తోంది. అయితే కాంట్రాక్టు కార్మికుల పనులను అధికారులు చేయలేకపోవడంతో ఉత్పత్తి తగ్గుముఖం పడుతోంది. దీనిని భరించలేని యాజమాన్యం సోమవారం రాత్రి మరో 1,480 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తూ ఉత్తర్వులు తయారు చేసింది. అవి ఏ క్షణంలోనైనా బయటకు వచ్చే అవకాశం ఉంది. వారిలో గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న వారితో పాటు వారికి నాయకత్వం వహిస్తున్న కార్మిక సంఘ నాయకులు కూడా ఉన్నారని తెలిసింది. దీంతో వారు మంగళవారం అడ్మిన్‌ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఇది ఉద్రిక్తంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అవసరమైన పోలీసు బందోబస్తును యాజమాన్యం సమకూర్చుకుంది.

Also Read: నమ్మించి మోసం.. యువతి ఏం చేసిందంటే..


చర్చలు విఫలం

గత నెలలో కాంట్రాక్టు కార్మికులను తొలగించినపుడు పెద్దఎత్తున ఆందోళన చేశారు. యాజ మాన్యంతో చర్చలు జరిగాయి. మే నెల 20వ తేదీ వరకు కార్మికులను తొలగించబోమని స్పష్టమైన హామీ ఇచ్చింది. ఆ తరువాత తొలగింపునకు చర్యలు చేపట్టడంతో వారు సమ్మెకు దిగారు. తాజాగా సోమవారం నగరంలో కార్మిక శాఖ అధికారుల వద్ద ఇరు వర్గాలకు చర్చలు జరిగాయి. ఇలా చర్చలు జరిగేటప్పుడు జనరల్‌ మేనేజర్‌ స్థాయి అధికారి హాజరవుతారు. సోమవారం మాత్రం మేనేజర్‌ స్థాయి కలిగిన జూనియర్‌ అధికారిని యాజమాన్యం పంపించింది. యాజమాన్యాన్ని ఒప్పించే స్థాయి ఆ అధికారికి లేదని గుర్తించిన కార్మిక శాఖాధికారి...ఆయనను వెనక్కి పంపించేశారు. దాంతో చర్చలు విఫలమయ్యాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

మరో కీలక సూత్రధారి కోసం పోలీసుల వేట..

అదే నా ఆశ… ఆకాంక్ష..సీఎం చంద్రబాబు

For More AP News and Telugu News

Updated Date - May 27 , 2025 | 11:09 AM