Share News

తల్లుల్లో ఆనందోత్సాహాలు

ABN , Publish Date - Jun 14 , 2025 | 01:31 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం డబ్బులు గురువారం సాయంత్రం నుంచే తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి.

తల్లుల్లో ఆనందోత్సాహాలు

  • బ్యాంకు ఖాతాల్లోకి ‘తల్లికి వందనం’ డబ్బులు జమ

  • కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ పథకం వర్తింపు

  • ముగ్గురు పిల్లలుంటే రూ.39 వేలు, నలుగురుంటే రూ.52 వేలు, ఐదుగురైతే రూ.65 వేలు..

  • ఖాతాల్లో డబ్బులు పడినట్టు మెసేజ్‌లు రావడంతో ఉబ్బితబ్బిబ్బు

  • మిగిలిన రూ.2 వేలు పాఠశాలల నిర్వహణకు కలెక్టర్‌ ఖాతాలో జమ

  • జాబితాల్లో పేర్లు లేని అర్హులకు మరోసారి అవకాశం

  • జిల్లాలో 1,90,433 మంది అర్హులు, సుమారు రూ.245 కోట్లు చెల్లింపు

  • ఒకటి, ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు త్వరలో సొమ్ములు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం డబ్బులు గురువారం సాయంత్రం నుంచే తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. రెండో తరగతి నుంచి పదో తరగతి వరకూ, ఇంటర్‌ రెండో ఏడాది చదువుతున్న పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికీ నగదు జమ అవుతున్నది. దీంతో తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నిరుపేద కుటుంబాల్లో పిల్లల చదువును ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతి బిడ్డకు ఏటా రూ.15 వేల చొప్పున సాయం అందిస్తామని గత ఎన్నికల ముందు కూటమి నేతలు ప్రకటించడమే కాకుండా ‘సూపర్‌ సిక్స్‌’లో చేర్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన హామీని ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్టు ప్రభుత్వం గతంలోనే వెల్లడించింది. ఈ పథకం పేరును ‘తల్లికి వందనం’ అని ప్రకటించింది. గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు, ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల్లో ఈ పథకానికి అర్హులైన వారి జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించారు. ఇదే రోజున ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జిల్లాలో 1,90,433 మంది విద్యార్థులకు సంబంధించి 1,30,706 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.245 కోట్లు జమ కానున్నది. గురువారం సాయంత్రం నుంచే తల్లుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కావడం మొదలైంది. ఒక్కో విద్యార్థికి రూ.15 వేల చొప్పున నిధులు విడుదల చేయగా, వాటిలో రూ.13 వేలు తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్నది. ఉదాహరణకు ఇద్దరు పిల్లలు ఉంటే తల్లి బ్యాంకు ఖాతాలో రూ.26 వేలు, ముగ్గురు పిల్లలు ఉంటే రూ.39 వేలు, నలుగురు పిల్లలు ఉంటే రూ.52 వేలు, ఐదుగురు పిల్లలు వుంటే రూ.65 వేలు జమ అవుతున్నాయి. మిగిలిన రూ.2 వేలను పాఠశాలల అభివృద్ధి, నిర్వహణ కోసం జిల్లా కలెక్టర్‌ ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది.

వైసీపీ ప్రభుత్వంలో కంటే చాలా అధికం

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చివరగా 2023 జూన్‌ మూడోవారంలో 1,70,476 మందికి రూ.221 కోట్లు జమ చేశారు. ప్రస్తుతం 1,90,433 మందికి రూ.245 కోట్లు జమ కానున్నది. అయితే ఒకటి, ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో చేరనున్న విద్యార్థులు దీనికి అదనం. అంటే మరో 30 నుంచి 35 వేల మంది వరకూ ఉండవచ్చునని అంచనా. అంటే తల్లికి వందనం సొమ్ములు తీసుకోనున్న విద్యార్థుల సంఖ్య 2.2 లక్షల దాటనున్నది.

1,325 మంది ఖాతాలకు సాంకేతిక సమస్య

జిల్లాలో 1,325 మంది ఎస్సీ విద్యార్థుల తల్లుల ఖాతాలకు సొమ్ములు జమ చేయడానికి సాంకేతిక సమస్య ఉన్నట్టు అధికారులు గుర్తించారు. తల్లుల ఆధార్‌ నంబరుకు ఎన్‌పీఐసీ అనుసంధానం కాకపోవడంతో సొమ్ములు జమ కాలేదు. ఈ నేపథ్యంలో 1,325 మంది శనివారం నగరం, జిల్లాలో పోస్టాఫీస్‌లకు వెళ్లి కొత్తగా ఖాతాలు ప్రారంభించుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కంచరాన రామారావు తెలిపారు. లేదా తమ ప్రాంతంలోని సచివాలయాలకు వెళ్లి అక్కడ సిబ్బందిని సంప్రతించాలని సూచించారు.

20లోపు సచివాలయాలను సంప్రతించాలి

కాగా బ్యాంకు ఖాతాలు సక్రమంగా నిర్వహించుకోకపోవడం, ఈకేవైసీ ప్రక్రియ పూర్తిచేయని కారణంగా అర్హుల జాబితాలో పేర్లు వున్నప్పటికీ ఖాతాలో డబ్బులు జమ కావడం లేదు. ఇటువంటివారు ఈ నెల 20వ తేదీలోగా గ్రామ/వార్డు సచివాలయాల్లో తెలియపరచాలని అధికారులు చెబుతున్నారు. అదే విధంగా ఈ పథకానికి అర్హులై వుండి, జాబితాల్లో పేరు లేని వారు కూడా సచివాలయాల్లో సంప్రతించాలి. జూన్‌ 30వ తేదీన తుది జాబితా విడుదల చేసి, మిగిలిన అర్హులకు జూలై 5న నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.

నాడు ఒక్కరికే...ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికీ...

వైసీపీ అధికారంలో వున్నప్పుడు ‘అమ్మ ఒడి’ పేరుతో పథకాన్ని అమలు చేసింది. అయితే కుటుంబంలో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నప్పటికీ ఒక్కరికే సాయం అందించింది. కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కుటుంబంలో ఎంతమంది పిల్లలు వుంటే అంతమందికీ ‘తల్లికి వందనం’ పథకం కింద సాయం అందిస్తున్నది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

పిల్లల చదువుకు భరోసా లభించింది

పితాని లీల, పినగాడి, విశాఖపట్నం జిల్లా

పెందుర్తి, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పినగాడికి చెందిన పితాని కుమారస్వామి, లీల దంపతులకు ముగ్గురు పిల్లలు. దివ్య ఏడో తరగతి, కోమలి ఆరో తరగతి, తేజ ఒకటో తరగతి చదువుతున్నారు. తల్లికి వందనం పథకం కింద పిల్లల ముగ్గురికీ కలిపి రూ.39 వేలు లీల బ్యాంకు ఖాతాలో శుక్రవారం జమ అయ్యింది. దీంతో తమ పిల్లల చదువుకు ఆర్థికంగా భరోసా లభించిందని తల్లి లీల ఆనందం వ్యక్తం చేసింది. కుమారస్వామి వ్యవసాయ కూలీ.

-------------------

ఒకే కుటుంబంలో ముగ్గురికి...

అక్కయ్యపాలెం (విశాఖపట్నం), జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): నగరంలోని శంకరమఠం ప్రాంతంలో నివాసం ఉంటున్న రెడ్డి రమణ, వరలక్ష్మి దంపతులకు ముగ్గురు పిల్లలు. కుమారుడు రాజు బీవీకే కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం, కుమార్తె స్వీటీ లలితానగర్‌లోని జ్ఞానానికేతన్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి, చిన్న కుమార్తె ప్రహాసిని రెండో తరగతి చదువుతున్నారు. ముగ్గురు పిల్లలకు రూ.13 వేలు చొప్పున మొత్తం రూ.39 వేలు వరలక్ష్మి బ్యాంకు ఖాతాలో జమ అయ్యింది.

-------------------

ముగ్గురు పిల్లలకు....

సాగర్‌నగర్‌ (విశాఖపట్నం), జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ ఎనిమిదో వార్డు పరిధిలోని సాగర్‌నగర్‌ సమీపాన గల తాటిచెట్లపాలెం గ్రామానికి చెందిన చింతాడ రాజు, సంతోషకుమారి దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో పెద్ద కుమార్తె రాజశ్రీ ఎనిమిదో తరగతి, మిగిలిన ఇద్దరు మోహన్‌రావు, లావణ్య ఐదో తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ముగ్గురు పిల్లలకు కలిపి రూ.39 వేలు శుక్రవారం సంతోషకుమారి ఖాతాలో పడ్డాయి. దీంతో ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్‌, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jun 14 , 2025 | 01:31 AM