Share News

తల్లుల్లో ఆనందోత్సాహాలు

ABN , Publish Date - Jun 14 , 2025 | 01:24 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం డబ్బులు గురువారం సాయంత్రం నుంచే తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు, ఇంటర్‌ రెండో ఏడాది చదువుతున్న పిల్లలు ఎంత మంది వుంటే అంత మందీకి నగదు జమ అవుతున్నది. దీంతో తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తల్లుల్లో ఆనందోత్సాహాలు
ముగ్గురు పిల్లలతో బొజ్జయ్య, నారాయణమ్మ దంపతులు

బ్యాంకు ఖాతాల్లోకి ‘తల్లికి వందనం’ డబ్బులు జమ

కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ పథకం వర్తింపు

ముగ్గురు పిల్లలుంటే రూ.39 వేలు, నలుగురుంటే రూ.52 వేలు, ఐదుగురైతే రూ.65 వేలు..

ఖాతాల్లో డబ్బులు పడినట్టు మెసేజ్‌లు రావడంతో ఉబ్బితబ్బిబ్బు

మిగిలిన రూ.2 వేలు పాఠశాలల నిర్వహణకు కలెక్టర్‌ ఖాతాలో జమ

జాబితాల్లో పేర్లు లేని అర్హులకు మరోసారి అవకాశం

పాడేరు, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం డబ్బులు గురువారం సాయంత్రం నుంచే తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు, ఇంటర్‌ రెండో ఏడాది చదువుతున్న పిల్లలు ఎంత మంది వుంటే అంత మందీకి నగదు జమ అవుతున్నది. దీంతో తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నిరుపేద కుటుంబాల్లో పిల్లల చదువును ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతి బిడ్డకు ఏటా రూ.15 వేల చొప్పున సాయం అందిస్తామని గత ఎన్నికల ముందు కూటమి నేతలు ప్రకటించడమే కాకుండా ‘సూపర్‌ సిక్స్‌’లో చేర్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన హామీని ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్టు ప్రభుత్వం గతంలోనే వెల్లడించింది. ఈ పథకం పేరును ‘తల్లికి వందనం’ అని ప్రకటించింది. గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో రెండో తరగతి నుంచి పదో తరగతి వరకు, ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థుల్లో ఈ పథకానికి అర్హులైన వారి జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించారు. ఇదే రోజున ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జిల్లాలో 1,56,182 మంది విద్యార్థులు ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. వీరికి సంబంధించి 94,781 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.203,03,66,000 జమ అవుతున్నాయి. గురువారం సాయంత్రం నుంచే తల్లుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కావడం మొదలైంది. ఒక్కో విద్యార్థికి రూ.15 వేల చొప్పున నిధులు విడుదల చేయగా, వీటిలో రూ.13 వేలు తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్నది. ఉదాహరణకు ఇద్దరు పిల్లలు ఉంటే తల్లి బ్యాంకు ఖాతాలో రూ.26 వేలు, ముగ్గురు పిల్లలు ఉంటే రూ.39 వేలు, నలుగురు పిల్లలు ఉంటే రూ.52 వేలు, ఐదుగురు పిల్లలు వుంటే రూ.65 వేలు జమ అవుతున్నాయి. దీంతో ఆయా కుటుంబాల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన రూ.2 వేలను పాఠశాలల అభివృద్ధి, నిర్వహణ కోసం జిల్లా కలెక్టర్‌ ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుంది.

నాడు ఒక్కరికే.. ఇప్పుడు ఎంత మందికైనా..

వైసీపీ అధికారంలో వున్నప్పుడు ‘అమ్మ ఒడి’ పేరుతో పథకాన్ని అమలు చేసింది. అయితే కుటుంబంలో చదువుకునే పిల్లలు ఎంత మంది ఉన్నప్పటికీ ఒక్కరికే సాయం అందించింది. కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కుటుంబంలో ఎంత మంది పిల్లలు వుంటే అంతమందికీ ‘తల్లికి వందనం’ పథకం కింద సాయం అందిస్తున్నది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

పాడేరు మండలం లగిశపల్లి పంచాయతీ ఉగ్గంగొమ్మి గ్రామానికి చెందిన కొర్రా మహాలక్ష్మికి ముగ్గురు పిల్లలు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నారు. తన ఖాతాలో రూ.39 వేలు పడ్డాయని ఆనందం వ్యక్తం చేసింది. ఇదే గ్రామానికి చెందిన కొర్రా వసంతకు రూ.39 వేలు అందాయి. ఇవి ఉదహరణలు మాత్రమే. ఏజెన్సీలో ముగ్గురు నుంచి ఆరుగురు వరకు పిల్లలున్న కుటుంబాలు చాలా వున్నాయి. తల్లికి వందనంతో వీరందరికి ప్రయోజనం చేకూరనుంది.

డబ్బులు జమకాకపోతే..

పాఠశాలల్లో పిల్లలు చదువుతున్నప్పటికీ తల్లుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ కాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 26 తేదీలోగా గ్రామ సచివాలయానికి వెళ్లి వివరాలు అందజేయాలి. అలాగే ఈ ఏడాది ఒకటో తరగతి, ఇంటర్‌ మొదటి సంవత్సరం అడ్మిషన్లు పూర్తయిన తరువాత ఆయా విద్యార్థుల తల్లులకు కూడా ఈ పథకం కింద సాయం అందనున్నది.

చంద్రబాబు మాకు దేవుడు

నర్రు శ్యామల, టైలర్‌, పాడేరు

మాకు ముగ్గురు పిల్లలు. నేను టైలరింగ్‌ చేస్తుంటాను, నా భర్త రమేశ్‌ ఒక హోటల్‌లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించేకుంటూ పిల్లలను చదివించుకుంటున్నాం. పెద్ద కుమార్తె స్వాతి తన్మయి ఇంటర్‌ రెండో సంత్సరం, పెద్ద కుమారుడు మోదసాయికార్తికేయ 10వ తరగతి, చిన్న కుమారుడు నిహల్‌ తేజ 2వ తరగతి చదువుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం కింద ఒక్కొక్కరికి రూ.13 వేల చొప్పున రూ.39 వేలు శుక్రవారం నా బ్యాంకు ఖాతాలో జమ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. చంద్రబాబు మాకు దేవుడితో సమానం

ముగ్గురు పిల్లలకు ‘తల్లికి వందనం’

జి.మాడుగల, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని భీరం పంచాయతీ వి.కోడాపల్లి గ్రామానికి చెందిన తూబె బొజ్జయ్య, నారాయణమ్మ దంపతులకు నలుగురు సంతానం. వ్యవసాయంపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పెద్ద కుమార్తె ఈ ఏడాది ఇంటర్‌ పూర్తి చేసింది. రెండో కుమార్తె దేవి ఇంటర్‌ చదువుతోంది. ఒక కుమారుడు 8వ తరగతి, మరో కుమారుడు మహేవ్‌ 6వ తరగతి చదువుతున్నారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు వుంటే అందరికీ ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయడంతో ముగ్గురు పిల్లలకు రూ.39 వేలు నారాయణమ్మ బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. గత ప్రభుత్వంలో ఒక్కరికి మాత్రమే సాయం అందగా, కూటమి ప్రభుత్వం పిల్లలందరికీ సాయం అందించడం గొప్ప విషయమని బొజ్జయ్య, నారాయణమ్మ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.

సీలేరులో..

సీలేరు, జూన్‌ 13, (ఆంధ్రజ్యోతి) : జీకేవీధి మండలం సీలేరు దుర్గా వీధికి చెందిన కొర్రా శివకుమార్‌, దుర్గ దంపతులకు ముగ్గురు పిల్లలు. స్థానిక పాఠశాలలో చదువుతున్న వీరి పేర్లు ‘తల్లికి వందనం’ జాబితాలో వున్నాయి. దీంతో దుర్గ బ్యాంకు ఖాతాలో శుక్రవారం ఒకేసారి రూ.39 వేలు జమ అయ్యాయి. గత ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో ఒక్కరికే సాయం చేసిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పిల్లలందరికీ ‘తల్లికి వందనం’ కింద సాయం అందజేయడం చాలా ఆనందంగా వుందని దుర్గ అన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 01:24 AM