అనుమానాలు అనేకం
ABN , Publish Date - Jun 14 , 2025 | 01:27 AM
అనకాపల్లి జిల్లా పరవాడ రాంకీ ఫార్మా సిటీలో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత సాయి శ్రేయాస్ కంపెనీలో విషవాయువులు పీల్చి ఇద్దరు సేఫ్టీ అధికారులు చనిపోయిన ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఘటన నేపథ్యంపై ‘సాయి శ్రేయాస్’ ఫార్మా గోప్యత
నోరు మెదపని ‘ఫ్యాక్టరీస్’ అధికారులు
డ్యూటీ నుంచి ఇంటికి వెళ్లిపోయిన సేఫ్టీ విభాగం అసిస్టెంట్ మేనేజర్ చంద్రశేఖర్ను తిరిగి రప్పించిన యాజమాన్యం
వెళ్లిన కొద్దిసేపటికే మృతి...
విచారణ జరిపించాలని భార్య డిమాండ్
కంపెనీలో ఉద్యోగులకు వేధింపులు
సేఫ్టీ అధికారులకు ఇతర బాధ్యతలు
విశాఖపట్నం, జూన్ 13 (ఆంధ్రజ్యోతి):
అనకాపల్లి జిల్లా పరవాడ రాంకీ ఫార్మా సిటీలో బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత సాయి శ్రేయాస్ కంపెనీలో విషవాయువులు పీల్చి ఇద్దరు సేఫ్టీ అధికారులు చనిపోయిన ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాజమాన్యం ఉద్యోగుల పట్ల కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నదని, ఎవరైనా పని గంటలు, హక్కుల కోసం ప్రశ్నిస్తే వారిని వెంటనే ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఇంటికి వెళ్లిపోయిన వారిని రప్పించారు
సాయి శ్రేయాస్ సేఫ్టీ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న పి.చంద్రశేఖర్ బుధవారం డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లిపోయారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో కంపెనీ నుంచి రమేశ్ అనే వ్యక్తి ఫోన్ చేసి, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేయాలి రమ్మని ఆదేశించడంతో పది గంటలకు ఆయన బయలుదేరి వెళ్లినట్టు భార్య కుసుమ చెబుతున్నారు. అలా వెళ్లినప్పుడు ఆ పని చూసుకొని ఒకటి, రెండు గంటల్లో వచ్చేస్తారని, ఆ రోజు ఇంకా రాకపోయేసరికి తాను 12 గంటలకు ఫోన్ చేశానని, ఆయన ఫోన్ ఎత్తలేదన్నారు. ఒకవేళ మీటింగ్లో ఉండి మాట్లాడలేని పరిస్థితి ఏదైనా ఉంటే...ఆ వాయిస్ వినిపించేవారని, ఆ రోజు ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చి ఆయన కొలీగ్ నంబర్కు ఫోన్ చేయగా, ఒక్క రింగ్కే లిఫ్ట్ చేసి ప్రమాదం జరిగిందని చెప్పారన్నారు. కిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళుతున్నారని చెప్పారని, ఆ తరువాత ఆరా తీస్తే అసలు కంపెనీలోనే ఆయన చనిపోయారని తెలిసిందన్నారు.
యాజమాన్య ప్రతినిధులు తన భర్తతో అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని, ఆయన అసిస్టెంట్ మేనేజర్ అయినప్పటికీ సేఫ్టీ పనులు కాకుండా ఎవరైనా కంపెనీకి వస్తే రైల్వేస్టేషన్కు, ఎయిర్పోర్టుకి వెళ్లి వారిని పికప్ చేసుకొని రావాలని డ్రైవర్ డ్యూటీ చేయిస్తున్నారని కుసుమ ఆరోపించారు. ఇదే అంశంపై తాను భర్తతో ఒకటి, రెండుసార్లు గొడవ పడ్డానని, నువ్వు డ్రైవర్వా? అసిస్టెంట్ మేనేజర్వా?...అని అడిగానన్నారు. చాలామంది అక్కడి వేధింపులు భరించలేక మానేస్తున్నారని, తన భర్త కూడా మానేయాలని అనుకున్నా...చంటిపిల్ల ఉండడంతో వెంటనే వేరే ఉద్యోగం దొరక్కపోతే ఎలా?...అని ఆలోచించారని పేర్కొంది. యాజమాన్య ప్రతినిధులు ఒకటి, రెండు సార్లు బెదిరిస్తే...తనకు కూడా సర్కిల్ ఉందని ఆయన చెప్పడంతో వారు వెనక్కి తగ్గారని ఆమె తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై తనకు అనుమానాలు ఉన్నాయని, విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
ఘటన నేపథ్యంపై గోప్యత
సాయి శ్రేయాస్లో విషవాయువులు అని అధికారులు చెబుతున్నారే తప్ప అది ఏమిటనేది సాంకేతికంగా బయటకు చెప్పడం లేదు. ఒక అధికారి అక్కడ హైడ్రోజన్ సల్ఫైడ్ (హెచ్2ఎస్) విడుదలైందని చెబుతుంటే...దానిని ప్రజాశాస్త్రవేత్తల బృందం ఖండిస్తోంది. ఏ రకమైన రసాయనాలు అక్కడ ఉన్నాయో చెప్పకుండా హెచ్2ఎస్ అని ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నిస్తోంది. ఈ ప్రమాద ఘటన క్రమం ఏమిటి?, ఏ రసాయనాల వల్ల జరిగిందనేది కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఫ్యాక్టరీస్ విభాగం పెద్దలు చెప్పడం లేదు. అసలు ఫ్యాక్టరీస్ విభాగం అక్కడ ఏ రకమైన తనిఖీలు చేసిందో కూడా వెల్లడించడం లేదు. ఆ శాఖ అధికారులు కార్యాలయంలో ఉండడం లేదు. ఫోన్లకు స్పందించడం లేదు. నష్టపరిహారం ఇచ్చేశారు కాబట్టి కేసును క్లోజ్ చేయాలని అంతా కలసి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంటు, దాని నిర్వహణపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాల్సి ఉంది.